Read more!

పరిపూర్ణమైన మానవుడు – వామనుడు

 

 

పరిపూర్ణమైన మానవుడు – వామనుడు

 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత !

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ !!

అన్నది భగవానుని ఉవాచ. ‘ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం ప్రజ్వరిల్లుతుందో అప్పడు ఆత్మ అయిన నన్ను నేను సృజించుకుంటాను’ అన్నది దీని భావం. ఇక్కడ భగవంతుడు తనను తాను స్వయంగా ఆత్మస్వరూపునిగా పేర్కొంటున్నారు. మనిషి కూడా తాను ఆత్మస్వరూపుడే అని ఎప్పుడు తెలుసుకోగలడు? తాను జగత్తులోని చరం, అచరం రెండింటినీ జయించడమే కాదు. ఆ రెండింటినీ దర్శిస్తున్న ఆత్మని కూడా అనుభూతి చెంది, తనలోనికి తాను మునిగిపోయినప్పుడే! ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిగూఢంగా చెప్పే కథే వామనుడి కథ.

అనగనగా మహాబలి అనే రాక్షస రాజు ఉండేవాడు. ఆయన ఎవరో కాదు. సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుని మనవడే ఈ మహాబలి! బలి రాక్షస జాతివాడు అయినప్పటికీ, ప్రహ్లాదుని నుంచి వారసత్వంగా ధర్మదీక్ష, దానశీలత, దయాగుణాలు అబ్బాయి. దాంతో తన రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా కాచుకునేవాడు. ఇప్పటి కేరళ ప్రాంతమే మహాబలి పాలించిన రాజ్యమనీ, అతను పాలించి కాలం తమకి బంగారు యుగమనీ ఇప్పటికీ కేరళ ప్రజలు విశ్వసిస్తారు.

అంతా సవ్యంగా సాగిపోతే దానిని కాలం అని ఎలా అంటాం. కాలం కదులుతూ ఉంటుంది. దాంతో పాటు మనుషుల మనసులో ఏదో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. అనాదిగా రాక్షసులకీ, దేవతలకీ తగని వైరం కదా! తనకి శత్రువులైన దేవతలని ఓడించడంతో పాటు, ఈ ముల్లోకాలనూ జయించాలన్ని కోరిక బలిలో కలిగింది. తనది కానిదానికి సొంతం చేసుకోవాలనుకున్నప్పుడే అతనిలోని రాక్షస గుణం బయటపడింది. రాక్షసుల గురువైన శుక్రాచార్యుని సారధ్యంలో ఏకంగా స్వర్గంగా మీదే దాడి చేసి, ఇంద్రుని చిత్తుగా ఓడించాడు బలి.

 

బలి చక్రవర్తి నుంచి తమ రాజ్యాన్ని విడిపించమని దేవతలంతా విష్ణుమూర్తిని శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తానే స్వయంగా దేవతలందరికీ మాతృమూర్తి అయిన అదితి గర్భంలో జన్మించి బలిచక్రవర్తిని సంహరిస్తానని మాట ఇచ్చాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే అనతికాలంలో అదితి గర్భాన జన్మించాడు. ఒకనాడు బలిచక్రవర్తి ముల్లోకాల మీదా తనకి ఉన్న ఆధిపత్యాన్ని స్థిరం చేసుకునేందుకు అశ్వమేధయాగాన్ని చేపట్టాడు. బలిని అంతమొందించేందుకు అదే తగిన అదనుగా భావిస్తాడు వామనుడు. ఒక బాలబ్రహ్మచారి రూపంలో ఆ యజ్ఞవాటిక దగ్గరకి చేరుకుంటాడు.

జ్ఞానానికి ఆలవాలంగా ఉన్న రూపంతో ఉన్న వామనుడిని చూడగానే బలి చక్రవర్తి మనసు కరిగిపోయింది. యాగ సందర్భంలో దానంగా ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి బదులుగా మూడే మూడు అడుగుల స్థలం కావాలంటాడు వామనుడు. ఆ తరువాత జరిగిన కథ అందరికీ తెలిసిందే. వామనుడి మొదటి అడుగు కింద ఈ భూభాగమంతా సరిపోయింది. రెండో అడుగు విశ్వాన్ని కప్పివేసింది. ఇక మూడో అడుగు కోసం వామనుడి ముందు నిస్సహాయునిగా వంచిన తన శిరసుని అర్పించాడు బలి.

మహాబలి అన్న పేరులోనే గొప్ప శక్తిశాలి అన్న అర్థం ఉంది. మరి వామనుడు అన్న మాట బలహీనుడు, చిన్నవాడు అన్న అర్థాన్ని స్ఫురిస్తుంది. కానీ మనిషి ఎంత బలవంతుడైనా, సకలగుణ సంపన్నుడైనా అతనిలో కనుక రాక్షస గుణం ప్రజ్వరిల్లితే వినాశనం తప్పదు అని బలి సూచిస్తున్నాడు. ఇక జ్ఞానానికి హద్దులు ఉండవనీ, దానిని కలిగినవాడు వామన రూపంలో ఉన్నప్పటికీ, అతనిలోని జ్ఞానం ఈ విశ్వాన్నే జయించగలదనీ వామనుడు చెప్పకనే చెబుతున్నాడు. విష్ణుమూర్తి అవతారాలలో తొలి మానవ అవతారం జ్ఞానస్వరూపమైన వామనుడే. ఇక వామనుడు సాధించిన మూడు అడుగులలోనూ పరమార్థం కూడా లేకపోలేదు. మొదటి అడుగు చరమైన భూమిని జయించింది. రెండో అడుగు అచరమైన ఆకాశాన్ని జయించింది. మూడో అడుగు ‘తాను’ అనే అహంకారానికి చిహ్నమైన బలిని జయించింది. ఆ అహంకారాన్ని సమూలంగా తొక్కివేసింది మూడో అడుగు.

వామన జయంతి రోజున విష్ణుమూర్తిని ఆరాధించి, ఆయన లీలావిలాస రూపాలలో ఒకటైన వామనుని గురించి తలచుకునేవారికి సకల సంపదలూ, అంతకు మించిన జ్ఞానసిద్ధి లభిస్తుందని చెబుతారు.

- నిర్జర.