
14
"ఏమైనా పెద్ద కాపు అబ్బాయి తెలివైన వాడు!"
'చదువు కూడా మన పాత డాక్టరు గారి కంటే ఎక్కువేట!"
"ఏం నిదానం? ఏం నెమ్మది! వచ్చిన వాళ్ళతో ఏం ఆదరంగా మాట్లాడతాడు........శంకరం గారూ ఉన్నారు మళ్ళా !....ఏక, దుమ ధుమా!...ఇటూ కంపౌండరు ని తిట్టా అటు వచ్చిన రోగుల్ని తిట్టా -- ఒక్క రోజున వచ్చిన వాళ్ళని ఆదరంగా పలకరించి ఎరుగునా?.......
"వైద్యం కూడా ......అంతంతగానే ఉంటోంది లెద్దూ పూర్వం ఏం ఇచ్చేవాడో ఏం తగ్గేవో కాని, ఇప్పుడాయనిచ్చే రంగు నీళ్ళ కి ఏ రోగం లొంగడం లేదు ఆసుపత్రికి ఇంటికీ మధ్య ఈ మందు సీసాలు మొయ్యలేక విసుగొస్తోంది.
"అసలు వైద్యం చెయ్యడం లో శ్రద్ధ కూడా తగ్గింది లే. ఈ పార్టీల లోకి, కక్షలలో కీ దిగాక"
"అంతే అంతే -- లేకపోతె అయన మాత్రం ఏం తక్కువ వాడా ?........... ఆశ వదిలేసుకున్న ఎన్ని రోగాల్ని కుదర్చలేదు. ఈ పదిహేను పదహారెళ్ళ లోనూ అయన ఎన్ని వేల మందిని మృత్యు ముఖాల నుంచి తప్పించలేదు"
"అది నిజమే!....అసలీ వాసుని బతికించినది ఆయనేగా?'' ...చిన్నప్పుడు వీడికి చేసిన జబ్బుకి బతుకుతాడను కున్నామా?"
"ఏమిటో ?...నువ్వన్నీ పూర్వం రోజులు చెప్తావు ?....అప్పటి జబ్బులు కనుక ఆయనలా కుదర్చ గలిగాడు. ఇప్పుడొచ్చే ఈ కొత్త కొత్త జబ్బుల్ని కుదర్చమను చూద్దాం."
"బాగా చెప్పావు .....ఏవైనా , ఇంక శంకరం గారి వైద్యం వెనక బదినట్లే !...కొత్త మందులూ పెద్ద డాక్టరు కూడా వచ్చాక ఇంకా శంకరం గారి ఆసుపత్రి నే పట్టుకుని వేళ్ళాడడం తెలివి తక్కువ"--
ఇలా ఊళ్ళో నూ, చుట్టూ పక్కల గ్రామాల్లో నూ పది మందీ పది రకాలుగా వ్యాఖ్యానించు కుంటూ , క్రమక్రమంగా శంకరం ఆసుపత్రి కి మానేసి సేవాసదనం కి వెళ్ళడం ప్రారంభించారు.
డాక్టర్ చురుకైన యువకుడు.
వైద్య విదానాలా నూతనంగా ఆకర్షణీయంగా ఉన్నాయి.
మనిషా ఎప్పుడూ ఆదరంగా, నవ్వుతూ మాట్లాడుతాడు.
డబ్బుకా రోక్కించకుండా ,- బీదా బిక్క కనిపెడుతున్నాడు.
దాంతో ఇంతవరకూ మునసబు పార్టీ లో ఉంటూ వచ్చిన కూలి నాలీ జనం కూడా వాసు దగ్గరికి వెళ్ళసాగారు. శంకరం లాగే అతను కూడా తండ్రి సలహా ప్రకారం చాలావరకు ఉచితంగానే వైద్యం చేస్తున్నాడు. పరీక్షించి చీటీలు రాసి ఇస్తాడు. మందులు తాము కొనుక్కుంటే చాలు వైద్యం అదీ ఊరికే చేస్తాడు. ఆ మందుల కైనా పూర్వం లాగ ఇప్పుడు నగరం వెళ్ళక్కర్లేదు .సేవాసదనం పక్కనే, శేషయ్య తన దూరపు చుట్టం ఒకడి చేత మందుల కొట్టు పెట్టించాడు. అందులో తరచూ వీరాచారే ఉంటూ ఉండడం వల్ల పైకి ఊరికే పేరుకి దూరపు చుట్టం అన్నాడు కాని నిజానికి ఈ మందుల షాపు శేషయ్య దే అనుకునారు ఊళ్ళో వాళ్ళంతా. ఏమైతే నేం చీటికీ మాటికీ నగరం వెళ్ళే బాధ తప్పింది కదా అని సంతోషించారు అంతే.
క్రమక్రమంగా సేవాసదనం దగ్గర పేషెంట్స్ సంఖ్య పెరుగుతూ శంకరం ఆసుపత్రి దగ్గర తరగడం ప్రారంభించింది. ఇప్పుడు శంకరానికి అంతా ఖాళీయే !....జరిగిపోయిన రోజుల్నీ, జరుగుతున్నా రోజుల్నీ పోల్చుకుంటూ ఆలోచించు కుంటూ కూర్చుంటే ఏ గంట కో, అరగంట ఓ పేషెంటు వస్తాడు తన ఆలోచనలకి అంతరాయం కలిగించడం కోసం ఎంత ఓర్పుగా విందామనుకొన్నా ఏదో సోది చెప్పుకు వచ్చి ఆఖరికి తనకి విసుగు కలిగిస్తే కాని వెళ్ళడు. తనని ఎక్కిరిస్తున్నట్లు ఎదురుగుండా గోళ్ళు గిల్లుకుంటూ ఈ కాంపౌండరు ఒకడు. వీడి జీతం ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బు లేకపోతె ఈ మధ్య ఒకటి రెండు సార్లు పంతులు దగ్గర చేబదులు చేసీ మరీ ఇవ్వవలసి వచ్చింది.
రోజు రోజుకీ పరిస్థితి గడ్డుగా తయారవుతోంది . ఇంట్లో కూడా రోజూ గడవడం కష్టంగా ఉంది. డబ్బుకీ మరీ కటకట వచ్చి పడింది. చేతిలో డబ్బు తగ్గేటప్పటికి శంకరానికి కోపం చిరాకు, ఎక్కువ కాసాగాయి. ఈ మధ్య రోజూ సావిత్రినో, మణి నో, ఎందుకో ఒకందుకు తిడుతూనే ఉన్నాడు. మణి కనిపించినప్పుడల్లా దాని పెళ్లి చేయలేక పోయామే అనే ఆలోచన వచ్చినప్పుడల్లా చీదరించు కుంటూ కేకలేస్తూనే ఉన్నాడు.
"ఇంటికి శనిలా దాపురించావు " అనీ.
"నువ్వు విరగడవుతేనే కాని దరిద్రం వదలదనీ"
"చమురు కాళ్ళ దానివే నువ్వు నాకు కనిపించకు అవతలకి ఫో" అనీ- ఇలాగ ఇష్టం వచినట్లు జ్ఞానం వచ్చిన పిల్ల ఏం బాధపడుతుందో అని అయినా ఆలోచించకుండా తిడుతున్నాడు శంకరం.
నాన్న తనని అలా తిట్టినప్పుడల్లా ఎవళ్ళూ చూడకుండా పెరట్లో కి వెళ్లి గుడ్ల నీళ్ళు కుక్కుకొంటుంది మణి. అటు నానాటికీ పెరిగిపోతున్న భర్త కోపానికీ తట్టుకోలేక, ఇటు తనతో పాటు మానసిక వేదనతో కుంగి పోతూన్న కన్నకూతురి బాధనీ చూడలేక సావిత్రి బతుకు బరువుని భారంగా ఈడుస్తోంది.
ఈ కక్షలూ , కార్పాన్యాలు వదులుకొని తిరిగి పెద్దకాపు తో స్నేహం కలుపుకుంటే ఇన్ని కష్టాలూ, బాధలూ ఉండవు తమకి.
లేదా మణి నీ పాటికి మెట్రిక్యులేషన్ కట్టిస్తే, అదైనా ఆ చదువులో పడి ఈ కష్టాల నుండి తాత్కాలికంగా తప్పుకుంటుంది.
అదీ కాకపొతే కొన్నాళ్ళ పాటు మణి ని ఏ గోపాలం దగ్గరికో పంపిస్తే ఇక్కడ తామిద్దరం ఏదో కాలక్షేపం చెయ్యొచ్చు.
వీటన్నింటి కంటే ఏ తలో తాకట్టు పెట్టి రెండు వేలు పట్టుకొస్తే, కొబ్బరి బొండాన్నీ, పిల్లనీ ఓ అయ్య చేతిలో పెట్టి దణ్ణం పెట్టి, ఆ తర్వాత తమకి ఏమైనాసరే అని నిశ్చింతగా ఉండొచ్చు ఆయనా, తనూను.
కాని-- ఇందులో ఏ ఒక్కటీ చెయ్యడాని కెనా అయన ఒప్పుకుంటారా ?.......పోనీ అని ఇలా చెయ్యండని అనడానికి వల్లా ? కోపంతో ఒళ్ళంతా కదిలించేసుకుని కేక లేసేయ్యరూ "నువ్వు చెప్పోచ్చావా?' అని.
సావిత్రి కేం పాలు పోకుండా ఉంది.
డబ్బు సరిపోక నాన్న పడుతున్న బాధలూ, తన మీదా, అమ్మ మీదా చూపిస్తున్న చిరాకులూ చూసి, తన దగ్గరున్న రెండు వేల రూపాయల సంగతీ చెప్పి ఇచ్చేనో అనుకుంది మణి అలా అనుకునే ఒకటి రెండు మాట్లు బెదురుతూ బెదురుతూ ఆ ప్రస్తావన ఎత్తింది.
"ఆ మధ్య వాసు ద్వారా శేషయ్య మావయ్య పంపించిన రెండు వేలూ తీసుకుంటేనో-- కొంచెం మనకి ఉపయోగ పడుతుంది కదా?' అంది.
"ఏవిటీ ! తిరగ గొట్టేసిన ఆ ముష్టి డబ్బు తిరిగి అడగమంటావా? అన్నాడు కళ్ళు అంత చేసుకుంటూ శంకరం.
"పోనీ నువ్వు అడగవద్దు -- నేను వెళ్లి పట్టుకొస్తా"
"చాల్లే!...అంతటితో కట్టి పెట్టు -- వాడి డబ్బు మనకి అక్కర లేదు. వాడి ఇంటికి నువ్వు వెళ్ళడమూ అవసరమూ లేదు-- అవును గాని వాళ్ళ ఇంటికి నువ్వు వెళుతూ ఉండవద్దని చెప్పాను వెళ్ళడం మానేశావా?"
"ఆ!"
"ఏమోలే !...నువ్వు ఇంక ఎప్పుడేనా వాళ్ళ ఇంటికి వెళ్ళావని కనక తెలిసిందో జాగ్రత్త - నరికి అవతల పడేస్తాను" ఉరుమురిమినట్లు అన్నాడు శంకరం. మణి గజగజ వణికిపోయింది శంకరం కోపం చూసి దాంతో ఇంట్లో డబ్బుకి ఎంత అవస్థ పడుతున్నా పెట్లో ఉన్న సొమ్ముని అలాగే ఉంచేయవలసి వచ్చింది మణి.
ఇలా ఉండగా ఓరోజున మునసబూ, పంతులూ కలసి మిట్టమధ్యాహ్నం వేళ శంకరం ఇంటికి వచ్చారు. ముగ్గురూ చేరి కటకటాల వసారా లో ఏదో మంతనాలు సాగించడం ప్రారంభించారు. అమ్మేమో గడప మీద తల పెట్టుకొని భోజనాల వసారా లో చెంగేసుకుని పడుకుని నిద్ర పోవడం వల్ల మణి కేం తోచక వాళ్ళు మాట్లాడు కుంటున్నదంతా వింటూ పక్క గదిలో కూర్చుంది.
"అంటే పంచాయితీ ఆక్టు ప్రవేశ పెట్టిందన్న మాట ప్రభుత్వం !" అన్నాడు శంకరం.
"ఆ.......త్వరలో మన ఊరికి ఓ పంచాయితీ బోర్డు వస్తుంది..." అన్నాడు పంతులు.
"మంచిదే!"
"ఏం మంచి అండీ!...పంచాయితీ బోర్డు వచ్చి డానికి ఎలక్షను లు జరిగి, ఓ ప్రెసిడెంటు అంటూ తయారయితే , ఇంక వాడే ఏలుతాడు ఊరు నంతనీ" అన్నాడు మునసబు.
'అది ఎలాగూ తప్పదు కదా?..... గవర్నమెంటు ఓ యాక్టు అంటూ పెట్టాక ప్రతీ ఊరికీ పంచాయితీ బోర్డు రావడం దానికో ప్రెసిడెంటు ఎన్నిక కావడం, వాడా ఊరిని ఏలడం ఇవన్నీ జరక్క ఏమవుతాయి ?.... మనం అపుతే ఆగుతాయా?"
"అని మనం ఆపుతామని కాదు , అగుతాయని కాదు"
"మరి?"
"రేపు ఎలక్షను అంటూ వస్తే ఏమౌతుందో కొంచెం ఆలోచించండి , ప్రెసిడెంటు ఎవరవుతారని మీ అంచనా?"
"ఏమో అది నేనెలా ఊహించ గలను?" అన్నాడు శంకరం.
"ఇప్పుడు ఊళ్ళో కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళు ఎవరున్నారు?.....మునసబు గారూ, మీరూ, ఇంకా పొతే ఆ పెద్ద కాపూ అవునా" అన్నాడు పంతులు. "ఇంకా నా పలుకుబడి ఎక్కడ ఉంది లెండి" అన్నాడు శంకరం నీరసంగా నవ్వుతూ.
"అమ్మమ్మ - అలా అనకండి....పైకి ఎలా ఉంటున్నా, ఊళ్ళో ఉన్న జనానికి మీరంటే లోపల మాత్రం గౌరవమూ, భక్తీ చావలేదు" అన్నాడు మునసబు.
"పోనీ సరే -- మీ మాట కాదనడం ఎందుకు?....అందాలా అలాగే అని ఒప్పుకుందాం...ఊ అయితే ."
"ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తె పెద్ద కాపు ప్రెసిడెంటు అయిపోయే ప్రమాదం కనిపిస్తోంది - ఏమైనా సరే మనం అతనవకుండా చూడాలి"
అయితే మీరు అతనికి పోటీగా నుంచుంటే సరి"
"నేను గ్రామ మునసబు ని- సర్కారు నౌఖరు ని-- నేను నుంచోడానికి వీలు లేదు"
"మరెలాగ?"
"మిమ్మల్ని-- నుంచోమని చెప్పడానికే వచ్చాం . ఇప్పుడు మేం ఇద్దరం " అన్నాడు పంతులు , మునసబు కేసి కూడా చూస్తూ.
"నేనా ?" ఆశ్చర్యంగా శంకరం అన్నాడు.
"అవును, ఏం ?....మీరు నుంచోడాని కేం?"
"ఏం అని కాదు....నాకెందు కిదంతా.........నాకేం తెలుసునని"
"మీకేం తెలియనక్కర లేదు. మీరలా ఉండండి చాలు . తక్కిన దంతా మేం ఇద్దరం వెనకాల ఉండి చూసుకుంటాం , ఏం పంతులూ "
"అవునండీ?"
"నాకు అంగ బలం, అర్ధ బలం ఏదీ?....ఏదీ లేకుండా మీరు నుంచో మంటేనూ, నేను నుంచుంటే నూ సరి పోయిందా ........ప్రస్తుతం మన ఫైలూ పలుకుబడీ అంతంత మాత్రంగా ఉన్నాయి కదా?...ఇంకా ఎలక్షను లూ పదవులూ అంటూ బయలుదేరితే ఏవైనా ఉందా ?...ఉన్నవి కాస్తా ఊడిపోవూ?"
"ప్రెసిడెంటు అయి, పదవి వచ్చాక ఇంకా ఫైలు ఎందుకండీ? పలుకుబడి అంటారూ , ఇప్పుడు మీకు లేదేమిటి ?....ఒకవేళ ఈ మధ్య కొంత తగ్గినా -- అదంతా తిరిగి ఈ ఎలక్షన్ లో సంపాదించు కోవచ్చు. పలుకుబడిది ఏం ఉందండీ. దాని మొహం ఈడ్చా అదే వస్తుంది ప్రెసిడెంటు అయితే సరి.
ఏదో సామ్యం చెప్పినట్లు ఉంది ప్రెసిడెంటు అయితే మహా బాగే. కాని ఆ అవడానికి అంగ బలమో అర్ధ బలమో ఉండాలి కదా?"
"అంగ బలం ఎం ఉందండీ ?....అర్ధబలం ఉంటె సరి అరగంట లో అంగ బలం అదే సమకూరుతుంది , పది రూపాయలు మనవి కాదంటే పది మంది మనవాళ్ళే?"
