న్యాయబద్ధమైన మనిషిలో ఉండాల్సిన గుణం!!
న్యాయబద్ధమైన మనిషిలో ఉండాల్సిన గుణం!!
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యేతిష్ఠన్తి రాజసా। జఘన్యగుణవృత్తిస్థా అధోగచ్ఛన్తి తామసాః॥
మనుషుల్లో సత్త్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మనుషుల్లో ఒకటి ఎక్కువ మిగిలినవి తక్కువగా కూడా ఉంటాయి. ఆ ప్రధానమైన అంటే ఎక్కువగా ఉన్న గుణం ఆధారంగా ఆ మూడుగుణముల వారు మరణించిన తరువాత ఏయే లోకములకు పోతారు అని వివరించాడు పరమాత్మ. సత్వగుణ ప్రధానులు ఊర్ధ్వలోకములకు వెళుతారు. రజోగుణము కలవారు మధ్యలో ఉన్న మానవలోకంలో ఉంటారు. తామస గుణము కలవారు అధోలోకములకు వెళతారు.
మనకు పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఉన్నాయి అని చెబుతారు. భూలోకము మనది. భువర్లోకము. సువర్లోకము, మహర్లోకము, జన లోకము, తపోలోకము, సత్యలోకము. మొదటి మూడు లోకములనుండి ఆపై మూడు లోకములకు మహర్లోకము ద్వారము వంటిది. సత్వగుణ ప్రధానులు మరణానంతరము ఈ లోకములకు వెళతారు. రజోగుణ ప్రధానులు స్వర్గందాకా వెళతారు. యజ్ఞయాగములు, తపస్సు చేసి స్వర్గలోక సుఖాలు పొంది మరలా మానవులుగా పుడతారు. తమోగుణ ప్రధానులు అధోలోకములకు వెళతారు. అధోగతి అంటే వారి వారి ప్రవృత్తులకు తగ్గట్టు పశు, పక్ష్యాదులుగానూ, లేక దుఃఖభరితమైన జీవనంతో కూడిన మానవులుగానూ జన్మిస్తారు.
కేవలం మనుషులకే అన్వయించుకుంటే, ఊర్ధ్వం గచ్చని అంటే సత్వగుణ సంపన్నుడు జీవితంలో పైపైకి ఎదుగుతాడు. జ్ఞాని అవుతాడు. అందరిచేతా గౌరవింపబడతాడు. పదిమంది చేత మన్ననలు పొందుతాడు. రెండవ వాడు మధ్యేతిష్ఠన్తి అంటే రజోగుణము కలవాడు అటు జ్ఞాని కాలేడు ఇటు పతనం పొందలేడు మధ్యస్తంగా ఉంటాడు. అన్నీ ఉంటాయి. ఏమీ లేని వాడి మాదిరి ఎల్లప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాడు. దాని కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. జీవితంలో శాంతిసుఖం ఉండవు. ఇంక మూడవవాడు జఘన్యగుణవృత్తిస్థా అంటేవాడి గుణాలు అన్నీ నీచమైనవే. విషయవాంఛలతో కూడినవే. ధర్మబద్ధంగా ఏ పనీ చేయడు. అప్పనంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఐపోవాలను కుంటాడు. దాని కోసం చేయరాని పనులు చేస్తాడు. అధోగచ్చని అంటే అధోగతి పాలవుతాడు.
చాలా మంది అంటుంటారు. దేవుడి దృష్టిలో మనుషులందరూ సమానమే కదా. మరి ఈ ధనిక పేద తేడాలేమిటి. కష్టసుఖాలు ఎందుకు కలుగుతాయి అని.
చిన్న ఉదాహరణ:- నగరాలలో, పట్టణాలలో పల్లెలలో మనుషులు నివసిస్తున్నారు. కొంత మంది ధనవంతులు కూడా అక్రమమార్గాలు అవలంబించి జైళ్లలో మగ్గుతున్నారు. మరి కొందరు నేరాలు చేసి జైళ్లలో మగ్గుతుంటారు. ఇంకా కొందరు తాము చేయని నేరాలకు జైలుపాలవుతుంటారు. అలాగే 70 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవాళ్లు ఉన్నారు. మరి కొంతమంది 40 ఏళ్ల నుండి మందుల మీద బతికే వాళ్లు ఉన్నారు. అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ల మాదిరి నిరంతరం దుఃఖపడే వాళ్లు ఉన్నారు. ఉన్నదానిలో తృప్తిగా సంతోషంగా జీవించే వాళ్లు ఉన్నారు. దీనికి ఆధ్యాత్మికంగా ఒకటే సమాధానం. ఇదంతా వారు వారు చేసుకున్న పూర్వజన్మల పాప పుణ్యాల ఫలితం. ఈ జన్మలో చేసిన తప్పులకు మరుజన్మలో శిక్ష అనుభవించాలి. దీనికి దేవుడు ఏమీ చేయలేడు. ఉరికే దేవుడికి అందరూ సమానమైనప్పుడు ఒకరికి కష్టాలు, మరొకరికి సంతోషాలు, కొందరికి ఐశ్వర్యం, మరికొందరికి బీదరికం ఇస్తాడు ఎందుకు అని మిడిమిడి జ్ఞానం ఉన్నవారు దేవుడిని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ ఉంటారు. మనకు మరు జన్మ మంచిది కావాలంటే ఇప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అక్రమాలు పాపాలు చేయకుండా ఉండాలి. ఇతరులను మానసికంగా కానీ, శారీరకంగా కానీ హింసించకూడదు. ఉన్నదానిలో తృప్తిగా జీవించాలి. అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి.
◆ వెంకటేష్ పువ్వాడ