Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 36


    "ఎవరది?"
    హటాత్తుగా చప్పుడు ఆగిపోయింది. ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు ధర్మారావు ఆ చీకటి లో.
    ఓ పావు గంట అనంతరం తిరిగి తాళం తీస్తున్న అలికిడి!
    ఈసారి ధర్మారావు ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా , ఒక మూల ఒదిగి నిల్చుని ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు.
    ఆ ఆకారాలు మెల్లగా లోపలికి ప్రవేశించడం అతడు గమనించాడు. ఉన్నట్టుండి ఒక్కసారి బాటరీ లైటు వెలుతురూ తన మీద పడడం, ఆ వెలుతురూలో తళతళ లాడుతున్న కత్తితో ఒక వ్యక్తీ తన మీదకు వస్తూండడం గమనించిన ధర్మారావు ఆ హటాత్సంఘటన కు చకితుడైనా , అచేతనుడు మాత్రం కాలేదు. బాకుతో పొడవటానికి వస్తున్న అతడిని , ఎగిరి కాలితో ఒక్క తాపు తన్నడంతో అతడు వెల్లకిలా నేలపై పడిపోయాడు. అతడు తిరిగి లేచి మీదకు లంఘించు తాడని భావించి ధర్మారావు సిద్దంగా ఉన్నాడు. కాని, అలా జరగలేదు. ఆ చీకటి లో ఏమిటో గడబిడ, ఇద్దరు ముగ్గురు మనుషులు తీవ్రంగా ఏ మల్ల యుద్ధమో చేస్తున్నట్టు అవుతున్న ధ్వనులు మాత్రం శ్రవణేద్రియాల కు సోకాయి. అలా పదినిమిషాల కాలం ఆ అయోమయా వస్థలో గడిచిన తర్వాత, హటాత్తుగా జనం పరుగులిడుతూ ఆటే వస్తున్నట్టు గ్రహించాడు. ఉన్నట్లుండి లైట్లు వెలిగాయి. పోలీసులు అరుచుకుంటూ బాగా గుమిగూడి పోయారు. ఆ కాంతి లో జరుగుతున్న సంఘటనను చూచిన ధర్మారావు ఆశ్చర్యంతో "బలరాం!" అని అరవకుండా ఉండలేక పోయాడు.
    ఒక్క ధర్మారావే కాదు, చూపరు లందరూ నిశ్చేష్టు లై చూస్తుండ గానే నల్ల దుస్తుల వ్యక్తీ ని కత్తితో గుండెలలో పొడిచి, చూస్తుండగానే పరుగెత్తి చెట్ల మీది నుంచీ, గోడల మీది నుంచీ దూకి అదృశ్య మయ్యాడు బలరాం.
    ఫలితం లేదని తెలిసినా అన్ని వైపు లకూ పోలీసులు పరుగెత్తారు. వైర్ లెస్ లో అరుస్తూ, అప్పటి కప్పుడే పోలీస్ జీప్ కూడా బయలు దేరింది. ఈ గడబిడ లో నల్ల దుస్తులతో ఉన్న రెండవ వ్యక్తీ పారిపోయాడు. ఇక బాకు గుండె లలో దిగి, నేలపై పడి ఉన్నవాడు మాత్రం మిగిలాడు.
    జైలు డాక్టరు వచ్చి ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని, అతడింక బతకడ నీ అన్నాడు.
    పోలీస్ సూపరింటెండెంట్ ఆజ్ఞతో ఒక కాన్ స్టేబుల్ పడి ఉన్న వ్యక్తీ ముఖం మీది నల్ల ముసుగు ను తొలగించాడు.
    "కంట్రాక్టర్ భుజంగం!' అందరూ ఆశ్చర్యంతో అరిచిన అరుపులకు జైలు జైలంతా దద్దరిల్లింది.
    ఆశ్చర్యం తో సూపరింటెండెంట్ ఇన్ స్పెక్తర్లూ ధర్మారావు వైపు చూచారు. చిత్ర ప్రతిమలా కదలక మెదలక నిలబడి, ఏ దూర తీరాలకో దృష్టి నిగిడించి బాధలకూ, ఆలోచనల కూ అతీతుడై నట్లు గంబీరంగా కన్పట్టుతున్న అతడిని ప్రశ్నించటానికి సాహసించ క; అవమాన భారాన్ని మోస్తున్న అతడిని విసిగించడానికి వారి సహృదయత అంగీకరించక నిశ్శబ్దంగా నిష్క్రమించారు.
    ధర్మారావు రక్షణ కు ప్రత్యేకమైన పోలీసు సిబ్బంది ని ఏర్పాటు చేసి, భుజంగాన్ని పోలీసు కాపలా తో ఆస్పత్రి కి పంపించి, పోలీసు అధికారులు న్యాయ మిత్ర ఇల్లు చేరుకోనేసరికి ఉదయం ఏడు గంట లయింది.
    అధికారులందరూ పోగైన ఆ సమావేశం లో జరిగిన ఇష్టా గోష్టి లో కడకు పెద్దలందరూ తమలో తాము నిర్ణయం చేసుకున్నారు: "ధర్మారావు, భుజంగం, వార్డెన్, బలరాం, గౌతమ్ అందరూ ఒక్కటే. ఒకటే కూటమి. పైపైకి ప్రజనూ, అధికారులనూ ఆకట్టు కోవడానికి , నమ్మకం కలిగించడానికి, అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నటించారు. ఇప్పుడు ధర్మారావు జైలు లో ఉండడం తో వాళ్ళ కేదో భయం పట్టుకుంది, ఏ సమయం లో నిజం చెప్పేస్తాడో నని! అందుకే అతడిని అంతం చేసేయాలను కొని వచ్చారు. చీకట్లో తెలియక ధర్మారావనుకోని భుజంగాన్ని పొడిచాడు బలరాం. ఈ పెద్ద పెద్ద దేశ ద్రోహం కేసులలో బందీ గా ఉన్న నేరస్తుడ్ని వాళ్ళ తాలుకూ వాళ్ళే, కారాగారం లోనే అంతం చేసేయడం మామూలుగా వింటూనే ఉంటాము."
    ఎప్పుడూ ధర్మారావు కు వ్యతిరేకంగా ఆలోచించటానికి ఇచ్చగించని మిత్రా ఈనాడు తదితరుల అభిప్రాయంతో అంగీకరించక తప్పలేదు. 'అవును. వార్డెన్ అండ లేనిదే ఖైదీ బలరాం బయటి కేలా వచ్చాడు? ధర్మారావు గది తలుపు లేలా వచ్చాయి? ఇదంతా ఒకటే కూటమి. బహుశా సత్యకు స్పృహ తప్పించి, రికార్డరు అపహరించిన వాళ్ళు కూడా వాళ్ళే కావచ్చు." అన్నాడు.
    సత్య వద్ద టేప్ రికార్డర్ దొంగిలింప బడిన ప్రదేశమూ, ప్రహరీ గోడ పై పాదాల జాడలూ పరీక్షగా తిలకించిన పోలీస్ సూపరింటెండెంట్ ఆశ్చర్యం ప్రకటించాడు. "ఇవి నారాయణస్వామి పాదాల గుర్తులు లాగా ఉన్నాయి. ఫోటో తీసి, పంపిద్దాముఇప్పుడే, అతడు ఈ ప్రాంతాల లోనే తిరుగుతున్నాడన్న మాట!"

                                     41
    ఆనాడు ధర్మారావు కేసు వాదనలు వినడానికి ఆఖరి రోజు. కోర్టు అంతా ఇసక వేస్తె రాలనట్లు ఉన్నారు జనం.
    ధర్మారావు ను తెచ్చి బోనులో ప్రవేశ పెట్టగానే జనం లో అలజడి ప్రారంభ మయింది. ధర్మారావు ఎటూ, ఎవరి వైపూ చూడకుండా చూపులు కేవలం భూమి మీద నిలిపి నిశ్చలంగా నిలబడ్డాడు.
    ఏ కారణం వల్లనో అతడి ప్లీడరు అర్జున్ కోర్టు కు హాజరు కాలేదు. న్యాయాధికారి నుండి సామాన్యుడి వరకూ అదే అమితా శ్చర్యంగా ఉంది. సుయోధన్ కు మరీ సంతోషంగా ఉంది. కాని ఈ విషయాలేవీ పట్టించుకోని వాడు ఒక్క ధర్మారావు మాత్రమే.
    ప్రభుత్వం తరపున సత్య వాదం ప్రారంభ మయింది. అతి నీరసంగా కనిపిస్తుంది ఆమె వదనం. కాని, కళ్ళలో పట్టుదల నాట్య మాడుతున్నది.
    "యువరానర్! ఈ ధర్మారావు ను గురించిన అన్ని వివరాలూ విన్నారు. ఇతడు నివురు గప్పిన నిప్పు. పైపైకి అమాయకుడు, ఆదర్శ మూర్తి లాగా కనిపించి, నటించి అధికార , అందికారులందరికీ ప్రేమ పాత్రుడై నాడు. అతడికి కావాల్సింది కూడా అదే. ఖైదీ లందరికీ అనవసరమైన నీతి బోధలు చేసి, వారి మనస్సు లలో అధికారుల పట్ల విముఖత నూ, విప్లవ భావాలనూ రేకెత్తించాడు. అందరి ఆదరణా లభించిన తర్వాత తన పధకాన్ని నిరిఘ్నంగా కొనసాగించు కున్నాడు. దేశద్రోహి గా దీర్ఘాకాల కారాగారా శిక్ష అనుభవిస్తున్న తన తండ్రి గౌతమ్ కు పారిపోయే అవకాశాలు కల్పించాడు. వీరు తండ్రీ కుమారులని ప్రజలకూ, అధికారులకూ ఎవరికీ తెలియదు. కాని, ధర్మారావు చర్య లపై అనుమానం కలిగిన పై అధికారులు రహస్యంగా ఇతడి పై దర్యాప్తు కొనసాగించడం తో ఈ ధర్మారావు కూ, ఇతడి పెద్దలకూ ఉన్న చరిత్ర అంతా బయట పడింది. అతి స్వల్పంగా కనిపిస్తున్న ఈ కేసు వెనక ఒక పెద్ద గ్రంధం దాగి ఉంది. దేశం యావత్తూ ఇమిడి ఉంది!
    "రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ధర్మారావు తండ్రి గౌతమ్ దేశ రక్షణ శాఖ లో ఒక ప్రధాన పదవి నిర్వర్తించాడు. ప్రభుత్వం అతడి సేవలను గుర్తించింది. అప్పట్లో దేశానికి ఆయువు పట్టుగా ఉన్న స్వర్నగంగా డాం ను శత్రువుల నుండి రక్షించే భారాన్ని కొంత సైన్యానికి ఒప్ప జెప్పారు. ఆ సైన్యాధిపత్యం మేజర్ గౌతమ్, మేజర్ సుయోధన్ లకు ఒప్పజెప్పబడింది."
    చెబుతున్న సత్య కొద్ది సేపు ఆగడంతో ప్రేక్షకులలో ఒకింత అలజడి రేగి, తగ్గిపోయింది.
    "ప్రభుత్వానికి ఈ ఇద్దరి సేవల పైనా శౌర్య వివేక బలాల పైనా ఆనాడు అమితమైన నమ్మకం ఉండేది. వారి నిస్వార్ధ బుద్దినీ , సేవ నిరతిని అనేక సందర్భాలలో పై అధికారులూ ప్రభుత్వమూ గుర్తించడం జరిగింది. ఆ గౌరవం నిలబెట్టు కుంటూ శ్రీ సుయోధన్ తామెప్పుడూ ప్రభుత్వం వారి విశ్వసనీయ సేవకులమే నని ఇప్పటికీ రుజువు చేసుకుంటున్నారు. కాని, గౌతమ్ ఆ యుద్ద కాలం లోనే అందుకు భిన్నంగా నిరూపించుకున్నాడు. అతడు స్వతహాగా మంచివాడే, నమ్మకస్తుడే. కాని, ఏ విధి బలీయత వల్లనో, అతడే క్షమింప రాని నేరం, దేశ ద్రోహం తలపెట్టాడు!
    "యుద్ధం ముమ్మరంగా సాగిపోతుంది. అధికారులూ, ప్రజలూ కూడా అప్రమత్తతతో జాగరూకు లై ఉండవలసిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. 1943 జూన్ నెలలో స్వర్ణ గంగా డాం ను అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నది స్వదేశ సైన్యం. నదికి ఆవల ఇరవై మైళ్ళ దూరంలో శత్రు సైన్యం విడిసి ఉన్నది. పది మైళ్ళ దూరంలో స్వదేశ సైన్యం రాత్రింబవళ్ళు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడు కుంటుంది. అత్యవసర స్థితిలో , ఏ క్షణాన అయినా సరే, శత్రు ప్రవేశాన్ని అరికట్టడం కోసం ఆనకట్ట ను పేల్చి వేయడాని కైనా వెనుదీయ వద్దని ప్రభుత్వం ఉత్తరువు. శత్రువులు ఎప్పుడు దాటటానికి ప్రయత్నించినా, ఎప్పటి కప్పుడు అతకాయిస్తూ వచ్చింది, మన సైన్యం. కాని, విడిసి ఉన్న శత్రు సైనికులు కూడా ఘటికులే! ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా ఉంది. గాలివాన కు ముందు ఏర్పడే భయంకర నిశ్శబ్దం లాగా ఉంది. ఇరుపక్షాల నూ ఆశ్రయించిన స్తబ్ధత. మదించిన సింహాలు ఏ క్షణాన అయినా లేచి డీ కొనవచ్చు. ఆ బీభత్సం లో జరగబోయే దారుణాలూ, నష్టాలూ ఎంతమేర ఉంటాయో అనూహ్యం! సైనికుల కంటికి నిద్ర లేదు! అధికారుల మనస్సులకు కుదురు లేదు . నిత్యం గుండెలలో గుబుళ్లు! నైట్ పెట్రోల్స్ , డే పెట్రోల్స్ ఎప్పటి వార్తలప్పుడు జాగరూకత తో సేకరిస్తున్నారు, ప్రాణాలకు తెగించి."
    వింటున్నట్లు కాకుండా కళ్ళకు కట్టి నట్లు ఉంది ప్రేక్షకులకు.
    కుమార్తె చాతుర్యానికి మురిసిపోతూ కూర్చున్నాడు సుయోధన్.
    శిలా ప్రతిమలా వింటున్నాడు మిత్రా.
    ధర్మారావు చలన రహితుడే అయ్యాడు.
    తిరిగి చెప్పా నారంభించింది సత్య. "జూన్ ఏడవ తేదీ . శత్రువులు తిరోగమిస్తున్నట్లు కనిపిస్తున్నది. కాని అది పూర్తిగా వెనకకు పోవడం కాదు. వారు పోయారనే భ్రమలో మన సైన్యం ఏమరి ఉన్న వేళ, అర్ధరాత్రి , అకస్మాత్తుగా , రహస్యంగా నదిని దాటి వచ్చి దేశంలో ప్రవేశించడానికి అది పన్నాగం. ఇది నైట్ పెట్రోల్ విష్ణు నారాయణ్ శర్మ తెచ్చిన వార్తా. దానితో అధికారులందరూ అలజడి చెందారు. కాని ధైర్యం వీడలేదు. యుద్ద నిపుణత లో, అత్యవసర పరిస్థితిలో అనువైన ఉపాయాలతో, ప్రవర్తించడం లో మేటి ధీరులు, అపక్రపరా కరములు , రణ ధీరులు అయిన మేజర్ గౌతమ్, మేజర్ సుయోధన్ లు రణ భూమిలో ఉన్నారంటే మరి అనుమానం అక్కరలేదు. నిశ్చింతగా ఉండవచ్చు. రహస్యాలోచనల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు -- ఏమరి ఉన్నట్లే నటిస్తారు. కాని, జాగరూకత తోనే ప్రవర్తిస్తారు. అందరూ ఏ క్షణాని కైనా యుద్ద సన్నద్దతతో ఉండి శత్రువు ను ఎదుర్కొంటారు.
    "శత్రువు ఆ అర్ధరాత్రి నదిని దారుదామని ప్రయత్నించడం తధ్యం. యుద్ధం అనివార్యం. కాని....కాని, ఆనాడు ప్రకృతి కూడా పగబట్టింది. అమావాస్య . అర్ధరాత్రి. ఎల్లెడలా గాడాంధకారం. పెనుగాలి చెలరేగింది. ప్రళయ మేఘామృత మైన ఆకాశం పెళ పెళా రావాలతో గర్జిస్తుంది. కుంభ వృష్టి తో లోకం మునిగి పోతుంది. స్వర్ణ గంగా నది విపరీతమైన వరద తగిలి పొంగులు వారుతూ , సుడులు తిరుగుతూ , హోరెత్తు తూ, పరవళ్ళూ తొక్కుతూ  గట్లోరసి ప్రవహిస్తున్నది. వంతెన కూ, నదికీ  ఒక అరడుగు దూరం మాత్రమె ఉన్నది.
    "ఇటువంటి భయంకర సమయం లో జరగబోతున్న యుద్ధం లో ఏ పక్షపు సైనికులు ఎలా తట్టుకో గలుగుతారో, విజయలక్ష్మీ ఎవరిని వరించునున్నదో ఊహించడం ఎంతటి వారి కైనా ఆసాధ్యం. శక్తి వంచన లేకుండా పోరాడతారు కాని విధి బలీయమై, శత్రువు ను జయించడం అసాధ్యమైతే, పరిస్థితి చేయి జారిపోతున్న విపత్కర పరిస్థితులలో సరిగ్గా శత్రు సైనికులు నది దాటుతున్న సమయం లో డైన మైట్ల తో డాం ను పేల్చి వేసి శత్రు ప్రవేశాన్ని అరికట్టాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS