Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 48


    శాంతితో గదిలో ప్రవేశించిన రాజా, "ఏమిటిది? మీ నాన్నగారికి జబ్బుచేసిందా?" అంటూ ఆత్రుతగా సమీపించాడు.
    "చేసి తగ్గిందిలే. ఇప్పుడు బగానే వున్నారు. రా, కూర్చో." లేని నవ్వు తెచ్చుకొంటూ ఆహ్వానించాడు రాజాను శ్రీహరి.
    కుర్చీలో కూర్చోబోతున్న రాజాను "ఇలారా, నాయనా. యిక్కడ కూర్చో. చాలారోజులింది నిన్ను చూచి" న్తూ ఆప్యాయంగా పిలిచి ప్రక్కలో కూర్చోబెట్టుకున్నాడు బలరామయ్య.
    "బొత్తిగా యిలా చిక్కిపోయారేమిటి? ఏమిటి అనారోగ్యం?" దిగాడు రాజా.
    "టైఫాయిడ్ వచ్చి తగ్గింది. ఇంకా నీరసం తగ్గలేదు" అన్నాడు శ్రీహరి.
    "ముసలివాడిని, నాకేమిటి కని, నువ్విలా చిక్కిపోయావేమిటి బాబూ? ఇదివరకటంత బలమూలేదు, ఛాయాలేదు. ఏమిటలావున్నావ్?"అడిగాడు బలరామయ్య. "నా అనేవాళ్ళెవారూ లేరు. ఒంటిగాడివి" అంటూ తిరిగి కంట నీరు పెట్టాడు రాజా చేతులు సవరిస్తూ. కుటుంబ సమస్యలతో, బలహీనతచే కలగిపోయిన ఆయనకు మనోనిగ్రహం చెదిరిపోయి అడుగడుగునా కంటతడివస్తూంది.
    "ఎందుకు లేరు? మీరంతా ఎవరు? నావారు కాదా? కానిదే నన్నింత ప్రాణసమంగా ఆదరించి గౌరవిస్తున్నారా పిన్నపెద్దలంతా? కలకత్తానుంచి మావూరు వెళ్ళిపోయాను. స్థలంమార్పువల్ల కొంచెం ఏమైనా మారానేమో. అంతే" అంటూ పద్మవైపు తిరిగి, "ఏమండీ, ప్రశాంతి ఎక్కడ? మాకు చూపరా?" అన్నాడు.
    అంతలో శాంతి చేతులలో ప్రశాంతితో ప్రవేశించింది. తాతగారిమీదకు వాలిపోయింది ప్రశాంతి.
    "వచ్చావా, తల్లీ? ఇంతాలస్యమైందేం?" అంటూ అందుకోబోయాడు బలరామయ్య.
    "ఇటివ్వండి" అంటూ రాజా అందుకున్నాడు ప్రశాంతిని. అప్పుడప్పుడే మనుష్యుల్ని గుర్తు పట్టగలుగుతూంది ప్రశాంతి. రాజాను క్రొత్త వ్యక్తిగా గుర్తించింది. అలా తదేకంగా అతడి ముఖంలోకి అయిదు నిమిషాలపాటు చూచి ఏమనుకుందో ఏమో ముఖమంతా నోరు చేసుకుని నవ్వింది. ముద్దుగా, మృదువుగా ఉన్న ఆ బిడ్డనూ, పసి అమాయకతా, నిర్మల దీప్తిమంతమూ, దైవత్వమూ నింపుకొన్న ఆ మధుర మంజుల హాసాన్నీ చూచి తన్మయుడైపోయాడు. నుదురుపై సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ "చూచారా, పాపకుకూడా నాపై ఎంత ప్రేమో! మీ అందరూ నావారనే సంతోషమే నాకెప్పుడూ కొండంత బలమిస్తూంటుంది" అన్నాడు రాజా.
    "అవును, నాయనా. ప్రేమలకు రక్తసంబంధమే వుండక్కర్లేదు. నిన్ను చూచిన ఎవరు ప్రేమించరు? నీలో ఎంత నిర్మలత్వముందో- ఆ పసిపాప ముక్కూ ముఖమూ తెలియని నిన్ను అంత ఆప్యాయంగా నవ్వులతో పలుకరిస్తోంది" అన్నాడు బలరామయ్య.
    లక్ష్మీదేవి కాఫీ ఫలహారములతో వచ్చింది. "అంతదూరంనుంచి ఎంతో ప్రేమతో వస్తావ్. ఎవరుంటారు బాబూ నీలాగా?" అంది ఆప్యాయంగా.
    రాజా మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు కాఫీ అందుకుంటూ. తర్వాత మెల్లగా చెప్పాడు: "నేను నిన్ననే వచ్చాను. రాజమండ్రి వచ్చేసరికి ట్రెయిన్ చాలా లేటైంది. సరే, రాత్రివచ్చి మిమ్మల్ని యిబ్బంది పెట్టడం దేనికని రాజమండ్రీలోనే లాడ్జిలో ఆగిపోయాను."
    అందరూ మాట్లాడుకుంటూండగా శాంతి మెల్లగా బయటకు వెళ్ళిపోయింది.
    "ఎవరు, శాంతీ, వచ్చారు?" అడిగింది జయలక్ష్మి.
    "రాజా అని అన్నయ్య స్నేహితుడు" అంది శాంతి.
    "ఓహో!" అంటూండగానే జయముఖంలో సిగ్గు, సంతోషం, ఆనందం తాండవించి బుగ్గలు ఎరుపెక్కాయి. అది చూచిన శాంతి క్షణకాలం విస్తుపోయి 'ఈమెకు రాజా సంగతేం తెలుసు?' అనుకొంది. తర్వాత గుర్తువచ్చింది, జయ విషయంలో రాజాతో జరిగిన సంప్రతింపుల విషయం. తనలో తనే నవ్వుకొంది, "బహుశః రాజా యిచ్చిన సమాధానం ఈమెకు తెలియదేమొ!' అనుకుని, 'రాజా! ఎంతటి అపూర్వ వ్యక్తి! ఎంతటి పవిత్ర హృదయుడు! అతడిని వివాహమాడగలిగిన స్త్రీ చాలా ధన్యురాలు, శాంతీ!' మనోరమ ఉత్తరంలో వ్రాసిన విషయం ఆమె కళ్ళెదుట నిలబడి చెప్పుతూన్నట్లనిపించింది. తన గది లోకి నడిచింది.
    టేబుల్ మీద ఎదురుగా 'ఫేర్ వెల్ మై ఫ్రెండ్!' రాజా ఆ పుస్తకమిచ్చిన వేళ ఎటువంటిదోకాని, తమ స్నేహానికి అది 'ఫేర్ వెల్'గా పరిణమించలేదు!
    బీర్వాలో బట్టల అడుగున దాచిన చిత్రాలను తీసింది. ఎందుకో వాటిని గోడకు తగిలించాలనిపించింది. మూడు చిత్రపటాలను తీసి గోడకు తగిలించింది. ఆమె హృదయం ఇవాళ రాజాను చూచాక ఆమె అధీనం తప్పిపోయింది. కాని రవీంద్రుని చిత్రపటం చూచాకమాత్రం ఆ రోజు విషయం మనస్సులో మెదిలి ఆ సంతోషం పాడైపోయింది. ఆ రోజు శాంతి నికేతన్ లో జరిగిన చిత్రప్రదర్శనలో ఆ రవీంద్రుని చిత్రం ప్రదర్శించటం, రాజాను గురించి గోవిందరావు కినుకగా మాట్లాడడం, తాను బాధపడడం అన్నీ గుర్తుకు వచ్చాయి. ఎంతో సంతోషంగా ఆకాశవీధుల విహరిస్తూన్న మనస్సు గోవిందరావు స్మృతితో పాతాళలోకానికి కృంగిపోయింది. ఇక ఆ "ఈ గది బాగుందా?" అంటూ లోపలికి వచ్చి పరీక్షగా చూచిన పద్మ గోడనున్న రవీంద్రుని పటాన్నీ, శాంతినీ మార్చి మార్చ్జి చూడసాగింది. శాంతి సిగ్గుతో తలవాల్చుకు నిల్చుంది.    
    పద్మ మెల్లగా శాంతి దగ్గరికి వెళ్ళి భుజంపై మృదువుగా చెయ్యి వేస్తూ, "గ్రహించాను, శాంతీ. నువ్వు చాలా అదృష్టవంతురాలవు. అయితే నీ మనస్సెప్పుడు మారిందీ? ఈ బహూకరణ లెప్పుడు వచ్చాయి?" అనడిగింది, ఆనంద కుతూహలాలతో.
    "తర్వాత చెప్తాను, వదినా. ఇప్పుడు కాదు." రెండు చేతులతో ముఖం కప్పుకొని అక్కడి నుంచి పారిపోయింది సిగ్గుతో.
    "ఊఁ. నేను చెప్పలేదూ? ఎప్పటికైనా మారతావనీ....."
    వదిన మాటలను శాంతి పూర్తిగా విననేలేదు.
    స్నానంచేసి వచ్చాడు రాజా. గదిని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. ఇదివరలో అసలతడు శాంతి గదిలోకి రాలేదు. అప్పుడు శాంతితో చనువుగా మాట్లాడినది కూడా తక్కువే.    
    "ఇది నా గది. అవతలిది నా రీడింగ్ రూమ్" అంది శాంతి తనూ ఒక కుర్చీలో కూర్చుంటూ.
    "తెలుస్తూనే ఉందిగా?" అన్నాడు రాజా నలుమూలలా చూస్తూ. గోడనున్న పటాలు చూచి అతడి ముఖం వికసిస్తుందనీ, దరహాస వదనంతో తనవైపు చూస్తాడనీ ఆశించింది శాంతి. కాని రాజా ముఖంలో మార్పు రాలేదు. ఒక్క నిమిషం చూచి ముఖం త్రిప్పేసు కున్నాడు. కిటికీలోంచి బయటి చెట్లను చూస్తూ "అయితే, శాంతీ, అంతా అదోమాదిరిగా ఉన్నారేమిటి? ఏదో మార్పు కన్పిస్తోంది" అన్నాడు.
    "ఏమీ లేదండీ."
    "అయితే రహస్యమన్నమాట?"
    "రహస్యం లేదనుకోండి. అంత చెప్పవలసింది కూడా కాదు."
    "మీ చిన్నన్నయ్యా, శ్యామలా ఇదివరకు నేను వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు నన్ను చూచి కూడా అసలు పలుకరించనైనాలేదు. ఏమైనా కలహించుకున్నారా?"
    ఇక శాంతికి చెప్పక తప్పలేదు. క్లుప్తంగా చెప్పింది.
    రాజా చాలా పశ్చాత్తాపపడుతూ అన్నాడు: "అరెరె! ఎటువంటి పరిస్థితిలో వచ్చాను నేను! మీకు చాలా యిబ్బందన్నమాట!"
    "లేదండీ. నిజంగా రావలసిన సమయంలోనే వచ్చారు. ఎంతో విచారంగా ఉన్న అన్నయ్యా, నాన్నగారూ మిమ్మల్ని చూచే కాస్త మళ్ళీ తేలికపడ్డారు. అన్నయ్యకు మీరంటే ప్రాణమని మీకు తెలియదేమిటి?"
    రాజా మాట్లాడలేదు.
    "అయితే ఉద్యోగమెందుకు మానేశారు?" శాంతి అడుగుతుండగానే శ్రీహరి ప్రవేశించాడు. "ఏమిట్రా, నీ గొడవ? కలకత్తా నుంచెందుకు వెళ్ళిపోయినట్టు?" అని ప్రశ్నించాడు.
    "ఏంలేదురా. రెండేళ్ళనుంచి వుండివుండీ విసుగెత్తింది కలకత్తాలో. ఏదో సరదాగా చేశానుకానీ, నాకసలు ఉద్యోగం అవసరమేమిటి? పొలాలమీద వచ్చేది రైతులు ఇచ్చినంత నేను పుచ్చుకున్నంతగా ఉంది. అవైనా చూసుకుందామని, అసలు పల్లెపట్టున ఉండాలని కోరిక కలిగింది."
    "నేను బెనర్జీకి వ్రాశాను. అతడు జవాబు వ్రాశాడు" అన్నాడు శ్రీహరి, రాజా కళ్ళలోకి పరీక్షగా చూస్తూ, 'నాకు సంగతి తెలుసు' అన్నట్లు.    
    గ్రహించిన రాజా ప్రసంగధోరణి మార్చాడు. ఒక్క క్షణం ఆగాడు. కనుబొమలు ముడిచి ఒక్కసారి రాజానూ, మరోసారి శాంతినీ చూచి వెళ్ళిపోయాడు. అతడికి, రాజాకు కూడా కలకత్తాలో ఒకనాడు ఆ చిత్రంపై జరిగిన సంభాషణ గుర్తువచ్చింది. అతని వెనుకే పద్మ కూడా వెళ్ళిపోయింది.
    శాంతి అనుకుంది, 'అరె, ఎంత తెలివి తక్కువ పని చేశాను!' అని. "అన్నట్టు ఇదివరకు చెప్పటం మరిచిపోయాను. ఈ చిత్రాన్నొకసారి శాంతినికేతన్ లో ఎగ్జిబిషన్ లో పెట్టాను. అందరూ స్తుతించేవారే. రాజా ఎవరు ఎవరని అడిగేవారే" అని చెప్పింది సన్తి.
    అదొక మాదిరిగా నవ్వి ఊరకున్నాడు రాజా.
    "మీరు వ్రాసిన వుత్తరం చాలా మార్పు తెచ్చింది నాలో. మీరూ, పెద్ధన్నయ్యా లేకపోతే నేనేమి పోయేదాన్నో నాకు తెలియదు."
    "నాలో ఏముంది? అది మీ మనోనిగ్రహం, ఆత్మబలాలపై ఆధారపడి వుంది."
    "కాదండీ. మీసలహాయే నాకు బలాన్నిచ్చింది మీరు శేఖర్ గారికి వ్రాసిన వుత్తరం కూడా నాకు పంపించింది మనోరమ. మీ మంచితనాన్ని ఇంతకాలం గ్రహించలేని నా తెలివితక్కువకు సిగ్గుపడుతున్నాను" అంది శాంతి తలవంచి.
    "చిన్నవిషయాని కంత పెద్దమాటలెందుకు, శాంతీ? స్నేహితుడుగా నా కనీసధర్మం అది. పోనీండి. మీరు సుఖంగా సంతోషంగా వున్నారు. అంతే చాలు" అంటూ ప్రసంగం మార్చడానికి "ఉత్తరానికి మళ్ళీ జవాబు వ్రాశారు కాదేం? ఆ విషయం మీకు నచ్చలేదా?" అనడిగాడు.
    "వ్రాశానుగా జవాబు?" విస్మయంతో ప్రశ్నించింది.
    "లేదు. మొదటి ఉత్తరానికే వ్రాశారు."
    "అసలు మీరు నాకు వ్రాసినదే ఒక్క వుత్తరం!"
    "లేదండీ. రెండవసారి శ్రీహరికొక ఉత్త్రరం వ్రాశాను. బేబీకి బొమ్మలూ, గౌన్లూ పంపించాను. అప్పుడే మీకూ వ్రాశాను. ఒకేసారి అందివుండాలి."
    "అవును. ఆ రెండూ ఒక్కసారే అందాయి. కాని నాకు అందలేదే? అన్నయ్యకూడా అన్నాడు-అత డెందుకు వ్రాయలేదో, అటువంటి స్వభావం కాదే అని."
    రాజా కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. కడకు మెల్లగా తల పంకిస్తూ అన్నాడు: "ఎందుకందలేదో ఆశ్చర్యంగానే వుంది. కానీ నేను అందులో వ్రాసిన విషయం మీకు నచ్చ్లేదేమో, అందుకు జవాబు వ్రాయలేదనుకున్నాను."
    తన మాటలకు జవాబురాక తలత్రిప్పి చూచాడు రాజా. కన్నీరు బలవంతంగా అదిమి పడుతూ తలవాల్చి నిల్చుంది శాంతి.
    కాని అది రాజా గ్రహించాడు.
    "శాంతీ!" ఆనందు కలవరపాటుతో.
    శాంతి మాట్లాడలేదు. త్వరత్వరగా గదిలో నుంచి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS