Read more!

కైకేయ మహారాజుకు తెలిసిన రహస్య విద్య!!

 

కైకేయ మహారాజుకు తెలిసిన రహస్య విద్య!!


వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైన రాముడితో దశరథుడు "రామా!! నువ్వు కనీసం ఈ ఒక్కరోజు అయినా ఇక్కడే ఉండు. ఎన్నో సంతోషాలు అనుభవించు" అని అడిగాడు.

అప్పుడు రాముడు "ఇవ్వాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు. కాని 14 సంవత్సరములు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు. 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు, మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేనేమి ఆక్రోశంతో వెళ్ళడంలేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో, ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి, ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వలన ఇబ్బంది పడకూడదు" అన్నాడు. 

ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అసహ్యంగా చూసి, చూడు నీ వలన నాకు ఈనాడు ఎటువంటి పరిస్తితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కాని కైకేయ మాత్రం, నువ్వు వాళ్ళని ఇక్కడినుండి తొందరగా పంపించెయ్యి అన్నట్టు సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో "ఛీ, దుష్టురాల! మహాపాపి! పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు దశరథ మహారాజు, సముద్రము ఏ విధంగా క్షోభింప పడదో అటువంటి గాంభీర్యము కలవాడు దశరథ మహారాజు, అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు. నిన్ను బతిమాలుతున్నాడు, ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. 

నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది, అది ఎమిటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది. నీ తల్లిగురించి మాకు తెలుసు. నీ తండ్రిగారికి సర్వప్రాణుల (అన్ని ప్రాణుల) మనస్సులలోని విషయాలని, వాటి భాషనీ అర్ధం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు అంటే మీ నాన్నగారు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా, ఆ మంచం పక్కన నుండి ఒక చీమ వెళ్ళిపోయింది. దాని పేరు జ్రుంభ, ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్ధం అవుతుంది కనుక, ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు ఫక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి, 

"ఎందుకు నవ్వావు" అని కైకేయ రాజుని అడిగింది. 

"ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది. అందుకే నవ్వాను" అన్నాడు. 

"కాదు ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది. అందుకే నువ్వు నవ్వావు, అసలు ఆ చీమ ఏమందో చెప్పు" అని పలికింది. 

"నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు, దానిప్రకారం నేను నాకు అర్ధమైన విషయాలని బయటకు చెపితే, నా తల వెయ్యి ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను" అన్నాడు. 

అప్పుడావిడ, "నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి, నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే" అని పలికింది. 

అప్పుడా కైకేయ రాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. "నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా" అని అడిగాడు. 

"నీ తల వెయ్యి ముక్కలు అవుతుందన్నా విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. ఆమె మళ్ళి పట్టుబడితే నువ్వు ఆమెని వదిలెయ్యి" అన్నాడు. అంత మంకుపట్టు పట్టిన స్త్రీ, నీ తల్లి. అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది" అని అన్నాడు.

                                ◆వెంకటేష్ పువ్వాడ.