కిరణ్ పై షర్మిల వాగ్బాణాలు

 

“రాష్ట్రంలో ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమౌతుంటే ముఖ్యమంత్రి మొద్దునిద్రపోతున్నారా లేక ఏమీ చేయలేక మొద్దనిద్రని నటిస్తున్నారా ?” అంటూ వై.ఎస్ తనయ షర్మిల ముఖ్యమంత్రిపై విమర్శలు కురిపించారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా కడపజిల్లా వేంపల్లె దగ్గర్లోని రాజీవ్ నగర్ నుంచి వేముల మండలం భూమయ్యగారి పల్లె మలుపు వరకూ రెండోరోజు పాదయాత్ర చేశారు. రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, వై.ఎస్ హయాంలో అమలుచేసిన పంటలబీమా పథకాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని షర్మిల విమర్శించారు. మళ్లీ అధికారంలోకొస్తే రైతులకు న్యాయం చేస్తానంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆమె అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యల్ని గుర్తుచేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రని టార్గెట్ చేస్తూ షర్మిల పాదయాత్రను మొదలుపెట్టారని వస్తున్న ఆరోపణల్ని ఆమె కొట్టిపారేశారు. తన యాత్ర పూర్తయ్యేలోపు జగన్ జైలునుంచి బైటికొస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, వై.ఎస్ హయాంలో జరిగిన మంచి పనుల్ని ఏకరువుపెడుతూ ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రయత్నంచేస్తూ.. షర్మిల పాదయాత్రలో ముందుకు కదులుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.