మావోయిస్టు కీలక నేతలు అనంత్, చైతు సహా 20 మంది లొంగుబాటు
posted on Nov 29, 2025 @ 3:07PM
నక్సల్స్ సీనియర్ నాయకుడు చైతుతోసహా పది మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరందరి తలపై కలిపి మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు వారంతట వారే జగదల్పూర్లోని సీనియర్ పోలీస్, సెంట్రల్ రిజర్వు పోలీస్, అధికారుల ముందు లొంగిపోయారని ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజ్ పట్టిలింగం వెల్లడించారు. మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా(63) లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి తేరు కోలేని దెబ్బగా పోలీసు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన చైతు అసలు పేరు గిరడ్డి పవనానందరెడ్డి. 1985లో మావోయిస్టుల్లో చేరిన చైతు తలపై రూ. 25లక్షల రివార్డు ఉంది.
2013 లో జిరామ్ వ్యాలోలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని దాదాపు తుడిచిపెట్టేసిన దాడిలో చైతూ ప్రధాన సూత్రధారి. చాలా సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ దర్భా విభాగానికి నాయకత్వం వహిస్తున్న చైతూ, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో చురుకుగా ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్లలో ఒకడు. లొంగిపోయిన వాళ్లలో డివిజనల్ కమిటీ సభ్యురాలు సరోజ్ అలియాస్ ఊర్మిళ , ఏరియా కమిటీ సభ్యులు భూపేశ్ అలియాస్ సహాయక్ రామ్, ప్రకాష్, కమలేష్ అలియాస్ జిత్రు, జనని అలియాస్ రేమతి కశ్యప్, సంతోష్ అలియాస్ సన్ను మరియు నవీన్, పార్టీ సభ్యులు రాంశీల, జయంతి కశ్యప్ ఉన్నారు. ఆపరేషన్ కగార్ తో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు, ఇటీవలి కాలంలో పార్టీలో అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో వీరు లొంగిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం లొంగిపోయిన వారికి పునరావాస ప్రయోజనాలు అందిస్తామన్నారు.
మరో సంఘటనలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ట్రాల్లో రూ. కోటి రివార్డు ఉన్న అనంత్, మరో 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్స్టేషన్లో లొంగిపోయీరు. లొంగుబాటుకు గంటల ముందు ఆయన వచ్చే ఏడాది జనవరి 1న లొంగిపోతామని లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం. . ఈ ఘటన ఎంఎంసీ జోన్లో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా బలహీనపడిందని చెప్పవచ్చు