"అరే! శ్యామలా! ఇంకొకరి ఉత్తరాలు చదవడమా? చదువుకున్నది కూడా!" ఆశ్చర్యంగా అన్నాడు.
"హుఁ. చదువుకూ, సంస్కారానికీ చాలా దూరం ఉంది. స్వభావాలను చదువులు మార్చలేవు. ఎంతో బాధ పడ్డాను. ఆ కోపంలో వదినని మాటకు మాటకూడ అనేశాను. ఆ తర్వాత మీ క్రొత్త అడ్రస్ తో ఉత్తరం వచ్చింది, అన్నయ్య పేరున. ఏడుస్తూన్న నా హృదయానికి ఊరట లభించింది. మళ్ళీ యేమేమో వ్రాశాను మీకు. మీనుండి జవాబు కోసం వెయ్యి నేత్రాలతో చంద్రునికోసం చకోరిలాగా ఎదురుతెన్నులు చూచాను. కాని అన్నయ్యకేకాని నాకు రాలేదు ఉత్తరం. ఎంతో నిరుత్సాహపడ్డాను. బహుశః తరుచు వ్రాయడానికి మొహమాటపడ్డారో, లేక ఆలోచించు కుంటున్నారో అని సరిపెట్టుకున్నాను. కాని నిన్న మీరు చెప్పడంతో తెలిసిపోయింది ఉత్తరం ఏమైందో!"
"ఏమైందంటారు?"
ఒక్కక్షణం ఆగి చెప్పింది మెల్లగా శాంతి: "రామన్న ఆరోజు వచ్చిన టపా తెస్తోంటే ఆపి చిన్నవదిన పరీక్షించి అందులో ఒక ఉత్తరం తనదంటూ తీసుకొందట. అప్పుడు దానిగురించి అంతగా ఆలోచించలేదు. కాని ఇప్పుడనుమానించ వలసి వస్తోంది. అనుమానమేమిటి? నిర్ధారణ కూడ!"
"ఏమిటందులో ఆవిడకుగల ఆనందం?" హేయభావంతో అడిగాడు రాజా.
"ఎదుటివారిని ఏడిపించటమే. ఇంతకూ ఏం వ్రాశారందులో? ఏమిటా సమస్య?"
"నేను ఉద్యోగం చేసే కంపెనీలో ఒక 'రిసెప్షనిస్ట్ గర్ల్' వుండేది. పేరు శశి. సాధరణంగా నాకామెతో అంతపని వుండదు. స్నేహమూ లేదు. ఒకనాడు ఆమె ఎవర్నో ఓ వంద రూపాయలు బదులడుగుతోంది. అతడికీ అక్కడే ఉద్యోగం లెండి. తండ్రీ, తనూ తప్ప తనకింకెవ్వరూ లేరనీ, ఆయనకు జబ్బుచేసింది, మందులకూ ఏమీలేదనీ, త్వరలో తీర్చేస్తాననీ ప్రాధేయపడుతూంది. తన దగ్గర లేదనీ, అయినా సాయంత్రం ఒకసారి యింటికివచ్చి కలుసుకొమ్మనీ అతడంటున్నాడు. దీనాతిదీనమైన ఆమె స్థితీ, ఆ ప్రాధేయపడటమూ చూచి నాకు జాలైంది. నేనూ దానకర్ణుడిని కాను; అనవసర విషయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోను. కాని ఆరోజున ఏమిటోదయనీయమైన ఆమె పరిస్థితి వింటే మనస్సు కదిలిపోయింది.
'నేనిస్తానండి' అంటూ దగ్గరికి వెళ్ళి ఆమెకు రెండు వందలకు చెక్కు వ్రాసియిచ్చాను. ఆమె విస్తుపోతూ 'దైవంలా వచ్చా'రని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె తండ్రి జబ్బు తగ్గింది. క్రమంగా నాడబ్బు కూడ దఫదఫాలుగా తీర్చసాగింది. ఆ కారణంవల్ల యిద్దరం ఎప్పుడైనా మాట్లాడుకోవడం కూడా తటస్థించేది. కాని మెల్లగా రకరకాల విసుర్లు, సూటిపోటీ మాటలు విన్పించసాగాయి. నా పరధ్యానానికీ, ఆమెతో పరిచయానికీ ముడిపెట్టారు. అందుకు కారణం ఆ ఆఫీసరేనని తర్వాత తెలిసింది. అతడు లేదంటే నేను వెళ్ళి యివ్వడం అతడికి అవమానంగా భావించాడు. అదీకాక అతఃడు దుర్మార్గుడు కూడ. అందుకే ఆమెకు నేను సాయం చేయటంవల్ల అంతకోపం వచ్చింది. నాకు చికాకన్పించి రాజీనామా యిచ్చి వెళ్ళిపోయాను. బెనర్జీ మంచివాడు గనుక మీకు యివేమీ వ్రాయలేదనుకుంటా."
"అవును. కాని యిందులో మీరు యితరులను కోరవలసినంత సలహా ఏముంది?"
"ఉండండి, మరీ. అప్పుడే కథ అయిపోలేదు. నేను మావూరెళ్ళి స్థిరపడిపోయాను. అక్కడ నాకో యిల్లుంది. 'నాకు ఉద్యోగం చేయక పోయినా లోటులేదు. నీవు స్త్రీవి. పైగా నీ తండ్రిని పోషించాలి. అందుకే నీ క్షేమం కోరి నేను వచ్చేశాను. లోకులు కాకులు. మనస్సులో ఏమీ పెట్టుకోక లక్షణంగా ఉద్యోగం చేసుకొమ్మని వ్రాశాను ఆమెకు. జవాబులేదు. వారం రోజులు తిరిగేసరికి ఆశ్చర్యమైంది; ఆమెకూడా మావూరు వచ్చేసింది. అదీ మరీ పల్లెటూరు కాదు. ఏదో ఒకవిధమైన బజారూ, చిన్న అసుపత్రీ అవీ వున్నాయి.
'ఇక్కడేదో ఉద్యోగం వెతుక్కోవాలని వచ్చాను. ఆ కాకుల మధ్య చెయ్యలేకుండా వున్నాను' అంది.
'అయితే మీవూరు యిదా?' అని ఆశ్చర్యం ప్రదర్శించింది.
'అయితే నా ఉత్తరం అందలేదా?' అనడిగాను.
'లే' అంది."
వింటూన్న శాంతి కుతూహలం ప్రదర్శించింది. "అయితే అందీ అబద్దమాడిందంటారా?"
"ఏమో, శాంతీ. నేనిక ఆ విషయం గురించి ఆలోచించలేదు. నిరాధార నిర్ణయాలు చేయటం దేనికీ?"
"ఊఁ. తర్వాత?"
"తర్వాత యిక చెప్పకపోయినా ఊహించుకో గలరు. ఒకమాదిరి పల్లెటూరు కావడంతో చిలవలూ, పలవలతో విస్తరించిపోయిన కథలకు అంతులేకుండా పోయింది మా యిద్దరిగురించీ. మొదట్లో చలించిపోయాను ఈ విపరీత పరిణామానికి. తర్వాత ఆలోచించాను. సరే. ఆమె ఆ వూరునుంచి వెళ్ళిపోతే ఫర్వాలేదనుకున్నాను. పాపం ఆమెకూడా చాలా మంచిది. అదీకాక ఉద్యోగం మీదే ఆధారం. రెండు విధాలుగా బాధపడుతోంది. అందుకని ఆలోచించి ఒక పని చేశాను.
"మదనపల్లి శానిటోరియంలో డాక్టరు ఒకాయన నా స్నేహితుడు. ఆయనతో మాట్లాడి ఆమె కక్కడ నర్సు ఉద్యోగ మిప్పించాను. చాలా కృతజ్ఞత తెల్పింది. కాని నేనూహించినట్టు విమర్శలు అంతం కాలేదు. ఆమెకు నేను ప్రయత్నించి ఉద్యోగం వేయించటానికి పూర్వ గాధ చాలావుందని ధృవపరిచారు."
"ఏడిశారు. వాళ్ళ మాటకేంగాని, మీరు చాలా మంచిపని చేశారు. లేకుంటే పాపం ఆమె యేమైపోయి వుండేది?"
"అది నిజమే. కాని యింత దూరాన వుండి మీరు అన్నంత సులభంగాదు చూడండి, ఆ విమర్శలను తట్టుకోవడం. చెప్పుకొని మనస్సు తేలిక చేసుకోవటానికి కూడ ఎవరూ లేరు. అందుచేత బెనర్జీ కొక ఉత్తరం వ్రాశాను ఈ విషయాలన్నీ వివరిస్తూ."
"వ్రాస్తే?"
"ఇదివరలో బెనర్జీ చాలా విశాల హృదయుడని అనుకొనేవాడిని. కాని అతడిచ్చిన జవా బెలా వుందో తెలుసా? 'నిప్పులేనిధే పొగరాదు. లోకం గ్రుడ్డిది కాదు. బహుశః నీకు తెలియకుండానే నీలో ఆ కొరియా వుందేమో! లేకుంటే ఎవతెకోసమో ఉద్యోగం వదులుకు పోవడమేమిటి? ఆమెకూడా నిప్పు వెంబడించడమేమిటి? స్పష్టంగా కన్పించే దానికి తెరలు వేయ ప్రయత్నించడం వృథా శ్రమ' - అని."
"ఎంత సంకుచిత స్వభావం!" సానుభూతిగా అంది శాంతి.
"సరిగా ఆ సమయంలోనే మీ ఉత్తరం వచ్చింది. నేననుకున్నానప్పుడు - 'సరే. ఈవిడ అభిప్రాయం ఎలా ఉంటుదో చూద్దా'మని."
"ఏం?"
"ఏమీలేదు. మీరూ చాలా విశాల హృదయులని నా అంచనా. బెనర్జీ విషయంలో తప్పిపోయిన నా అంచనా మీ విషయంలో ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అదీకాక మీ ఉత్తరం చూచి నేను చాలా కదిలిపోయాను. ఎటూ నిర్ణయించుకోలేకపోయాను. ద్వైధీ భావాలతో సతమతమయ్యేవాడికి చివరికి శరణ్యమయ్యేది ఒక్కటే - లాటరీ! అదే చేశాను.
"మీ స్వభావానికి పరీక్ష పెట్టాను- శశి విషయంలో మీరు ఉదారత ప్రదర్శించి నా ప్రవర్తనను సమర్ధిస్తే మీతో నా జీవితం ఆనందప్రదం కాగలదనీ, లేక బెనర్జీలాగే మీరూ నన్ననుమానిస్తే మనసు సరిపడదనీ. అందుకే ఉత్తరం వ్రాసి మీ జవాబుకోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. శ్రీహరి నుంచి జవాబు వచ్చింది. మీనుంచి రాలేదు. మీరూ నన్ననుమానించారు. బాగా కోపం వచ్చింది. బెనర్జీ విషయమంతా వ్రాసి ఉంటాడని అనుకున్నాను.
"నాకు మీమీద ఎప్పుడూ కోపం రాలేదు. కాని అప్పుడు వచ్చింది. 'నేనామెను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తృణీకరించినా కోపం తెచ్చుకోలేదు. గోవిందరావు విషయంలో కూడా అసూయపడకుండా ఆమె క్షేమాన్ని కాంక్షించాను. సాయపడదామని చూచాను. ఆ రోజు కలకత్తాలో గోవిందరావు తో సంప్రదింపులు వ్యర్ధమైనప్పుడు అతడి నెలాగైనా ఒప్పించి తనకు శాంతి కూర్చుదామనే ఉద్దేశ్యంతో రాత్రికి రాత్రి శాంతినికేతన్ వెళ్ళాను. ఆమెను అనేక విధాల ఓదార్చాను. ఉత్తరాలు వ్రాస్తున్నాను. అటువంటి నాకు ఈ ఒక్క విషయంలో - అందునా ఒక యదార్ధ దూరమైన విషయంలో సానుభూతి చూపలేక పోయింది; నన్నర్ధం చేసుకోలేకపోయింది. ఇటు వంటి వ్యక్తి నాకెందుకు? ఇక ఆమెను తలపెట్టరదు. ఆమెకోసం నా జీవిత మెందుకు వ్యర్ధం చేసుకోవాలి? ఇకనైనా నేను వివేకంతో నా సుఖం చూచుకోవాలి. శాంతిని మరిచిపోవాలి- - అని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయంతోనే కాస్త నాలుగు వూళ్ళూ తిరగాలనే అభిప్రాయం కూడా కలిగింది.
"ఇక్కడకు రావాలనే ఉద్దేశ్యమే లేదు. టిక్కెట్టు వాల్తేరుకు తీసుకున్నాను. కాని ఏమిటో రాజమండ్రిలో మెయిలాగడంతో ఇక మనస్సు నిగ్రహించుకోలేకపోయాను. దిగక తప్పలేదు. కాని దిగిన తర్వాత కూడా యిక్కడకు రావటమా, మానటమా అనే ఆలోచనతోనే ఆ రాత్రంతా రాజమండ్రీలో హోటల్ గదిలో గడిపేశాను. వెనుక ఒకసారి ఈ వివాహప్రసక్తి వచ్చినప్పుడు శ్రీహరీ, నేనూ ఒక నిర్ణయానికి వచ్చాం - 'దీని ఫలితాలెలా ఉన్నా మన స్నేహం దెబ్బతినరా'దని. ఆ ఒక్క నిర్ణయానికీ కట్టుబడి నిన్న ఉదయమే ఇక్కడికి వచ్చాను. సరే, ఉత్తరం సంగతి ఎత్తేసరికే మీరు విచారంతో నా దగ్గరినుంచి వెళ్ళిపోయారు. దానితో నాలో యింకా యే మూలనైనా అనుమానముంటే అది ద్రువపడిపోయింది. మీమీద సదభిప్రాయం ఆ సంఘటనతో పూర్తిగా సడలిపోయింది. 'కేవలం స్వార్ధపరురాలు!' అనుకొన్నాను. నిన్న పగలంతా మీరు మళ్ళీ నాకు కన్పించలేదు కూడా! ఆ కోపంలోనే నిన్న రాత్రి తోటలో శేషయ్యగారు అడగగానే అంగీకరీంచాను. అంగీకరించానేగాని నాకు నమ్మకం లేదు. ఈ వివాహం వల్ల నాకేమాత్రమూ సుఖశాంతులు ఉండవు." చెప్పటం ముగించి రాజా తల ఎత్తేసరికి శాంతి నేత్రాలనుండి హిమనదాలు ప్రవహిస్తున్నాయి.
"శాంతీ! ఎందు కేడుస్తారు? ఎవరో ప్రేమికుల్ని విడదీసి మహాపాపానికి ఒడిగట్టిన మూర్ఖులమై ఉండాలి మనం. అందుకే యిలా అందీ అందకుండాచేసి మన జీవితాల చుట్టూ విషవలయాలు అల్లి ఆడుకుంటున్నాడు దైవం."
"అవును. పపాత్మురాల్ని. దురదృష్టవంతురాల్ని. లేకుంటే యింత తెలివితక్కువేమిటి? ఆరంభంలో మిమ్మల్ని గుర్తించలేక పోగొట్టు కున్నాను. తర్వాత తర్వాత తెలుసుకొనీ నా మనస్సును ఎవ్వరికీ చెప్పలేక వూరుకున్నాను. ప్రతిదీ చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. జుయ వెళ్ళి పోతానంటే వద్దని నేనే ఆపుజేశాను. ఉత్తరం విషయం కనీసం నిన్న మీరు చెప్పిన తర్వాత నైనా ఆరా తీసి ఉంటే మిమ్మల్ని దక్కించుకుని ఉందును. కాని అదీ చేయలేకపోయాను. కుటుంబంలో మరో కలహం రేగగలదని భయపడ్డానే కాని అమృతభాండాన్ని కూలద్రోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను." బాధగా నుదురు కొట్టుకుంది.
రాజా నేత్రాలు కూడ సజలమయ్యాయి. "భగవంతునికి మన కలయిక యిష్టంలేదు, శాంతీ."
ఆగ్రహ నిర్లక్ష్యాలు పెనవేసుకొనగా గుండెలు పిండే బాధతో అంది శాంతి: "హుఁ. భగవంతుడు!
అసలు వున్నాడా అని!"
అదిరిపడ్డాడు రాజా. "వద్దు, శాంతీ. అంతంత మాటలు వద్దు. ఆ ఆలోచనే అసలు చాలా అసహ్యకరం; ప్రమాదకరం."
"ఎందువల్ల? అలా ఎందుకన్నానో కారణం వింటారా మరి?"
"ఏమిటి?"
"మీదగ్గరా, పెద్దన్నయ్య దగ్గరా నాకు రహస్య సంకోచాలు లేవు. అన్నీ చెప్తాను." కొద్ధిసేపు ఆగి చెప్పడం మొదలుపెట్టింది. "ఇంకా గోవిందరావు విషయం విఫలం కాక ముందు జరిగిన సంగతి. అతడి విషయంలో ఆశ వదులుకొమ్మనీ, కాదని నేను పట్టుబడితే ఎదురవ్వగల విపత్కర పరిస్థితులూ కనులకు కట్టినట్టు వర్ణించాడు పెద్దన్నయ్య. 'ఈ కుటుంబంలో శాంతిని నాశనంచేయకు, శాంతీ'- అంటూ కన్నీళ్ళతో అర్ధించాడు. నా మనస్సు హాలాహలమై పోయింది. ఎటూ నిర్ణయించుకోలేకపోయాను. రాత్రింబవళ్ళు పరిష్కారం తెలియని అనేక సమస్యలు పెనుభూతాల్లా కళ్ళెదుట నిల్చుని సుఖశాంతుల నపహరించేవి. అదే సమయంలో చిన్నన్నయ్య అందరి మాటలూ త్రోసిపుచ్చి, నొప్పించి భార్యతో 'హనీమూన్'కు వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది నాకు పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమానురాగా లెలా వుంటాయో, అవి గ్రహించకపోతే వారెంత బాధపడతారో! అందుకే నా నిర్ణయాన్ని వారి కోసం మార్చుకోదలుచుకున్నాను.
"అప్పుడే మనోరమ వివాహమైంది. 'మరి నీ జీవితాని కెప్పుడు అటువంటి శుభదినం?' అంటూ నాన్నగారు సంభాషణ క్రమంగా నా వివాహం మీదకు మళ్ళించారు. 'మీ రెవర్ని చేసినా అంగీకారమే. మీసంతోషమే నా సంతోషం. మీ యిష్టప్రకారమే కానివ్వండి' అన్నాను. నాన్నగారి వదనంలో వేయి జ్యోత్స్నలు వెలుగొందాయి. 'చాలు. నేను జీవితాంతం ఏడ్చినా ఫర్వాలేదు ఆ వృద్ధులకు సంతోషమైతే అంతే చాలు' అనుకున్నాను. కాని హృదయంలోని సాగరమథనాన్ని తట్టుకోలేకపోయాను. చేసుకున్న నిర్ణయాలన్నీ యేమై పోయాయో - నాన్నగారు తేబోయే పూర్తి అపరిచిత వ్యక్తితో ఎట్లా గడపగలవో ఊహించుకోలేకపోయాను. ఆ విపరీత మైన బాధతోనే నా గది కిటికీలో నిలబడి వుండగా దూరాన నదిలో తిరిగే పడవలు కన్పించాయి. ఆకాశమంతా మేఘావృతమై వుంది. 'ఈ నిర్మల స్రవంతిలో చీకూ చింతా లేకుండా పయనిస్తున్న యీ పడవలు తుఫాను రేగితే యేమౌతాయి? మానవ ప్రయత్నమా, దైవ ప్రయత్నమా? అప్పుడేది అవసరం?' అనే తర్కం వచ్చింది నాలో.
