Read more!

పరశురాముడు రాముడిని అడ్డగించిన కారణం!!

 

పరశురాముడు రాముడిని అడ్డగించిన కారణం!!


పరశురాముడు ఎంతో శక్తివంతమైనవాడు. రాముడు శివదనస్సును ఎక్కు పెట్టాడని, జనక మహారాజు కూతురు సీతను పెళ్లి చేసుకున్నాడని తెలియగానే స్వతహాగా కోపిష్టి అయిన పరశురాముడు అదే కోపాన్ని మరింత పెంచుకుంటూ ఆ రాముడి పని పడతాను అనుకుని బయలుదేరాడు. సీతారాముల కల్యాణం అయిపోయిన తరువాత దశరథ మహారాజు కొడుకులను, కోడళ్లను తీసుకుని  అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది. మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావు అన్నారు.

ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను, శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను. రామా, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని వారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి, "మహానుభావ! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు" అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు. 

అప్పుడు రాముడు ఇలా అన్నాడు "పరశురామ! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుండి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను" అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. 'నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టెస్తాను" అన్నాడు.

అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు "రామ! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానము చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది. కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, కశ్యపుడికి దానం ఇచ్చి అతడి చేతనే ఈ భూమి మీద రాత్రి పూట ఉండే అర్హతను కోల్పోయాను. కాబట్టి నువ్వు నా ప్రయాణ శక్తిని బాణంతో  తగ్గించడం ఎంతవరకు సమంజసం??" అన్నాడు.  అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు(తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు. వెంటనే పరశురాముడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, "నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకములో నా అవసరంలేదు" అని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.

ఇలా పరశురాముడు రామాయణంలో రాముడిని అడ్డుకున్నాడు.

◆ వెంకటేష్ పువ్వాడ.