లాల్ దర్వాజా మహంకాళీ ఆలయంలో చోరీ

హైదరాబాద్ లో లాల్ దర్వాజా మంహంకాళి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయల విలువచేసే నగలతోపాటు అమ్మవారి వెండి కళ్లని కూడా దొంగలు ఎత్తుకెళ్లడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. నిజాం నవాబు అమ్మవారికి కానుకగా ఇచ్చిన వజ్రాన్నికూడా దొంగలు దోచుకెళ్లారు. ఈ వజ్రాన్ని అమ్మవారికి పెట్టే బొట్టులో పొదిగారు. చాలాకాలంగా ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆధికారులు పట్టించుకోకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందంటూ పెద్దఎత్తున భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆలయంముందు పెద్దఎత్తున ఆందోళనకూడా జరిపారు. దొంగల్ని వెంటనే పట్టుకుని అమ్మవారి నగల్ని రికవర్ చేయాలని భక్తులు కోరుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.