ఆంధ్రాయూనివర్సిటీలో మెస్ చార్జీల కలకలం

 

మెస్ చార్జీల్ని వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఆరుబైటే వర్సీటీ పరిపాలనా భవనం ఎదుట రోడ్డుమీద పడుకుని విద్యార్ధులంతా నిరసన తెలుపుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీల్ని పెంచకపోతే తాము ఎలా స్థిమితంగా చదువుమీద దృష్టిపెట్టగలమని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులమీద పెట్టే పెట్టుబడి దేశాభివృద్ధికి పెట్టే పెట్టుబడి అన్న విషయాన్ని యూనివర్సిటీ వర్గాలు, ప్రభుత్వాలు గుర్తించాలని ఆందోళనకు దిగిన విద్యార్ధులు కోరుతున్నారు. యూనివర్సీటీ పాలకవర్గం మెస్ చార్జీల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేవరకూ తాము ఆందోళనను విరమించే ప్రశ్నేలేదని స్టూడెంట్స్ తెగేసి చెబుతున్నారు. తమను చులకన చేసి మాట్లాడిన రిజిస్ట్రార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలనికూడా విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.