Previous Page Next Page 
దీప శిఖ పేజి 32


    "మీరు తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి"
    "నేనా?' ఆశ్చర్యంగా అడిగాడు శంకరం.
    "ఇదిగో ఆహ్వానం" అంటూ అందించాడు వాసు.
    "మాకేందుకోయ్ ఆహ్వానాలు!.. ఊళ్ళో పెద్దవాళ్ళకి ఇవ్వక పోయావూ !" అన్నాడు శంకరం.
    భర్త కంఠం లోని వెటకారాన్ని గమనించి నొచ్చుకుంది సావిత్రి.
    "మీరు తప్పకుండా రావాలి " అన్నాడు వాసు ప్రాధేయ పూర్వకంగా. శంకరం ఏం సమాధానం చెప్పక పోయేసరికి సావిత్రే 'అలాగే వస్తారు లే బాబూ!....నువ్వు ప్రత్యేకంగా ఇంత ఆప్యాయతతో వచ్చి పిలిచాక రాకుండా మానేస్తారా?' అంది. శంకరం సావిత్రి కేసి కొరకొరా చూశాడు.
    "అంతే కాదండీ - నేను కుర్రవాణ్ణి , అనుభవం లేని వాణ్ణి. నాకు ఎప్పుడూ మీ సలహాలు , సహకారం ఇస్తూ వుండాలి. వైద్యం చెయ్యడం లోనూ, నిత్య వ్యవహారం లోనూ కూడా!"
    "అదేవిటోయ్ ! నువ్వు నాకంటే పెద్ద డాక్టర్ వి. ఏమ్. బి. బి. ఎస్ పాస్ అయ్యావు..........నీకు నా సలహా ఏమిటి?" అన్నాడు హేళనగా శంకరం.
    'అలా అనకండి . డిగ్రీ గొప్పే కాని మీపాటి అనుభవం ఎక్కడ వస్తుంది?" అన్నాడు వినయంగా వాసు.
    "మహా చక్కా వస్తుంది " అన్నాడు శంకరం కటువుగా.
    శంకరం కంఠం లోని పౌరుష్యాన్ని చూసి విస్తుపోయాడు వాసు. శంకరం మొహంలోకి పరిశీలనగా చూశాడు. ఆ చూపుకి శంకరం ఇబ్బంది పడ్డట్టు అయి, ఆ ఇబ్బంది పైకి కనపడకుండా ఉండడం కోసం ముఖం పక్కకి తిప్పి కుర్చీలోంచి లేచాడు. వాసు కూడా లేస్తూ "నా అభ్యర్ధన ఏం చేశారు?' అన్నాడు శంకరం కేసి తిరిగి జాలిగా.
    శంకరం అవునని గాని, కాదని కాని ఏం సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. అతని ప్రవర్తన చూస్తె సావిత్రికి కష్టం వేసింది. అందుకే చిరాగ్గా "పాపం అతనన్ని మాటూలు ప్రాధేయ పడుతుంటే "ఊ" అనడాని కేం?....అలా మాట్లాడక ఊరు కుంటారేమిటి? అంది.
    "నీ సలహా ఎవరూ అడగలేదిక్కడ? ముందు నువ్వు నోరు మూసుకుని వంటింట్లో కి దయ చెయ్యి" అన్నాడు శంకరం గట్టిగా గర్జిస్తూ -- సావిత్రి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ! ఇంక అక్కడ ఒక్క క్షణం నిలబడలేక గబగబా వచ్చేశాడు వాసు.
    ఇంటికి వచ్చే టప్పటికి శేషయ్య కాగితాలున్న గూళ్ళూ, దస్తాలుంచిన కర్ర పెట్లూ, డబ్బూ దస్కం దాచుకునే సందువా పెట్టీ అన్నీ వెతికేస్తున్నాడు. మనిషి మహా చిరాగ్గా ఉన్నాడు. ఆ వెతకడం పద్దతి చూసేసరికి అర్ధం అయి వాసు గుండెల్లో రాయి పడింది. తనని ఎక్కడ అడుగుతాడో అని గుండెలు పీచు పీచు మంటూ ఉన్నాయి. ఇలా భయపడుతూ సమాధానం ఏం చెబుదామా అని నిర్ణయించుకునేలోగా అడగనే అడిగేశాడు "ఈ సందువా పెట్టెలో ఆహ్వానం ఒకటి ఉండాలిరా?.. నువ్వు గాని తీశావా ?" అని.
    అబద్దం చెప్పడానికి కూడా అవకాశం లేదు.
    "ఎవరికి పట్టికెళ్ళి ఇచ్చావు?' అని గర్జిస్తూ అడిగాడు శేషయ్య. ఎంతో కోపం వచ్చినప్పుడు కాని నాన్న కంఠం అలా వుండదు. ఆ ఒక్క ఆహ్వానం ఎంతో అవశ్యంగా ముఖ్యమైన వాళ్ళ కేవరి కోసమో దాచి ఉంచి పట్టుకున్నాడు నాన్న. అది తెలియక తను పట్టుకెళ్ళి డాక్టరు గారికి ఇచ్చాడు. రెండు మూడు సార్లు రోకాయించి అదిగాక ఇంక చెప్పక తప్పలేదు వాసుకి. తన జవాబు ఫలితం ఎంత ప్రమాదంగా ఉంటుందో అనే భయ పడుతూనే "డాక్టరు గారికి పట్టుకెళ్ళి ఇచ్చాను" అన్నాడు నెమ్మదిగా.
    ఇది విన్నాక, అనుకున్నట్లు శేషయ్య ముఖంలో కోపంతో జేవురించనూ లేదు, కళ్ళలో విస్పుట లింగాలు కుమ్మరించనూ లేదు. కాస్సేపు నిరుత్తరుడై ఉండిపోయాడు.
    ఆ తర్వాత "నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చావా?' అన్నాడు.
    "ఊ!"
    "ఎవన్నాడు?"
    జరిగింది చెబితే నాన్న మనసు ఏం బాధపడుతుందో అని 'అలాగే ' వస్తానన్నారు' అని చిన్న అబద్దం చెప్పాడు వాసు.
    దాంతో శేషయ్య ముఖం విప్పారింది.
    కాని ఆ విప్పారిన ముఖం ప్రారంభోత్సవం వాడు ముకుళించుకు పోవడానికి ఎంతో సేపో పట్టలేదు. ఫెళ్ళు మంటూ సాగుతున్న ఆ వేడుకలో శేషయ్య కళ్ళు ఎంతసేపూ గేటు వైపే ఉన్నాయి. ఇంకా వస్తాడు . ఇంకా వస్తాడని చివరి దాకా ఆశించిన శంకరం చివరికి రాకపోయేసరికి శేషయ్య ముఖం నిజంగానే ముకుళించుకు పోయింది. ఆ తర్వాత వాసు ,మీద ఒకటి రెండు సార్లు విరుచుకు పడ్డాడు కూడా. "స్వయంగా వెళ్లి అ శంకరాన్ని పిలిచి అవమానాన్ని కొని తెచ్చు కున్నందుకు."
    సేవాసదనం ప్రారంభోత్సవం జరిగి పట్టుమని పది రోజులయినా కాకుండా శేషయ్య మంచాన పడ్డాడు. ఈ ప్రారంభోత్సవం కోసం నిద్రాహారాలు లేకుండా ఒళ్ళు అంతా విరుచుకున్నాడు అందువల్ల ఇలా జబ్బు చేసింది అని కొందరన్నారు. అసలీ సేవాసదనం ప్రారంభించిన వేళ మంచిది కాదు, అందుకే శేషయ్య మంచాన పడ్డాడని కొందరన్నారు. ఇన్నాళ్ళూ ఈ ఊరి తో బాటు పది పదిహేను ఊళ్ళ కి రాత్రింబవళ్ళు సేవ చేస్తున్న ఆ దీన జనోద్దరుడి మీద పోటీకి కొడుకుచేత  శేషయ్య ఈ సేవాసదనం పెట్టించాడు. ఆ మహానుభావుడు ఉసురు ఊరికే పోతుందా? ఇలా తగిలింది అన్నారు మరికొందరు.
    ఏమైతేనేం ........ఏదో జ్వరం తగిలినట్టు వచ్చి ఒకటి రెండు లంఖణాలతోటి కాస్త విశ్రాంతి తోటీ తేలి పోతుందనుకున్న నలత నానాటికీ తీవ్ర రూపం దాల్చి ప్రమాదకరమైన జబ్బుగా పరిణమించింది. ఓ గంట కి విపరీతమైన జ్వరం- మరో గంట కి ఒళ్ళూ, కాళ్ళూ చల్లబడడం , రాత్రిం పగళ్ళు మగత -- మధ్యలో ఏదో పరాకు మాటలూ -- కాళ్ళూ చేతులూ మంచం పట్టీలకి వేసి కొట్టుకోవడం. పరిస్థితి ఏం బాగోలేదు. ఆందోళనకరంగా వుంది. మంచం వదలకుండా దగ్గిరే కూచుని, ఈ మందు కాదని ఆ మందూ ఆ మందూ కాదని ఈ మందూ మార్చి మార్చి ఇస్తూ కంగారు పడుతున్నాడు వాసు, తను చదువుకొన్న వైద్య శాస్త్రంలో ఎక్కడా ఈ లక్షణాలున్న జబ్బు ఉన్నట్టు లేదు అసలు ఫలానా జబ్బు అని తేలకుండా వైద్యం దేనికని చెయ్యడం ?' "నాన్న ఎమౌతాడో నాన్న ఏమౌతాడో" అనే ఆదుర్దా వల్ల కొంత స్థిమితంగా ఆలోచించలేక పోతున్నాడు. ఏ ఇతర డాక్టర్ల సలహా నేనా తీసుకుంటే ?....ఈ అడవిలో ఎవరున్నారు శంకరం  గారు తప్ప?.....పిలిచినా అయన రారు- మొన్న ప్రారంభోత్సవానికి పిలిచినప్పుడే తెలిసి పోయింది. అయన మనస్సు ఏవిటో ?....పాత స్నేహాన్ని , ఇన్నాళ్ళ అప్యాయతల్ని అయన శుభ్రంగా తెంచేసుకుని నిశ్చయంగా కూచున్నాడు లేకపోతె "అయ్యో శేషయ్య గారికి ఎలా ఉంది పెద్ద కాపు గారికి కొద్దిగా నేమ్మదించిందా?" అంటూ పార్టీల కక్ష కూడా మరచి ఊరు అశేష జనం వచ్చి చూసి పోతుంటే అయన ఒక్కసారైనా వచ్చారా?.....రాని వాళ్ళల్లా మునసబు, పంతులూ, శంకరం -- వీళ్ళు ముగ్గురే!....తక్కిన ఊళ్ళో , జనాభా అంతా ఎప్పుడో అప్పుడు వచ్చి చూసి వెళుతున్నారు. పెద్దకాపు ఇలా ఉన్నా ఒక్కసారి అయినా వచ్చి చూడనే లేదు శంకరం అని తెలిసి వచ్చిన వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకున్నారు. "ఇవాళ కక్షలు , కలహాలు వస్తే మాత్రం ? పాత స్నేహం, దాని తాలుకూ అభిమానాలు ఏమైపోయాయి?.........రాతి గుండె ......." అనుకుంటూ ------
    ఇంకా చుక్క పొడవలేదు , రైతులింకా కావిళ్ళు భుజాన వేసుకుని పొలాలకి బయలుదేరలేదు. బాగా ఝాము ఝామున్నర రాత్రి వుంది. రాత్రి అంతా తండ్రి మంచం ప్రక్కనే కూర్చుని, ఇచ్చిన ఇంజక్షన్ ఇయ్యకుండా సేవ చేసిన వాసుకి ఒక్క క్షణం వీధి తలుపు తీసి చల్లని గాలి పీల్చుకుందాం అనిపించింది. వసారా లో వీరాచారి, రంగయ్యా ఇంకో ఇద్దరు ముగ్గురు రైతులూ రాత్రి సాయాని కని వచ్చి పడుకొని ఉన్నారు. వాళ్ళని తప్పించుకుంటూ వెళ్లి వీధి తలుపు తెరిచాడు , అప్పుడే తమ అరుగు పక్కకి తప్పుకొని గబగబా నడిచి వెళ్ళిపోతున్నారు ఎవరో?
    "ఎవరు వారు?' అన్నాడు వాసు.
    జవాబు లేదు.
    `దొంగ ఏమో అని రెండు అంగలల్లో వెళ్లి కలుసుకున్నాడు. సన్నని నక్షత్రాల వెలుతురూ లో ముఖాన్ని పరిశీలించి చూచి దిగ్భ్రమ చెందాడు "మీరా"  అన్నాడు ఆశ్చర్యంతో.
    "అవును. నేనే కాని, ఎలా ఉంది నాన్నకి?"
    "ఇంత రాత్రి వేళ వచ్చారేమిటి ?....;లోపలికి రాకుండా వెళ్లి పోతున్నారేమిటి ?"
    "ఇంతకీ శేషయ్య గారికి ఏవిటి జబ్బు - ఎలా వుంది?"
    "రండి , లోపలికి వచ్చి చూద్దురు గాని"
    "అక్కర్లేదు చెప్పు"
    వాసు అంతా సవిస్తరంగా చెప్పాడు. వ్యాధి పరిస్థితి, అందుకు తను వాడుతున్న మందులూ అన్నీ విపులంగా వివరించాడు, వాసు చెప్పిందంతా విని కొంచెం సేపు తీవ్రంగా అలోచించి "ఆ మందులన్నీ ఏం వద్దు, అసలు జబ్బు వేరే అయి ఉంటుంది. ఈ మందు వాడి చూడు గుణం ఇస్తే కంటిన్యూ చెయ్యి" అంటూ ఏదో మండు పేరు వ్రాసి "మరి నే వస్తా' అంటూ వెళ్ళబోయాడు శంకరం.
    ' లోపలికి వచ్చి నాన్ననో మారు చూసి మరీ వెళ్ళండి" అన్నాడు వాసు.
    "వొద్దు, వొద్దు - అసలీ వైద్య సలహా నేను ఇచ్చానని కూడా ఎవరికీ చెప్పవద్దు నాకు నువ్వీ వాగ్దానం చెయ్యాలి.
    "అలాగే చెప్పను- సరా?' అన్నాడు వాసు.
    మరేం లేదు-- ఈ మండు శంకరం సూచించింది అంటే, తాగడం మానేస్తాడు కూడా మీ నాన్న" అంటూ వెటకారంగా ఒక నవ్వు నవ్వి ఇంక అక్కడొక్క క్షణమైనా నిలబడకుండా గబగబా వెళ్ళిపోయాడు శంకరం ?
    వాసు శంకరానికి మనస్సు లోనే కృతజ్ఞత లర్పించు కున్నాడు ఎంత సూక్షంలో తెల్చేశాడాయన!...నిజమే ....తన కింత వరకు తట్టలేదు జబ్బు ఇదీ అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. తక్షణమే రంగయ్య ని లేపి ఆ చీకట్లో నగరం పంపించాడు సైకిలిచ్చి. రంగయ్య తెచ్చిన మండు సంజీవిని లా పని చేసింది. శేషయ్య క్రమక్రమంగా కోలుకున్నాడు . "ఎంత గడ్డు రోగాన్ని కుదిర్చాడు ?....కుర్రాడైనా తెలివైన వాడు వాసు" అంటూ ఊళ్ళో అశేష జనం ఏక పొగడడమే వాసుని-- ఆ పొగడ్తలు తన చెవిన పాడినప్పుడు మాత్రం తల వంచుకోనేవాడు వాసు. శంకరాని కిచ్చిన వాగ్దానం జ్ఞాపకం వచ్చి నోరు మేదిపే వాడు కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS