Read more!

కృష్ణా తీరాన పుణ్య క్షేత్రాలు - 7

 

 

 

కృష్ణా పుష్కరాల సందర్బంగా....కృష్ణా తీరాన పుణ్య క్షేత్రాలు - 7

వాడపల్లి
                                                                                     
 

 

తెలంగాణా రాష్ట్రంలో, నల్గొండ జిల్లా, వాడపల్లిలో కృష్ణా, ముచికుందా నదుల సంగమం వున్నది.  నదీ స్నానం, అందులోనూ పుష్కరాల సమయంలో పుణ్యమంటారుకదా.  రెండు నదులు కలిసే ప్రదేశాన్నికానీ, నది సముద్రంలో కలిసే ప్రదేశాన్నిగానీ సంగమం అంటారు.  ఇలాంటి సంగమాల్లో స్నానం చేస్తే ఇంకా ఫలితమెక్కువ అంటారు. ఈ సంగమ ప్రదేశంలో హరిహరులకు బేధంలేదని నిరూపిస్తూ  శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువుతీరి వున్నారు .

 

ఇందులో శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ముచికుందా నదీ, కృష్ణా నదుల సంగమ ప్రదేశం.  భక్తులకు ఇంకేమి కావాలి.  సంగమంలో స్నానం చేసివచ్చి స్వామిని దర్శించవచ్చు.  ఈ ప్రదేశానికి వెళ్ళే దోవలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.  వివరాలలోకెళ్తే....

 

 

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి

దక్షిణ ముఖంగా వున్న ఈ ఆలయం చిన్నదయినా స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా  ప్రఖ్యాతి చెందారు.   స్వామి తొడ మీద అమ్మవారు కూర్చుని వున్నట్లు వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో  ఒక  దీపం,  కింద ఇంకో   దీపం వుంటాయి.  కిందవున్న  దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది.  పైన స్వామి ముఖానికి ఎదురుగా వున్న దీపం  చిరుగాలికి రెప రెపలాడుతున్నట్లుంటుంది.    ఆ కదలికకి కారణం స్వామి వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు. ఈ ఆలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు.   దుష్టగ్రహ నివారణకోసం అలా చేస్తారుట. ఈ ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.

 

 

మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:

ఈ ఆలయం తూర్పు దిక్కుగా, సంగమాభిముఖంగా వుంటుంది.   గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది.   వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది.  ఈ లింగము మీద ఒక చిన్న గుంటలో ఎల్లప్పుడూ నీరు వూరుతూవుంటుంది.  నీటిమట్టానికి అంత ఎత్తునవున్న లింగం పైనుంచి ఎంత తోడినా నీరు ఎలా వస్తోందో, ఎంత లోతులోవున్నదో ఎవరికీ తెలియదు.  దానికి సంబంధించిన ఒక కధమాత్రం ప్రచారంలో వున్నది.

 

 

క్షేత్ర పురాణం

ఒక రోజు ఒక బోయవాడు పక్షి ని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాడుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాడుట. ఆ వేళ్ళ గుర్తులు శివ లింగం పైన ఇప్పటికీ కనబడుతాయి.  స్వామి శిరస్సున ఏర్పడ్డ గాయం కడగటానికి గంగమ్మ వచ్చిందిట.  బోయ కండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ  నీళ్లు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట.

 

క్రీ.శ. 1524 సం. లో శ్రీ శంకరాచార్యులవారు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని దర్శించారుట.  ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని ఒక ఉధ్ధరిణకి  తాడు కట్టి ఆ బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిట గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకుని, పూజలు జరిపి వెళ్ళారుట.  ఈ విషయంలో శ్రీ శంకరాచార్యులవారు రాయించిన శాసనం (పాళీ భాషలో) దేవాలయంలో ఇప్పటికీ వున్నది.

 

నదీ సంగమం కనుక ఇక్కడ  అస్తికలు నిమజ్జనం చెయ్యటం, కర్మకాండలు  కూడా చేస్తుంటారు. మిర్యాలగూడ తాలూక, దామరచర్ల మండలంలో రెండు నదుల సంగమంలో వున్న మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి హైదరాబాదునుంచీ బస్సులున్నాయి.  పిడుగురాళ్ళ వెళ్ళే బస్సులు వాడపల్లి మీదనుంచే వెళ్తాయి.  రైలు మార్గం మిర్యాలగూడా వరకే.   అక్కడనుంచీ బస్ లో వెళ్ళాలి.

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)