Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 32


                                     14
    ఆలోచనలకు అడ్డులు వేసింది శ్రీనివాస్ పలవరింపులు. చప్పున లేచి అతని మంచం దగ్గరకు వెళ్ళాడు. అతను తెలివి  తోనే కళ్ళు మూసుకుని అంటున్నాడు. 'బహుశ యీ రూపుతో యీ మేధస్సు తో వుండవలసిన పని లేదేమో? నా చుట్టూ ప్రక్కలు యింకో దగ్గర వున్నాయ్. నేనింకో విధంగా తలుస్తుండాలి. ఒకరి యిష్టా యిష్టాల ప్రకారం జీవితం నడవదు. ఒకరి కోరికలన్నీ తీరిపోతే అది జీవితమే కాదు. తీపిరి తిని, చేదును విడచి పెట్టె తత్త్వం మనుషులది. చివరకు చెదు లాంటి చావును మింగవలసి వస్తుంది. ఎందుకు? కడుపులో యిన్నాళ్ళూ బ్రతికి సృష్టించుకున్న  పురుగులను చంపడానికి ఆ పురుగులు చావగానే మనిషి మరో జన్మ ఎత్తుతాడు. క్రొత్త రూపు, ఆలోచనలు, జీవితం వతుంది. ఆకారాలు మరుతాయ్ గానీ ఆత్మ మారదు. అందుకే నాకు చావంటే భయం లేదు -- చావంటే భయం ముమ్మాటికి లేదు..లేదు..లేదు...లేదు....లేదు.'
    'శ్రీనివాస్...శ్రీనివాస్....'
    'లేదు...లేదు...లేదు....'
    'శ్రీనివాస్ తెలివి తెచ్చుకో...'
    'బంధించు కుని వున్న పురుగులు చచ్చి పోతున్నాయ్-బంధాలు విడిపోతున్నాయ్-- వస్తాను....నా ప్రియ మిత్రుడా..వస్తాను....నా నుదుటి మీద చెయ్యి వెయ్యి....వస్తాను.... జన్మజన్మాలమిత్రుడా వస్తాను...'
    సూర్యం అతని నుదుటి మీద చెయ్యి వేసాడు. సూర్యం కన్నీటి బొట్లు అతని పై వ్రాలాయి. శ్రీనివాస్ చైతన్యం తప్పి పోయాడు. కొన్ని నిమిషాల్లోనే ఒళ్ళు చల్లబడి పోయింది. మిగిలింది కట్టే-- ఆ కట్టే ఆరోజునే బుగ్గయి పోయింది. ఆ బుగ్గి పారుతున్న యేటిలో కలిసింది. నీరు ఆ బుగ్గిని పొలాల్లో చేర్చింది. పొలాలు ఆ బుగ్గిలో సారం తో పంటలు పండిస్తాయ్ ఆ ధాన్యంతో అతనూ, ఆమె కడుపు నింపుకుంటారు. శ్రీనివాస్ భౌతికంగా పోయినా మానసికంగా ఆధ్యాత్మికంగా బ్రతికే వున్నాడు. అతని తలపు సూర్యానికి లేని ధైర్యాన్ని తెచ్చి పెట్తోంది. అతని పలకులు తల్చుకుని జీవితానికి ఏదో ధ్యేయం వుందని అది కొనసాగించటం లోనే మనిషి జన్మ తరిస్తుందని సూర్యం లో పట్టుదలను సృష్టించింది. శ్రీనివాస్ చచ్చినా బ్రతికే వున్నాడు.

                               *    *    *    *
    గోవిందరావు అంత్య క్రియలు తను జరుపలేకపోయినా శ్రీనివాస్ అంత్యక్రియలు తను జరపగలిగినందుకు సూర్యం తృప్తి పడ్డాడు. ఇలా తను జరుపగలిగాడంటే ఆ ధైర్యాన్ని ప్రసాదించింది శ్రీనివాసే అనిపించింది. భయంకరమైన చావును తన పెదాలపై నవ్వుతూ ఆహ్వానించి అనుభవించాడంటే దానికి కారణాలను అన్వేషించసాగాడు. చావే కాదు జీవితంలో వచ్చే యే యిక్కట్లలూ, కష్టాలూ , అడ్డంకు లూ ఎదుర్కొడానికి ఒక వేదాంతం అవసరమేమోననిపించింది. అది యెప్పుడూ అలవడుతుంది? మనిషి తన మనసును కాక ఆత్మను తృప్తి పరచగలిగినప్పుడు వస్తుందేమో?బాహ్యంగా నున్న వ్యక్తిత్వం కోరికలతో నిల్చుంటుంది. అంతర్గతమైనది కోరికలు తగ్గించు కోవటం వలన ప్రకాశిస్తుంది. సూర్యం కు యింతవరకు యే విషయం లో నైనా, అది పై వాళ్ళ విషయం లో నైనా తనూ, తన హోదా , తన మాట, తన కీర్తి తన గర్వం, తన అహం , తన బాగు అంతా తన తలపుకు సంబంధ మై వుండేది. తన మనసుకు రూపం తను, తన ఆత్మకు స్వరూపాలు లెక్కించరానన్ని. ఆత్మను తెలుసుకోవాలంటే తన చుట్టు పట్టల నున్న స్వరూపాలన్నిటినీ తన మనసులో యిముడ్చుకోవాలి. అప్పుడు యెదుటి వారిపై తన విషయమై వుండే తలపులుంటాయ్. తను వ్యక్తిగా ముఖ్యం కాదు. తన ఆత్మ ముఖ్యం. అలాంటి మనిషి తను కష్టపడుతున్నట్లు గానీ, అనారోగ్యం గా వున్నట్లు గానీ చచ్చి పోతున్నాననే బెంగతో గానీ ఉండడు. ఆత్మను దర్శించగలిగిన వాడే అసలైన ఆనందాన్ని అనుభవించగలడు. చీకటి మన సుకు చంచలత్వం పోయి ఆత్మ వెలుగు వలన బలం కలిగి స్థిమిత మేర్పడుతుంది.

 

                        
    శ్రీనివాస్ తలపు సూర్యం కు తన కర్తవ్యాన్ని తెలుసుకోవటమే కాక ఆచరణ లో పెట్టె మనో నిబ్బరాన్ని తెచ్చింది. హైందవ ధర్మం ప్రకారం చెయ్యవలసిన తంతులన్నీ చేసాడు. విశాలకు రెండు బంగారు గాజులు చేయించి టేబిలు మీద పెట్టేటప్పుడు మనసు కష్ట పడింది. ఆమె నుదుట కుంకుమ రేఖ లేకుండా చూడటానికి బాధపడ్డాడు. మూడు తెల్ల చీరలు కొన్నాడు. ఇవన్నీ మౌనంగా నే చేస్తున్నాడు. ఇవన్నీ జరిపించకూడదని తనకు తట్టలేదు. ధర్మం శాశించింది. జరిగి తీరాలనే చేశాడు. ఆ యింట్లో వుంటే యింకా మనసు విచారం నుండి బయట పడదని యిల్లు మార్చేసాడు. కాలేజీ కి దగ్గరగా ఒక యిల్లు తీసుకున్నాడు. రామం ఒక్కడే మొగ దిక్కు. వాడికి ఆమె దిక్కు. అక్కా తమ్ముళ్ళు గా వాళ్ళిద్దరి లో అన్యోన్యం ఏర్పడింది. వాడికి ఆమె చదువు చెప్పాలని నియోగించాడు. ఆమె కాలేజీ లో చేరడానికి యింకా టైముంది. ఈలోగా తను ప్రస్తావన తేవటమెందుకని వూరుకున్నాడు. తను వూరికి యెనిమిది మైళ్ళ దూరంలో వున్నాడు కాబట్టి రోజూ వీరి పరిస్థితి ని చూసే అవకాశం లేదు. వారానికి ఒకటి రెండి సార్లు వచ్చి చూసి పోతున్నాడు. ఆమె తన ఎదరగా ఒక మాట యిప్పటికీ ఆడలేదు. ఆమె మౌనం యెన్నెన్నో ప్రశ్నల వర్షాన్ని అతనిపై కురిపిస్తోంది. ఆమె దీనమైన చూపులు దిక్కులు చీల్చేటట్లు దూసే బాణాల్లా వున్నాయ్. ఆమె యీ స్థితికి కారకుడు తనే నన్న తలపు రాగానే సూర్యం మనసు కల్లోలం కాసాగింది. మళ్ళీ తను అనుకున్న వేదాంతాన్ని మనసులో చొప్పించుకుని, బాధను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
    మూగ బాసలతో యిద్దరూ బ్రతుకుతున్నారు. అణగిన మోహం అప్పుడప్పుడూ అగ్నిపర్వతం లా బ్రద్దలై పోగలను గ్రక్కుతోంది. యౌవ్వనం అగ్నిపర్వతం లాంటిది . ఎల్లప్పుడూ అణిగి వుండలేదు. రానురాను ఆమె ముఖంలో ఒక విధమైన హుందా ఏర్పడింది. తెల్ల చీర కట్టినా, చేతిలో రెండే రెండు బంగారు గాజులున్నా సొగసు విసుగు జెందకుండా వెంట వెంట పడుతోంది. ఒకనాటి ఉదయం సొగసామేను కౌగలించు కుంది. చుక్కచుక్కలున్న వాయిలు చీర-- ఆమెను వరించింది. సూర్యం ఆమెను ఆ పరిస్థితిలో చూసి సంతోషంతో పాటు చిరాకు పడ్డాడు. తన బలవంతం మీదే ఆమె కాలేజీ లో చేరింది. తోలి రోజుకు మలి రోజుకు యింత తేడా రాగానే తను తట్టుకోలేక పోయాడు. అడగనూ లేక పోయాడు. ఆమె జోడు కావాలంది. ఆమెనే వెళ్లి కొనుక్కో మన్నాడు. కాస్త ఎత్తు మడమలున్న జోడుతో తిరిగి వచ్చింది.
    ఆరునెలల్లో నే యీ మార్పు రాగానే సూర్యం ఆశ్చర్య పోయాడు. ఐదేళ్ళు దాటినా గౌరీ యింకా ఆ దెబ్బను తట్టుకోలేక పోతోంది. ఆమె యింటి నించి ఎక్కడకూ వెళ్లి యెరగదు. వంట యిల్లే ఆమెకు స్వర్గం లా వుంది. ఆమె మఖం చూడ్డానికే జాలి పుట్టుంది. ఒకోసారి ఆమెను చూడగానే కన్నీరు కంట్లో కదుల్తుంది. కానీ యీమె ఆచారాలకు సాంప్రదాయాలకు యిట్టే స్వస్తి చెప్పింది. సంఘానికి యెదురు తిరిగింది. ఆమె చూడ్డానికి మనోహరంగా వున్నా సూర్యం మనసులో యెందుకో ఆమె మీద ఒక విధమైన ఏవగింపు చొచ్చుకుంది. బహుశా అది తను విశాలకు, గౌరీ కి పోలికలు వెతుక్కోవటం వల్ల వచ్చిందేమో? లేక తనలోనో లోభం కారణమేమో? యిన్నాళ్ళూ దాగున్న అందం మళ్ళీ ఆమె దరి చేరింది. తోలి రోజుల్లో తను చూసిన విశాలలా మళ్ళీ అతని కంటికి ఆమె అగపడింది. ఆనాటి అమాయకం ఆనాటి ఒకరి పై ఆధారపడే తత్త్వం యింకా వుందో లేదో?
    ఒకనాడు సాయంత్రం తను వచ్చేసరికి విశాల బాగా తయారయి వుంది.
    'వచ్చారా?' అంది.
    ఎన్నాళ్ళ కు ఆమె నోటి వెంబటి మనసార  పలకరింపు విన్నాడు. ఏదో వీణ మీటింనట్లు అయింది. కాస్సేపయ్యాక 'మీరూ రాకూడదా?'
    'ఎక్కడికి?'
    'సినిమాకు.'
    సూర్యం జవాబు చెప్పలేదు. ఇష్టం లేనట్లు ముఖం దించేసాడు. ఆమె కూడా మళ్లీ అడగలేదు.
    'వస్తాను.' అంటూ వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే వెళ్ళాడు. ఒంటిగానే వెళ్తోంది. ఇంకెవ్వరూ తోడూ లేరు. సినిమా వదిలేవరకూ హాలు దగ్గరనే వున్న ఒక పార్కు లో కూర్చున్నాడు. ఎన్నెన్నో ఆలోచించు కున్నాడు. ఎన్నో విధాల బాధపడ్డాడు. ఆలోచించిందే మళ్ళీ ఆలోచించుకున్నాడు. ముందుకేం జరుగుతుందో వూహించిందే మళ్ళీ వూహించుకున్నాడు. తన మిత్రుని చివరి కోరిక జ్ఞప్తి కి వచ్చింది. ఆమెను డాక్టరు చెయ్యాలేనెమో నన్న అనుమానం తనలో పొడసూపింది. ఆమె చదువు యందు అంత శ్రద్ధ చూపుతున్నట్టు కనపడదు. సినిమా విడిచి పెట్టేసారు. కాస్త దూరంగా వుండి ఆమె బాల్కనీ మెట్లు దిగుతుండగా చూసాడు. ఆమె వేపు మ్రింగి వేసినట్లు యెందరో చూస్తున్నారు. ఆమె లావణ్యంతో మెరసి పోతోంది. దివి నుంచి భువికి దిగే అప్సరస లా దిగింది. యౌవ్వనం పూల మాలలు వేసుకుని పరిమళిస్తోంది. వలపు తేజస్సు ఒళ్ళంతా ప్రకాశిస్తూ వయ్యారం వెంట తరుముతోంది. వసంతం మళ్లీ విశాలను చిగిర్చింది. వికశించే పూలు కాయలు కాడానికి తుమ్మెద పూల చుట్టూ తిరగాలి. ఆమె అడ్డు గోడలతో కట్టిన యింట్లో వున్న పూల చెట్టులా నుంది. ఆమె ఉద్యానవనంలో గాలిలో విచ్చల విడిగా కదిలే పూల తీగ కాదు.
    ఎంతదూరంగా వుండాలని సూర్యం ప్రయత్నిస్తున్నాడో అంత దగ్గరౌతున్నాడు. ఆమె గూర్చి తలుచు కోకూడదని అనుకున్నా రోజూ తల్చుకుంటూనే వున్నాడు. ఆమె యేడాది గడిచే సరికి నిత్యం నూతనంగా అగపడే గులాబిలా వుంది. అది కాగితపు పూవు అనుకోవటం తనకు యిష్టం లేదు. గులాబి ని తాకటం వలెనే అది చరితార్ధం అవుతుంది. ఈ మార్పు సూర్యం కు ఒకోసారి వచ్చినట్లుండేది. యింకోసారి యీమె ఆచారాలను అతిక్రమించిందన్న ఆక్రోశం కూడా కలిగేదే. ఒకనాటి సాయంత్రం వచ్చేసరికి విశాల ఒక్కర్తే యింట్లో ఉంది. ఏదో ఒక పుస్తకం చదువుతోంది. అతనిని చూడగానే పుస్తకాన్ని టేబిలు మీద పెట్టింది. ఒకసారి పుస్తకం వేపు చూసాడు.
    'క్లాసు పుస్తకాలు చదువుతున్నా వనుకున్నాను.'
    'ఏంటో-- ఇంకా చదువుకునే పిల్ల అనుకోడానికి మనస్కరించటం లేదు.'
    'చదవక పొతే యెలా?'
    'ముందుకు పోయేదాన్ని వెనకకు లాగుతున్నారు ఎలా పాసవుతానో యెంటో?'
    'పాసయి తీరాలి. ఈ నవలలు చదవే బదులు...'
    'తల కేక్కనిది యెంత కని చదవ మంటారు?'
    'ఎక్కించు కోవాలి. ఫస్టు క్లాసు లో ప్యాసయితే గాని డాక్టరు అయ్యే అవకాశం వుండదు.'
    'డాక్టరా?'
    'శ్రీనివాస్ కోర్కె తీర్చే బాధ్యత నామీద వుంది.'
    'వెళ్ళిపోతూ కోర్కెలను కూడా విడిచి పెట్టారా?'
    'డాక్టరై అనాధుల కు సేవ చేస్తే వాళ్ళ దీవెనలు ముందు జన్మలకు పనికి వస్తాయ్.'
    ఆమె ఒకసారి అతని వేపు యీ మాటలు నచ్చనట్టుగా చూసింది. ముఖం త్రిప్పి .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS