Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 32


    కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు బలరామయ్య: "ఆవేశంగా యేమేమో అన్నట్టున్నాను. బాధపడకు, శాంతీ. నేను సంతోషంగానే ఉన్నానమ్మా."
    "లేదు, నాన్నా. ఇకనుంచి మీకు కష్టం కలిగించను. నిజంగా ఈ శాంతినిలయం వ్దిలిన్ తర్వాత నాకూ శాంతి లేదు. ఏమేమో భ్రమ పడ్డాను. అంతే."
    "శాంతీ!"
    "అవును, నాన్నా. ఇక యిక్కడే ఉంటాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను." కళ్ళొత్తు కుంటూ గబగబా వెళ్ళిపోయింది.
    మేడమీద తన గదిలోకి వెళ్ళుతూండగా అపస్వరాలతో ఏదో గానం విన్పించింది - ఎవరో పశులకాపరి కాబోలు పాడుకుంటు న్నాడు. హఠాత్తుగా శాంతి కాలు నిలిచిపోయింది. ఇదే సమయం - గోవిందరావు మురళి వాయించే నిర్మల ప్రాతఃసమయం. అరుణకాంతులు వచ్చీ రాని ప్రభాతవేళ. దీర్ఘంగా నిట్టూర్చింది హృదయం. బలవంతాన ఆలోచనలను అణచిపెట్టి పోయి ప్రక్కపై వాలింది. మనస్సుకు శాంతి లేకపోయినా రాత్రంతా నిద్ర లేకపోవటంవల్ల అలసిన శరీరం వెంటనే నిద్రాదేవి ఒడిలో జేరింది.
    ఉదయం తొమ్మిది గంటలకు తల్లి లేపగా నిద్ర లేచింది శాంతి.
    "ఈ రంగులూ, బ్రష్ లూ ఏమిటిలా ఒలికిపోయాయి? ఇంత చీదరగా ఉందేమిటి గది?"
    తల్లి మాటలకు ఆశ్చర్యపోతూ గదంతా కలియజూచింది శాంతి.
    "త్వరగా ముఖం కడుక్కుని స్నానం చెయ్యి" అంటూ వెళ్ళిపోయింది లక్ష్మీదేవి.
    'నిన్న చిత్రం వేస్తూ వేస్తూ ఆపేసింది, గోవిందరావు ఉత్తరం రావడంతో. అన్నీ అలానే వదిలేసింది. అయినా తన గదుల్లోకి ఎప్పుడూ ఎవరూ రారు. ఏమిటిలా ఉన్నాయి? ఎవరో తన్నేసినట్లు పడిపోయాయి. త్రొక్కు కుంటూ పోయినట్లున్నారు. ఒక పాదం వ్రేళ్ళ గుర్తులు రెండు మూడు చోట్ల పడ్డాయి.' ఆశ్చర్యపోతూ చూచింది.
    తెల్లవారుఝామున తను గదిలోకి వచ్చేసరికి తలుపుతీసి లైటు వేసి ఉంది. అప్పుడు తన మనస్థితి ఆ విషయాల గురించి ఆలోచించ నీయలేదు. ఎప్పుడూ గదిలోంచి వెళ్ళేటప్పుడు గొళ్ళెం వేసివెళ్ళడం అలవాటు. ఎవరు తీశారు? గదంతా కలియజూచింది. తాను శాంతినికేతన్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ట్రంక్ పెట్టె లేదు. అరె! అందులో చీరలూ, ఇతర వస్తువులూ గదిలో పరిచి ఉన్న తివాచీమీద చిందర వందరగా పడవేసి ఉన్నాయి. క్రోధాశ్చర్యాలతో నౌకర్ని కేకేసింది.
    వాడూ ఆశ్చర్యపోయాడు. "దొంగ వచ్చినా సరుకులు తీసుకుపోతాడు గానీ వట్టి పెట్టె దేనికి, చిన్నమ్మా?" అని నవ్వాడు వాడు.
    "సర్లే. వెధవ గొడవ లేస్తూనే. తర్వాత చూచుకోవచ్చు. స్నానానికి నీళ్ళు పెట్టు."
    శాంతికి ఎవరితోనూ మాట్లాడాలనీ, ఎవరినీ చూడాలనీ లేదు. అసలే ఏకాంత ప్రేమికయైన ఆమె మనస్సు ఇప్పుడు పూర్తి ఏకాంతాన్ని కోరుకొంటూంది. స్నానం చేసివచ్చి తల దువ్వుకొంటూండగా కాఫీ టిఫన్ లు గది లోకే తెచ్చి యిచ్చింది పెద్ద వదిన.
    "వదినా, రాత్రి నా గదిలోకి నువ్వు వచ్చావా?"
    "నేనా!" విస్తుపోయింది పద్మ. "ఈ యింట్లో నేనే కాదు. ఎవరూ అంత అనాగరకులు లేరనుకుంటాను."
    "నాకా సంగతి తెలుసులే, వదినా. కానీ......"
    విషయమంతా విన్న పద్మకూడ ఆశ్చర్యపోయింది. "రాత్రి మీ అన్నయ్యకు కొద్దిగా జ్వరం తగిలింది. అదీకాక మనస్సులో ఏమిటో విపరీతంగా మధనపడుతున్నారు. అందుచేత నేను వారిని వదిలిపెట్టి రాలేదు. లేకపోతే రోజూ పడుకొనేముందు తలుపులన్నీ ఒకసారి చూస్తాను కదా? నిన్నకూడా చూస్తే వేసి ఉందును. హుఁ. ఒక్క రోజైనా దినచర్యను విస్మరించ వీలులేదు కదా! అత్తగారూ, మామగారూ సరేసరి. వారి విచ్రంలో వారు ఉన్నారు. ఎవరు వచ్చారంటావ్?"
    త్రుటికాలం నివ్వెరపోయింది శాంతి. "అన్నయ్యకు సాధారణంగా జ్వరం రాదు. పద, చూద్దాం. ఈ గొడవకేంలే" అంటూ కలవరంతో లేచింది.
    "నువ్వు పద. నేను పళ్ళరసం తీసుకొస్తాను." మరో దిక్కుగా వెళ్ళిపోయింది, పద్మ.
    కిటికీ దగ్గర వాలు కుర్చీలో పడుకొని తోట లోకి పరధ్యానంగా చూస్తున్నాడు శ్రీహరి.
    "అన్నయ్యా!" చల్లగా సంబోధిస్తూ దగ్గరగా వెళ్ళి నుదుటిపై చెయ్యివేసి చూచింది శాంతి.
    నీరసంగా నవ్వాడు శ్రీహరి. "కంగారు లేదే. కొద్దిగా జ్వరమే రాదా, మానవమాత్రులయ్యాక? మీ వదిన అందర్నీ కంగారెత్తించేస్తోందా?"
    "నీ కెప్పుడూ జ్వరం రాదు" అంది దిగులుగా శాంతి.
    "ఏమిటి, శాంతీ, మరీ చంటిపిల్లవై పోతున్నావ్! కాస్త ఉష్ణోగ్రతకే అంతగా గాభరా అయితే ఎలా?" అంటూనే ఆమె ముఖం పరీక్షగా చూచి ఉలిక్కిపడ్డాడు. కళ్ళు లోతుకుపోయి, ముఖం మలినమై పది లంఖణాలు చేసినట్లుంది శాంతి ముఖం.
    "నువ్వలా ఉన్నావేమిటి? వంట్లో బాగుందా?" అని తిరిగి ప్రశ్న వేశాడు.
    నవ్వింది శాంతి. "ఏం, నాకేం?" అడిగిందే కాని ఆమె కేమిటో ఆమెకే తెలుసు. ఉదయం అద్దంలో తన ప్రతిబింబం తనకే నీరసంగా అవసన్నమై కన్పించింది.
    కుర్చీలో తిన్నగా లేచి కూర్చున్నాడు శ్రీహరి. "అలా కూర్చో" అన్నాడు చెల్లెలికి బల్ల చూపెడుతూ. శాంతి కూర్చుంది.
    "చూడమ్మా." మందస్థాయిలో అన్నాడు. "సమస్యలు మానవ జీవికి సహజం. వివేకంతో ఆలోచించి పరిష్కరించుకోవాలి కాని, దిగులుతో కృశించడం, కోపాలు తెచ్చుకోవడం చాలా అవివేకం, అనర్ధకరమూనమ్మా." చెల్లెలి వదనంలో భావవీచికలు చదవ యత్నించాడు.
    పట్టుబడిపోయినందుకు సిగ్గుతో ముఖం వాల్చింది శాంతి. చాలాసేపటికి అంది తలపైకెత్తి: "ఏదైనా జరిగినప్పుడు దాని ప్రభావం కొంత ఉండకపోతుందా, అన్నయ్యా, మరి? కాని నా కెవరిపైనా కోపం లేదు. రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టక కొద్దిగా నీరసంగా ఉంది."
    బరువుగా, తృప్తిగా ఊపిరి వదిలాడు శ్రీహరి. "సరే. నీకామాత్రం తెలిస్తే ఇక నాకు విచారం లేదు."
    పద్మ ప్రవేశించడంతో సంభాషణ ఆగిపోయింది.
    "ఏమిటి, పద్మా, పాపం శాంతిని గాభరా పెట్టేశావట?" అన్నాడు శ్రీహరి నవ్వుతూ.
    "బాగుంది. నేను చెప్పాలేమిటి? చెల్లెలిపై అన్నయ్య కెంత వాత్సల్యమో, అన్నయ్యపై చెల్లెలి కంత అభిమానం ఉండదేమిటి? మామతలు ఒకరు నేర్పితే వచ్చేవి కావు." ఆ భావ గర్భితమైన మాటలను అర్ధం చేసుకోవటానికి అన్నా చెళ్ళెళ్ళిద్దరికీ కొంత ఆలస్యమే అయ్యింది.
    పద్మ తెచ్చిన బత్తాయిరసం అందుకుంటూ శ్రీహరి, "నాన్నగారికీ, అమ్మకూ చెప్పకు" అన్నాడు.
    "తెలుసులెండి."
    "వాళ్ళేమంటున్నారు?"
    "మీ తమ్ముడూ, మరదలూనా?"
    "ఊ."
    "ప్రయాణ సన్నాహంలోనే ఉన్నారు."
    "శ్రీహరీ, మే ఐ కమిన్?" బయట రాజా గొంతు విన్పించింది.
    "రా రా. నీ కభ్యంతరమేమిటి?"
    "రండి" అంటూ పద్మ కూడా ఆహ్వానించింది.
    శాంతి ఒక్కసారి అతడి ముఖం చూచి లేచి మెల్లగా గదిలోనుంచి వెళ్ళిపోయింది.
    "ఏం రా, అలా ఉన్నావ్?"
    "కొంచెం వంట్లో బాగుండలేదురా."
    "ఆఫీసుకు సెలవింకా ఎన్నాళ్లుంది?"
    "ఓ వారం రోజులుందిలే. అయినా అంత పెద్ద జ్వర మేం కాదు."
    "ఊఁ. నాకివ్వాళ ఒకసారి స్కూటర్ కావాలి. రాజమండ్రి వెళ్తాను."
    "బాగుందిరా నీ అడగటం! ఏమన్నా క్రొత్తవాడివా? నన్నడగాలా ప్రత్యేకంగా? అయితే రాజమండ్రిలో పనేమిటి?"
    "ఏం కాదనుకో. రాజమండ్రిలో ఏదో ఒక ఆర్ట్ గ్యాలరీ ఉందని విన్నాను. ఒకసారి చూచి వద్దామని. రేపు సాయంత్రం నేను వెళ్ళిపోతాను మరి. ఇక నాలుగు రోజులే ఉంది సెలవు."    
    "ఊఁ." అనలేక అనలేక అన్నాడు శ్రీహరి.
    నవ్వాడు రాజా. "ఇంకా ఎన్నాళ్ళున్నా నువ్వు వెళ్ళమానవు. నాకు వెళ్ళాలనీ ఉండదు. అయితే మీ ప్రయాణమెప్పుడు?"
    "దేనికి?"
    "శాంతిని తీసుకువెళ్తావేమో మళ్ళీ? వచ్చినప్పుడు నన్ను కలుసుకుంటావ్ కదూ?"
    శ్రీహరి వదనం ఉదాసీనమైపోయింది. "ఏమో. ఇంకా అనుకోలేదు."
    "పోనీ అనారోగ్యంతో నువ్వు శ్రమపడటం దేనికీ? శాంతినికూడా రేపే ప్రయాణం కమ్మను."
    అలాగే ఉదాసీనతతో జవాబిచ్చాడు శ్రీహరి: "అవసరం లేదులే. తర్వాత్ నేనే తీసుకువెళ్తాను. తొందరేం?"
    రాజా మనస్సు దెబ్బతిన్నది. "సరే" అని లేచి వచ్చేశాడు. 'ఏమిటిది? శ్రీహరికి నాపై గౌరవం లేదా? మొన్న శాంతిని నాతో మాట్లాడవదని మందలిస్తున్నాడు. ఇవ్వాళ నాతో పంపడానికి సందేహిస్తున్నాడు. అందుకే కాబోలు, శాంతి నన్ను చూడగానే లేచి వెళ్ళిపోయింది. అవును అర్ధం చేసుకోలేకపోయాను. అందుకే అప్పుడు కలకత్తాలో నాకు చెప్పకుండా వెళ్ళి చెల్లెల్ని చూసుకొచ్చేవాడు. పైకిమాత్రం తీయగా ప్రవర్తిస్తాడు. ఎంతాశ్చర్యం! నిర్మల నిష్కపట స్నేహమాధుర్యం కడకింత నీచస్థితికి దిగజారిపోయిందా? ఎంత తెలివితక్కువ వాడిని! సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా ఈ అతిచనువులూ, శుష్కస్నేహాలూ కట్టిపెట్టి స్నేహంగానే విడిపోవడం ఉత్తమం' అనుకొంటూ మేడమెట్లు దిగుతున్నవాడల్లా సగం నుంచే తిరిగి పైకి వెళ్ళాడు, 'ఇవ్వాళ వెళ్ళిపోతాను' అని చెప్పటానికి. కాని గుమ్మం దగ్గరకు వెళ్ళగానే కాళ్ళు ఆగిపోయాయి. పద్మ కంఠస్వర, తీవ్రంగా విన్పిస్తూంది.
    "మనస్సు లెరుగకుండ మనుష్యుల్ని నొప్పించటం అసలు మీ నైజం అనుకుంటాను. ఈ గుణాలే మీ చెల్లెలికీ వచ్చాయి."
    రాజా కొంచెం వెనుకాడాడు. 'భార్యాభర్త లిద్దరూ ఏదో తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళటం సమంజసమా?'
    అంతలోనే పద్మ మాటలకు జవాబుగా కాబోలు శ్రీహరి కంఠం పలికింది: "మా మధ్య అటువంటివాటికి తావు లేదు. మా స్నేహం నీకింక పూర్తిగా అర్ధం కాలేదనుకుంటాను."
    "స్నేహ మున్నందుకు ఉచితానుచితాలు లేకుండా నొప్పించడమేనా? అతడు ఉపకార బుద్దితో ముందుకు వచ్చినదానికి నిష్కర్షగా మీరిచ్చిన జవాబుకు ఎంత చిన్నబుచ్చుకున్నాడో చూచారా మీరు?"
    "హూఁ. అయితే గ్రహించావన్నమాట! నేనూ చూచాను. అసలతడిలో ఆ మార్పు రావాలనే నేనలా మాట్లాడాను. బలంగా పేనుకుపోయిన ఈ స్నేహం ఎలా తెగత్రెంపులు చేసుకోవాదమా అని ఇంతకాలం ఆలోచిస్తూంటే ఇన్నాళ్ళకు రాజయ్ దానికి సందర్భం కలిగించాడు."
    "ఆ!" ప్రత్యక్ష శ్రోతతోబాటు పరోక్షంగా వింటూన్న రాజా కూడా స్థంభించిపోయాడు.
    తిరిగి శ్రీహరి కంఠం గంభీరంగా పలికింది: "చూడు, పద్మా. అలా మాట్లాడవలసి వచ్చినందుకు నేనెంత క్షోభిస్తున్నానో నీకు తెలియదు. కాని అంతకంటే మార్గం లేదు. కలకత్తా నుండి నువ్వు వచ్చేశాక నాలుగు నెలలు కలిసి ఉన్నాం మేమిద్దరమూ. అతడు మానసికంగా ఎంత కృంగిపోయాడో, ఎంత నిరాశ జెందాడో నాకు తెలిసినట్టు నీకు తెలియదు. అతడి సరదాలన్నీ పోయాయి. అతడి చిత్ర లేఖనం మూలబడింది. అతడి చలాకీతనమంత నశించిపోయింది. ఇందుకు మూలకారణం నేను. నామీద అయిష్టం కలిగి, నా స్నేహం తెగిపోతే కాని అతడు మామూలు మనిషి కాడు. అందుకే అతడికి విరక్తి పుట్టించేటట్టు మాట్లాడాను. భగవంతుడనుకూలించాలి." కంఠం గాద్గదిక తతో తడబడటం స్పష్టంగా విన్పించింది.
    వింటూన్న రాజా చలించిపోయాడు. కండ్లనుండి ధారాపాతంగా అశ్రువులు వర్షించసాగి గుండెలు తఃదిసిపోయాయి. 'శ్రీహరీ! స్నేహ మంటే మనదే స్నేహమయ్యా. లోకనంద్యమైన ఇటువంటి స్నేహబాంధవ్యంతోనే మనం జన్మ జన్మలకూ అవతరించాలి.' గబగబా మేడదిగి ఆవరణలోనున్న స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS