ఆస్తి తగాదాలతో రోడ్డెక్కిన సౌందర్య కుటుంబం

 

 

తెలుగు, కన్నడ, తమళం భాషల్లో ఓ తరాన్ని ఏలిన సూపర్ స్టార్ సౌందర్య. మూడుభాషల్లో లెక్కలేనన్ని సినిమాల్లో తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న హీరోయిన్ సౌందర్యకి మూడు సినీపరిశ్రమల్లోనూ మంచి పేరుకూడా ఉంది. తన నటనతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్న సౌందర్య ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల్ని పోగొట్టుకుంది. ఆమెతోపాటు అన్నకూడా అదే ప్రమాదంలో చనిపోయాడు. అప్పట్నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న సౌందర్యకుంటుంబంలోని ఆస్తి కలహాలు ఇప్పుడు రోడ్డునపడ్డాయి. సౌందర్య అన్న భార్య విమలకూ, సౌందర్య భర్తకూ మధ్య ఆస్తి వివాదాలు కోర్టు గడపలో ఉన్నాయి. తాజాగా సౌందర్య రాసిన వీలునామా బైటపడడంతో ఆమె భర్తకి పచ్చివెలక్కాయ్ నోట్లోపడ్డట్టయ్యింది. సౌందర్య భర్త రఘు.. ఆస్తంతా తనే కొట్టేద్దామని చూస్తున్నాడని, తనని బెదిరిస్తున్నాడని సౌందర్య వదిన విమల కోర్టుకి ఫిర్యాదుచేసింది. తనకీ తన బిడ్డకీ రక్షణ కల్పించాలనికూడా కోరింది. ఎదురుదాడికి దిగిన రఘు, అసలు సౌందర్య విల్లే రాయలేదని, అంతా ప్రత్యర్థి లాయర్ అభూత కల్పన అనీ ఆరోపించాడు. దీంతో సౌందర్య అన్నభార్య తరఫున కేసు వాదిస్తున్న లాయర్.. సౌందర్య భర్తమీద యాభై లక్షల రూపాయలకు పరువునష్టం దావాకూడా వేశాడు. మొత్తంమీద ఈ వ్యవహారంలో సౌందర్యభర్తకే ఎక్కువ ఇబ్బంది కలగొచ్చని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి ఎంత చెందాలో, ఏమివ్వాలో కచ్చితంగా సౌందర్య రాసిపెట్టిపోయినప్పుడు అసలు ఇలాంటి వివాదాలకు తావే లేదని కన్నడ సినీ వర్గాలు అనుకుంటున్నాయి. సౌందర్య రాసిన విల్లు నిజమో కాదో తేల్చి దానిప్రకారమే అమలుచేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మూడు భాషలకూ చెందిన సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.