"పెద్దన్నయ్యా!" అంటూ శాంతి వచ్చి శ్రీహరిని చుట్టేసింది. ఒళ్ళు తెలియని కోపంతో, "ఛీ, చండాలుడా! నువ్వు మాలో ఒకడుగా ఎలా పుట్టావ్? దేవుడిలాంటి అన్నయ్యను కొట్టిన నీ చెయ్యి ఏమైపోతుంది?" అని తుపుక్కున ఉమ్మేసింది చిన్నన్నవైపు చూస్తూ.
"నాకు ఒకడే కొడుకు. ఇవ్వాళ వీడి అంతం చూసెయ్యాలి!" ఎక్కడ వచ్చిందో బలరామయ్యకు అంత బలం! ఆ ఆవేశంతో చేతి కర్ర ఎత్తి చిన్నకొడుకు మీదకు వెళ్ళపోతూంటే, "అందరూ తొందరపడకండి. కాస్త మా ముఖాలు చూడండి" అంటూ లక్ష్మీదేవీ, పద్మా అతడిని పట్టుకు ఆపడానికి తాపత్రయ పడిపోతున్నారు.

నారాయణ కొట్టిన దెబ్బ శ్రీహరికి శారీరకంగా కాదు, మానసికంగా తగిలింది. ఆ అఘాతంనుంచి తేరుకొనేసరికి అతడికి అయిదు నిముషాలు పట్టింది. ఆ దెబ్బకు పచ్చటి అతడి చెంప ఎర్రగా కందిపోయింది. పరిసరాల్నే మరిచిపోయేటంత నివ్వెరపోయిన అతడు మెల్లగా తేరుకొని చుట్టూ పరిశీలించాడు. జరుగుతున్న కలహమంతా చూచాడు.
"నాన్నగారూ, మీరు ఉండండి. శాంతించండి. ఫర్వాలేదు. తమ్ముడు నన్ను కొట్టాడు. అంతేగా? ఒక ఇంట్లోవాళ్ళకి గొడవలు రాకపోతే దారిన పోయేవాళ్ళతో వస్తాయా? అయినవాళ్ళం ఇవాళ అనుకున్నా రేపు కలవాలి. ఎందుకా మాటలనడం" అంటూ, "ఉండమ్మా, శాంతీ. ఫర్వాలేదు. నీ పెద్దన్నయ్య కేమీ అయిపోదులే" అంటూ శిలాప్రతిమలా నిల్చున్న నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
ఎందర్ని ఎన్ని అన్నా కోపం తీరని, ఆవేశం చల్లారని నారాయణ, శ్రీహరిని కొట్టగానే మాత్రం, 'నేనే యింత పని చేశానా?' అనుకొంటూ నిలబడిపోయాడు. కొద్దిగా విచక్షణా జ్ఞానం కలిగింది. 'ఏం చేశాను నేను? ఏమిటిది?' ఆలోచించుకున్న కొలదీ కళ్ళు తిరిగిపోసాగాయి, ఆ ఇంట్లో అందరికీ, తల్లికీ, తండ్రికీ కూడ శ్రీహరిపై ప్రత్యేకమైన గౌరవం. కారణం అతడు సహనశీలి, ఉదారుడు, ప్రేమస్వభావి, వివేకవంతుడు, బాధ్యతాయుత మైన వ్యక్తి కావడమే. అతడి నెవరూ ఇంట్లో వ్యక్తిగా చూడరు. ఒక ఉన్నత వ్యక్తిగా గౌరవిస్తారు. ఒక మహాపురుషుడుగా పరిగణిస్తారు. అతడి సమక్షం శరత్కాల కౌముదివలె హాయి గొలుపుతుంది. గ్రీష్మతాప బాధితునికి వటవృక్షచ్చాయ ఉన్నంత సుఖవంతంగా ఉంటుంది. పిపాసార్తునికి శీతల మధుర జలపానీయంలా తృప్తిపరుస్తుంది. అటువంటి అన్ననా తాను కొట్టినది!
శ్రీహరి మెల్లగా తమ్ముడితో, "తమ్ముడూ, జరిగింది మరిచిపో. అలాగే కానీయ్. నీకంటే పెద్దవాళ్ళం మేము. నీ కోరిక తీర్చాలి. కాని ఒక్క కోరిక. రెండు రోజులు ఆగు. మేము మీకు ఆటంకంగా ఉన్నాము. మేము వెళ్ళిపోయి రాజమండ్రిలో ఇంట్లో ఉంటాం. ఇక్కడ మీరు మీ ఇష్టప్రకారం ఉందురుగాని. నాన్నగారికీ, ఈ చెట్లకూ ఏదో అనుబంధం. ఆ పని ఆయన ఎదుటే జరిగితే సహించలేరు. రెండు రోజులు ఓపికపట్టు" అంటూ "నడవండమ్మా, లోపలికి. నాన్నా, నడవండి" అని లోపలికి దారి తీశాడు.
ఎవరికివారే చిత్రప్రతిమలైపోయారు. విషాదభారంతో అడుగుతీసి అడుగు వేయలేకపోయారు. ఇంతకుముందు ప్రదర్శించిన ఆవేశమూ, బలమూ ఏమైపోయాయో - నలుగురి సాయంతో నడవవలసి వచ్చింది బలరామయ్య.
ఆ రాత్రి శాంతివనాన్ని అశాంతి అగోచరంగా ఆవరించి విలయతాండవ మాడింది. ఒక్క శ్యామలా నారాయణలు మినహా ఎవ్వరూ భోజనాలు చేయలేదు. నిద్రపోలేదు.
"నేనీ శాంతివనం విడువను. నా తను నిక్కడే వెళ్ళిపోవాలి" అంటూ గొడవ మొదలు పెట్టాడు బలరామయ్య.
లక్ష్మీదేవీ, పద్మా, శాంతీ నిశ్శబ్దంగా కళ్ళొత్తుకోవడం మినహా ఏమీ మాట్లాడలేకపోయారు.
శ్రీహరి ఎన్ని విధాలనైనా నచ్చజెప్ప ప్రయత్నించాడు. కాని బలరామయ్య వినలేదు.
"ఈ శాంతివనం శాంతిది. దాన్నెవరికీ మార్చే హక్కు లేదు. ఇందులోనుంచి నేను వెళ్ళను."
"పోనీండి, నాన్నా. మీరు బాగుంటే అంతే చాలు. నాకొద్దు ఇది" అంటూ శాంతి అనునయించ ప్రయత్నించింది.
"నువ్వూరుకో, తల్లీ. నీకు తెలియదు. ఈ శాంతివనం నీది. ఇందులో ఇక ఆ దుర్మార్గుడొక్కరోజైనా ఉండడనికి వీలులేదు" అంటూ అరవసాగాడు బలరామయ్య.
వార్ధక్యంలో ఉన్న ఆయన హృదయాని కెలా ఊరట కలిగించాలో తెలియక బాధ పడుతూండగానే తెల్లవారిపోయింది.
కొన్ని కొన్ని అతి జటిల సమస్యలకు చిత్రంగా దైవపరిష్కారమే లభిస్తుంది. ఆ ఉదయం శ్రీహరి, బలరామయ్యను అనునయించి బలవంతంగా కాఫీ త్రాగిస్తూండగా నారాయణ విరుసుగా వచ్చాడు గదిలోకి. "మేమే పట్నం పోతాం. మాకిక్కడ లాగాలేదు. నా వాటా సగం నాకు ఖచ్చితంగా యివ్వండి. ఈ పంపకాలు యివ్వాళే తేలాలి" అన్నాడు ఎటో చూస్తూ.
"ఫోరా, ఫో! నీ పాపిష్టి ముఖం నాకింక చూపెట్టకు." అరిచాడు బలరామయ్య.
శ్రీహరి మెల్లగా తలెత్తాడు. "పంపకాలు ఏనాడో జరిగిపోయాయి. మన ప్లీదారుగార్నడిగి తెలుసుకో."
"ఏమిటీ!" నిర్ఘాంతపోయాడు నారాయణ. "నాకు తెలియకుండానే?"
"ఆయన ఆస్తి ఆయన పంచివ్వడానికి ఎవరికీ తెలియక్కర్లేదు. అయినా నీకేం అన్యయం జరుగలేదు. ముగ్గురికీ సమానంగా యిచ్చారు. రాజమండ్రిలో మేడ, జేగురుపాడు పొలాలు యిరవై ఎకరాలు నీవి."
"నాన్సెన్స్!" నేలను కాలితో బలంగా తన్నాడు నారాయణ. "ముగురికీ సమాన మేమిటి? ఆడదానికి మనతో సమంగా వాటా!"
"ఓరి దౌర్భాగ్యుడా! నేను తలుచుకుంటే ఆస్తంతా పూర్తిగా దానికే ఇస్తాన్రా. నీవంటి దుర్మార్గుల పొగరణగటానికే ఆస్తిలో ఆడ పిల్లలకు హక్కులు వచ్చాయి. నువ్వు పుట్టినట్టు అది పుట్టలేదా, పెరగలేదా? నోరు మూసుకు ఫో." అంతకంతకూ బలరామయ్య స్వరం తారస్థాయి నందుకుంటూంది.
"తమ్ముడూ, దయఉంచి వెళ్ళు. నాన్నగారి వంట్లో ఏమీ బాగుండలేదు. అనవంగా తర్కించకు. శాంతికూడా మనతోబాటు పుట్టి పెరిగిన బిడ్డ. ఆడా, మగా అని తేడాగా చూచే మూర్ఖత్వం నాన్నగారికి లేదు గనుక సంతోషించాలి."
"ఓహో! చాలా పెద్ద కబుర్లు చెప్తున్నావే! అయితే ఇదంతా నీ పన్నాగామా? నువ్వెక్కువ వ్రాయించుకున్నావు కాబోలు, తీపి కబుర్లు చెప్పి? మనకీ కొబ్బరికాయ ఎగుమతి వ్యాపారంలో వేలకువేలు లాభాలొస్తున్నాయి. అదేమైనట్టు?" కోపంగా అడిగాడు నారాయణ.
"తమ్ముడూ!" కోపంగా లేచాడు శ్రీహరి. "ఇక నీ మూర్ఖత్వానికి హద్దూ పద్దూ లేదా? తోడబుట్టినవాళ్ళు ఆస్తిపాస్తులను దొంగిలించేవారు ఉంటారు కాని, నేనటువంటి నీచుడిని కాను. ఆయనకు ఆమద్య జబ్బుచేసి నప్పుడు అధైర్యంతో వ్రాశారది. ఆ రోజున నేనెంత ఏడ్చి క్రుళ్ళిపోయానో నీకేం తెలుసు? ఆయన మనః పూర్బకంగా ఏం వ్రాశారో అదే చాలు. అదే మహాప్రసాదం. నేను తర్కించను.
"నాకు ఈ ఊళ్ళో పొలం పాతిక ఎకరాలు మాత్రమే వచ్చింది. రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నాను గనుక అక్కడి మేడ నాకిద్దామనుకొన్నారు కాని, నేనే నీవు చిన్నవాడివని, నీకిమ్మని చెప్పి వ్రాయించాను. నా తంటాలేవో నేను పడతాను. సరే, శాంతికి ఈ బంగళా, దీని చుట్టూ తోటా మాత్రమే స్థిరాస్తి. వ్యాపారంలో వచ్చిన యాబైవేలూ దాని పేర బాంక్ లో వేశారు. మిగిలిన ఏడెకరాలూ ఆయనకు. అనంతరం ఏడుకొండలవానికి."
"ఈ మేడా, తోటా ప్రస్తుతం ఓ ఏడెనిమిది వేలు చేస్తాయి. ఇదిగాక దానికి యాభై వేలు యిచ్చారా?"
"అలా మాట్లాడతావేమిట్రా? ఇప్పుడు దాని పెళ్ళికో యాభై అరవై వేల కట్నం యివ్వవద్దా మరి? అదే యిచ్చారు దానికి. మనకిచ్చిన పొలాలు ఎకరం ఏడెనిమిది వేలు చేస్తాయి. వాటితో పోల్చిచూస్తే శాంతికిచ్సింది చాలా తక్కువే. ఎంత గారమైనా కడకు ఆడపిల్ల కివ్వడానికి అట్టే మనస్కరించదు మనవాళ్ళకు. అయినా ఆ స్వల్పంగా ఇచ్చినదానికే మనం ఎంతో బాధపడతాం. ఆడపిల్లలైనంతమాత్రాన వాళ్ళు చేసిన పాపమేమిటి? పైతృక సంపద ననుభవించే హక్కు వాళ్ళకుమాత్రం ఎందుకుండకూడదు?"
"సరే. అదే కానీండి. అందరూ ఒకటై వ్రాసుకున్న విల్లన్నమాట అది. నేనే పరాయి వాడిని కదూ? సరే. వ్యాపారమంతా ప్రస్తుతం నా చేతిలోనే ఉంది. అది మీదైననాడు చూద్దాం." విసవిసా వెళ్ళిపోయాడు నారాయణ.
"ఆ కాగితాలన్నీ నాకు ఒప్పజెప్పకపోతే అడ్డంగా నరుకుతాను" అంటూ లేచాడు బలరామయ్య.
"పోనీండి, నాన్నా. ఆవేశపడకండి." ఆపాడు శ్రీహరి. "వాడినే తీసుకోనీండి. ఎప్పటికైనా వాడే మారతాడు."
"ఎలాగ పెదబాబూ?" బలరామయ్య నేత్రాలు నిస్సహాయతతో అశ్రుపూరితమైనవి. "ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బంతా శాంతి కిద్ధామని దానికిప్పుడు మీకంటే చాలా తక్కువ వ్రాశాను,"
తండ్రి అశ్రువులొత్తుతూ అన్నాడు శ్రీహరి: "ఇటు చూడండి, నాన్నా. శాంతి కేలోటూ లేదు. మీరున్నారు; నేనున్నాను. అవసరమైతే నా ఆస్తంతా శాంతికిచ్చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. శాంతి మీకు ప్రాణం. నాకు ప్రాణంకంటే ఎక్కువ."
బలరామయ్య కన్నీటిధార లెక్కడా కట్టుపడటంలేదు. "అవును, బాబూ, తెలుసు. నువ్వు దగ్గరుండగా నా కే చింతా లేదు. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడివే నా కడుపున పుట్టావు. దైవం నీకు మేలు చేస్తాడు" అంటూండగానే పెద్దపెట్టున శోకిస్తూ లక్ష్మీదేవి గదిలో ప్రవేశించింది. "విల్లు వ్రాశారా? ఇప్పుడేం ఆపద వచ్చిందనీ? అసలు మీ ఆరోగ్యమెలా ఉంది? అంత అధైర్య మెందుకు వచ్చింది? నాదగ్గర మీరేదో చెప్పకుండా దాస్తున్నారు" అంది భర్త గుండెలపై బడి రోదిస్తూ ఆ వెనుకనే వచ్చిన పద్మా, శాంతీ, అక్కడే వున్న శ్రీహరీ ఎవరూ ఆమెను ఓదార్చలేకపోయారు.
"ఊరుకో, లక్ష్మీ, ఊరుకో." బలరామయ్య ఎలాగో గొంతు సరిజేసుకుని అనగలిగాడు. "ఇప్పుడు నాకే ప్రమాదమూ రాలేదు. ముందుజాగ్రత్తకోసం వ్రాశాను. తర్వాత ఏ అన్యాయమూ జరుగకుండా మన చేతులలో నుంచి జారిపోకముందే మన కన్న బిడ్డలకు మనం సమ్మగా ఇచ్చుకోవడంలో ఎంత తృప్తి ఉంది! చూడు, మన కళ్ళెదుటే ఎన్ని జరుగుతున్నాయో, మనం లేకపోతే ఇంకా ఎన్ని అన్యాయాలు జరుగుతాయో? ఎప్పుడూ ఇతరులకేకాని తనకు తాను యిది కావాలీ అని అడగడు శ్రీహరి. బొత్తిగా సత్యకాలపువాడు. వాడికోసం, ముఖ్యంగా ఆడపిల్ల - పెళ్ళి కానిది - శాంతికోసం అలా వ్రాశాను ఎంతో ఆలోచించి. అంతకంటే ఏంలేదు. బాధపడకు."
'అంతేనా?' అన్నట్లు చూచింది లక్ష్మీదేవి పెద్ద కొడుకువైపు.
"అంతేనమ్మా అంతకంటే ఏమీలేదు. ఈ విల్లు ఇప్పుడు వ్రాసినది కాదు. శాంతి శాంతి నికేతన్ లో వుండగా ఆయన ఆరోగ్యం కొంత పాడైంది. అప్పుడు వ్రాశారు. నేను దగ్గరే వున్నాను వ్రాసినప్పుడు. నువ్విలా బాధపడతావనే చెప్పలేదు."
"ఏమో, నాయనా? నిక్షేపంలాంటి సంసారం ఎలాగైపోతోందో, ఏమైపోతోందో నాకేం తెలియటం లేదు. వాడు పట్నంపోతాడట. అన్నీ సర్దేసుకొంటున్నాడు" అంది గాద్గదికంగా.
"వెళ్ళనీ, అమ్మా. కలిసి వుండడంకంటే విడిగా ఉంటేనే గౌరవ మర్యాదలు దక్కుతాయి. దూరంగా ఉంటేనే మమతలు పెరుగుతాయి. నిత్యం నౌకర్ల యెదుటా, బంధువుల యెదుటా అయినవాళ్ళం యిలా ఘర్షణలు పడి అవమానాల పాలయ్యేదానికంటే, యింకా విషమించకుండా మర్యాదగా విడిపోవడమే మేలు."
తల పంకించింది లక్ష్మీదేవి. మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తల్లిని వెనుకకు పిలిచాడు శ్రీహరి. "చూడమ్మా, వాళ్ళు బహుశః యింట్లో సామాన్లుకూడా చాలావరకూ పట్టుకుపోవచ్చు. తీసుకోనీ. నువ్వేమీ మాట్లాడకు."
"అలాగే" అంది లక్ష్మీదేవి నిర్లిప్తంగా.
అప్పుడే "రాజశేఖరం బాబు వచ్చా"డని రామన్న కబురు తెచ్చాడు.
అందరూ నిర్ఘాంతపోయారు. 'కుటుంబం యిటువంటి గొడవలలో వుంటే అతిధి మర్యాద లేం జరుగుతాయి?'
"చూడు, శాంతీ. వెళ్ళి రాజాను నా గదిలోకో, నీ గదిలోకో తీసుకువెళ్ళి కావలసినవి చూడు. నేను తర్వాత వస్తాను. నాకు బయటికి రావడానికి ముఖం చెల్లడం లేదు" అన్నాడు శ్రీహరి.
క్రిందటిరోజు అంత నిగ్రహంతో ప్రసరించాడు కాని, నారాయణ కొట్టిన దెబ్బకు అతడు తీరని అవమానంతో కుమిలిపోతున్నా డన్నమాట! గ్రహించిన బలరామయ్య "వెళ్ళు, శాంతీ. ఎక్కడికో ఎందుకు? ఇక్కడికే తీసుకురా-నాకూ చూడాలని వుంది. చాలా రోజులైంది అతణ్ణి చూచి" అన్నాడు. శాంతి వెళ్ళిపోయింది.
