Previous Page Next Page 
అర్పణ పేజి 35


    అన్నట్టు-- నువ్వీమధ్యను నీ సంసారం సంగతులు బొత్తిగా చెప్పడం మానేశావు. నువ్వూ, రాజూ ఆనందంగా జీవితం గడపడం కన్నా నాకు కావలసిందేముంది? రాజును 'నువ్వు'  అంటూ సంభోదించే అలవాటు మానుకో. అతని కటువంటివి ఇష్టం ఉండవని అనుకుంటాను. అనుకూలంగా నడిచి పోవడం లోనే శాంతి దొరుకుతుంది. చచ్చిపోతూ నీ అక్క కోరిన వాటిని కాదనకూడదే చిట్టీ! నా కోసం అట్టే దుఃఖ పడకు."
    పార్వతి ఆ ఉత్తరాన్ని హృదయానికి హత్తుకుంది. రెండు కన్నీటి బొట్లు చెక్కిళ్ళ మీదికి జారాయి.
    'రాధాకృష్ణ తో ఏమని చెప్పగలను, అక్కా? అనుకుంది వ్యధతో. ఆ ఉత్తరాన్ని చూచిన తర్వాతనే రాధాకృష్ణ బాగా గుర్తు వచ్చాడు పార్వతికి. ఫోటో చూచిన తర్వాత అతను పొందిన ఉత్సాహానందాలు జ్ఞాపకం వచ్చి సన్నని నిట్టుర్పు విడిచింది.
    సరస్వతి వ్రాసిన ఉత్తరంలో తన సంసార విషయాలకు చెందిన భాగాన్ని పార్వతి వేరు చేసి ఉంచింది.
    సాయం వేళ అవుతున్నది. అప్పుడే ఒక్కొక్కరూ ఇళ్ళల్లో దీపాలు వెలిగించు కొంటున్నారు. వర్షాకాలపు చివరి రోజులవి. వర్షచ్చాయలు పూర్తిగా పోయి చిరు చలి ప్రారంభమైంది. దట్టంగా చీకటి దారాలు అల్లుకుంటున్నాయి. అస్తాద్రి వైపు మాత్రం భయంకరమైన ఎరుపు.
    వీధిలో కూర్చుని ఉన్న రాజు దగ్గరికి లక్ష్మీ వచ్చి , "పార్వతి కి జ్వరం తగిలినట్టుంది, బాబూ! చూద్దువు గాని, ఇలారా." అంది. రాజు వైమనస్యంగా ఉన్నాడేమో-- ఇది వినగానే అతని కా పల్లెటూరు భయంకరంగా కనిపించింది.
    లేచి లోపలికి వెళ్ళాడు. రాజును చూచి అన్యమనస్కంగా కూర్చుని ఉన్న పార్వతి కళ్ళు దించుకుంది. లక్ష్మీ వచ్చి పార్వతి పక్కన కూర్చుంది.
    రాజు పార్వతి నుదుటి మీద చెయ్యి పెట్టి చూచి కుర్చీలో కూర్చుంటూ, "వర్షం లో తడిసింది కదండీ! అందుకే జ్వరం వచ్చి ఉంటుంది." అని నసిగాడు లక్ష్మీ వైపు తిరిగి మొహమాట పడుతూ. అతని కామేతో అంత చనువు లేదు.
    "ఏమో, బాబూ? నువ్వు ముందుగా పార్వతి ని తీసుకు వెళ్ళిపో. ఈ పల్లెటూళ్ళో ఒక్క సదుపాయమూ లేదు. తర్వాత నేను కూడా మీ ఊరు వచ్చి అక్కడి నుంచే వెళ్ళిపోతాను." అంది లక్ష్మీ.
    ఎవ్వరికీ తెలియకుండా అందుకే భయపడుతున్న రాజు, వెంటనే -- "రేపే పొద్దుటి బండిలో వెళ్తాము" అన్నాడు.
    పార్వతికి విచిత్ర మనిపించింది.
    "ఇక పార్వతి తప్ప నాకెవరున్నారు?" అని కంట నీరు పెట్టుకుంది లక్ష్మీ.
    ఆ సమయానికే వచ్చిన రామనాధం గారు కొడుకును చూచి, "నువ్వు ముందుగా వెళ్ళిపో వోయ్, మీ ఊరు, నేనూ, జానకీ, లక్ష్మీ -- అందరం ఇక్కడి వ్యవహారాలన్నీ చక్క బెట్టుకొని మీ దగ్గరికి వచ్చి వెళ్తాము. అన్నట్టు పార్వతి కులాసాగా లేనట్టుంది -- జాగ్రత్తగా డాక్టరు కు చూపించు అక్కడ" అన్నారు.
    "అలాగే , నాన్నా!" అన్నాడు రాజు.
    జానకమ్మ "నేను కూడా వెళ్తాను. దీనికి ఒంట్లో బాగులేదు, వీడెం చూస్తాడు? ఎవరు వండుతారు?' అంది.
    ఊపిరి పీల్చుకున్నాడు రాజు.

                                                         29
    మహా నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. నిశారాణి ధర్మపాలన నాలుగు పాదాలా చేస్తున్న దనవచ్చు. కాటుక చీకటిలో బెడ్ లైటు వెలుగు పోరాడి ఓడిపోతున్న తరుణం లా కాంతి ప్రసారం. కెవ్వున కేకవేసి నిద్రపోతున్న దల్లా లేచి కూర్చుంది పార్వతి. అది విని అదిరిపోయిన రాజు తొందరగా వచ్చాడు పార్వతి గదిలోకి-- ఏం ఉపద్రవమో అనే కంగారుతో.
    గది గోడలు నాలుగూ బిక్కుబిక్కుమంటూ న్నాయి. మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఏడుస్తున్నది పార్వతి. రాజు రాకతో బిగపట్టుకుంది దుఃఖాన్ని.
    "ఎందుకు, పార్వతీ?' అన్నాడు రాజు.
    "ఏం లేదు" అంది పార్వతి బొంగురుగా.
    "కల వచ్చిందా?"
    తలాడించి ఊరుకుంది.
    "నేను మేలుకునే ఉంటాను. నిద్రపో." వెళ్ళబోయి అంతలో వెనుదిరిగి , "మందు తాగావా?' అని ప్రశ్నించాడు రాజు.
    "తాగలేదు..తాగాను....' తడబడింది పార్వతి.
    రాజు స్వయంగా ఔన్సు గ్లాసులో పోసి మందు ఇస్తుంటే అందుకోవడానికి అదొక విధమైన శ్రమ పడింది.
    నిద్రలోకి ప్రవేశిస్తూ, "కాకినాడ వెళ్లిపోవాలి ఈ సంవత్సరం పూర్తీ కావచ్చింది కదా' అనుకున్నాడు రాజు. అటువంటి చోట్ల అయితే పార్వతి సుఖ పడుతుందన్న సానుభూతి తో కూడిన భావన అంతర్గతంగా అతని రక్తంలో ప్రవాహించనారంభించిందేమో , ఆ సంగతి అతనికే సుస్పష్టంగా తెలియడం లేదు. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న లోకోక్తి అతని పేరుకూ, మనస్తత్వానికి చక్కగా కుదిరింది.
    నరసింహ మూర్తి గారి పొలాల్ని కౌలు కిచ్చి, తోటలు గుత్తదారుల రక్షణకు వదిలి పెట్టి ఇంటికి తాళం బిగుంచేశారు రామనాధం గారు. చందన పూర్ లో పార్వతి ఆరోగ్యం సరిగా ఉందొ లేదో చూసి తెలుసుకొని, జానకమ్మ తో రాఘవపురం వెళ్ళిపోయారు తర్వాత.
    లక్ష్మీ చందన పూర్ వచ్చి రెండు నెలలున్నది. పార్వతి దగ్గర. ఆఖరికి చెల్లెలిని విడవలేక తపించి పోతూ విధిని తప్పలేక, ధర్మానికి ఎదురు చెప్పలేక వెళ్ళిపోయింది. పార్వతి మనస్సూ అగాధం .
    పార్వతి తన అంతరంగం లోనే ఏర్పడిపోయిన ఆ నివిడ నిశ్శబ్దతకు తట్టుకోలేక విలవిల్లాడి పోయింది. సుభద్ర గారు పార్వతిని వదిలి పెట్టలేదు. టానిక్కులు, బలకరమైన ఆహార విషయాలలో జోక్యం కల్పించుకుంది. ఆ అమ్మాయిలో అంతర్లీనమై రగులుతూ ఉన్న దుఃఖాగ్నిని గమనించింది.
    ఆవిడ సంరక్షణ లో పార్వతి ఆరోగ్యం చెడె పరిస్థితి రాలేదు.
    రాధాకృష్ణ రావదమైతే చాలాసార్లు వచ్చాడు కానీ, పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేక పోయాడు. అదీకాక పార్వతి ఒంటరిగా అతనికి కనిపించలేదు. తీవ్రమైన నిర్వేదం అతనిలోనూ ఉంది.
    నెలలు తరలి పోతున్నా రాధాకృష్ణతో మాట్లాడేందుకు శక్తిని కూడగట్టు కోలేక పోయింది పార్వతి.
    యధాప్రకారం రోజులు గడుస్తున్నాయి.  ఎక్కడికైనా కదిలే ఉత్సాహం లేదు పార్వతికి. రాజు తనపట్ల జాలి పడుతున్నడని ఆమెకు అనిపించింది.
    
                                      30
    రాధాకృష్ణ చదివాడు ఆ ఉత్తరాన్ని. తిరిగి చదివాడు. ఆద్యంతమూ చూచాడు. ఎంత పరిశోధిస్తే ఏం ప్రయోజనం? అతను ఆశించినది, వెదికి వెదికి అందుకున్నదీ అయిన ఆదర్శపు మెట్టు మీదికి అధిరోహణ జరగనే లేదు. విలుప్తమై పోయినట్టయింది తన సుధా పాత్ర.
    "ఏది జరగాలో అది జరిగింది.' నిగ్రహించుకున్నాడు ఆఖరికి రాధాకృష్ణ.
    పార్వతి తలుపును అనుకోని నించుంది. ఎంత సేపో అయింది అలా ఉండి. కన్నీరు లేకపోయినా ఏ క్షణానికి ఆ కళ్ళు నిండి పోతాయో ఊహించడం అసాధ్యం. సుభద్ర గారి వల్ల పార్వతి శారీరక మానసిక స్థితులు తెలిసి ఉన్న రాధాకృష్ణ ఆ అమ్మాయి దుఃఖావస్థలో ఉన్నదని తెలుసుకున్నాడు . మెల్లగా నడిచి వెళ్లి తలపై మృదువుగా చెయ్యి వేసి, "పార్వతీ! నిష్కారణం గా ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇలా సర్వవేళలా దుఃఖిస్తూ కూర్చోవడం మంచిది కాదు. దురదృష్టవంతులను బాగుచెయ్యడం ఎవరి తరమూ కాదన్న వాక్యం కేవలం పొల్లు పోదు " అన్నాడు.
    అతని చిరునవ్వు లో ఎంత వ్యధ నిండి ఉందొ పార్వతి అతన్ని పరీక్షిస్తే తెలిసేది.
    "మీ అక్క తొందర పడ్డారు. కానీ, ఎంత పవిత్ర మూర్తి మీ అక్క! పవిత్రత నిండిన హృదయం లో కాస్త కళంకం ప్రవేశించినా చిత్ర హింస ఔతుందా బతుకు. అన్నిటికీ పవిత్ర దృష్టి తో చూడలేరు మీ అక్క. మనం కూడా పొరపాటు చేశాం, పార్వతి గారూ! పోనివ్వండి. మీ అక్కగారు వ్రాసిన మాటలు నేనెప్పటికీ మరిచి పోను. సువర్ణా కరాలై పోయాయి అవి ణా హృదయం మీద. ఆదర్శాన్ని నిలుపుకోలేక పొతే చంపుకొని అయినా -- ఆమె చెప్పినట్టు వివాహం చేసుకుంటాను. మీరు విచారించకండి, అదే ధ్యాసతో."
    పార్వతి గొంతు సర్దుకుంది. "అంతే . కృష్ణ గారూ! అక్క కోరిక ప్రకారం మీరు వివాహం చేసుకోండి. మీలో ఆశలు రేకెత్తించిన నాకు కూడా అదే శాంతి నిస్తుంది."
    తిరిగి పార్వతి అంది : "మేము ఇంక నెల రోజుల్లో కాకినాడ వెళ్ళిపోతున్నాము."
    "అదేమిటి?" అదొక విధంగా చాలించాడు రాధాకృష్ణ.
    "రాజు మళ్ళీ లెక్చరర్ ఉద్యోగానికి అప్లై చేసినట్టున్నారు. ఆ గొడవంతా నాకు తెలియదు. వెళ్లాలని అంటున్నారు. ఏమైనా మీలాంటి మంచి స్నేహితులు దొరుకుతారో లేదో నాకిక? ఇంత వరకూ మీ స్నేహం లభ్యం కావటమే నా అదృష్టంగా భావిస్తూ వచ్చాను."
    రాధాకృష్ణ కొట్టి పారేస్తూ ------"అలా ఎప్పుడూ అనుకోవద్దు. నేనే పృద్వీ లో ఏకైక సహృదయుడ్నీ అని భావిస్తున్నట్టున్నారు మీరు. విష కుంభాల్లటి హృదయాలేన్ని ఉన్నాయో అన్ని అమృత కులశాల వంటి మనసులు ఉంటాయని దృడంగా చెప్పలేను కానీ, ఆ సంఖ్య కు కాస్త అయినా సామిప్యం లో లేకపోతె ఈ ప్రపంచం ఇలా నిలుస్తుందన్న నమ్మకం లేదు నాకు. మీకేం? మీకు మంచి స్నేహితులు దొరుకుతారు. దొరకాలనే నా కాంక్ష. మంచిని కోరి వెదికే వారికీ అది అలభ్యవస్తువు కాదు. మధ్య మధ్య చెడుకు లొంగి పోనివ్వని నిగ్రహం మాత్రం అవసరం. ఎటొచ్చీ మీరు వెళ్ళిపోతే ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఇన్నాళ్ళూ ఎన్నెన్ని విషయాలు చర్చించు కున్నాము! విమర్శలు చేస్తూ ఎన్ని వివాదాలు పడ్డాము!" అన్నాడు నిట్టుర్పులోనే చిరునవ్వు కలిపి.
    "అందుకే మీవంటి మిత్రులకి దూరంగా వెళ్ళవలసి వచ్చిందని బాధపడుతున్నాను. మీరు చెప్పినట్టు ఎందరో మంచివాళ్ళు తారస పడతారు స్నేహితు లవుతారు. అది జరగవచ్చు ననుకోండి. దేనిలోనైనా విభిన్నత ఉంది చూడండి! ణా కిష్టమైన మంచితనపు తీరు మీలో రేఖా మాత్రంగా ఉంది. ణా హృదయం వాంచిస్తుంది ఒకరకం స్నేహాన్ని. అటువంటి వాళ్ళు సన్నిహితులైతే వాళ్ళు నన్నర్ధం చేసుకో గలరు. సరిగ్గా అందుకే నేనూ వాళ్ళతో అతికి పోగలను. ఏమంటారు దీనికి?" పార్వతి రాధాకృష్ణ ను చూచింది.
    అతని జుత్తు రేగి వుంది. ఎప్పుడూ నీటుగా ఉండే మనిషి నిర్లక్ష్యంగా అగుపించాడు. కళ్ళు ఎర్ర జీర చూపిస్తున్నాయి. అతను సరస్వతి ని గూర్చి ఎక్కువ విచారించి నట్టున్నాడు.
    "అవును. మనం కోరే మనస్తత్వాలే మన స్నేహితులు" అని, బలవంతంగా నవ్వాడు రాధాకృష్ణ.
    అతని రూపం చూచిన పార్వతి తేలికగా నవ్వలేక పోయింది.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS