మదమెక్కి కొట్టుకుంటున్న హర్యానా వాసులు!

 

అవును మీరు చదువుతున్నది నిజమే. ఏటా విపరీతంగా పెరిగిపోతున్న మానభంగాల్ని, దళితమహిళలపై జరుగుతున్న అరాచకాల్ని అరికట్టాలంటే పదహారేళ్లకే మగపిల్లలకు పెళ్లిళ్లు చేసేయాలని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంత బాహాటంగా బాల్యవిహాహాల్ని సమర్ధిస్తున్న ఆ సెల్ఫ్ డిక్లేర్డ్ సామాజిక శాస్త్రవేత్తలు హర్యానాలో పంచాయతీలుకూడా చేసేస్తుంటారు. ప్రత్యేకించి దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు పంచాయతీపెట్టేసి నామమాత్రపు రుసుమును తప్పుకింది కట్టించేసి మ్యానేజ్ చేయడంలో ఈ పెద్దరాయుళ్లు బాగా సిద్ధహస్తులు. తాజాగా హర్యానాలో పదహారేళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయాన్నికూడా పెద్దరాయుళ్లు విలేజ్ కోర్ట్ లోనే తేల్చేయాలని చూశారు. కానీ.. బాధితులు అడ్డం తిరగడంతో అది కోర్టు వరకూ వెళ్లింది. సాక్ష్యం చెప్పినా, బాధితులకు అండగా నిలబడినా చంపేస్తామంటూ తెగబలిసి కొట్టుకుంటున్నవాళ్లు బాధితవర్గాన్ని బెదిరిస్తుంటే తీర్పులు చెప్పి నేరాన్ని కప్పిపుచ్చి మసిబూసి మారేడుకాయజేసి జరిగిన తప్పుని ఒప్పుగా మార్చేసే పెద్దరాయుళ్లు చోద్యం చూస్తున్నారటకూడా. హర్యానాలో ఈ సంవత్సరం దాదాపు 650 రేప్ లు జరిగాయ్. ఒళ్లు మదమెక్కితే రేప్ లు చేస్తారు కాబట్టి, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేస్తేపోలా అని ఉచిత సలహాలు కూడా పంచాయతీలు చేసే పెద్దలు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారట.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.