శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం

 

 

శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం

 

 

 

 

నల్గొండజిల్లా ఆలేరుమండలంలోని   కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య  ఇక్కడేనే లింగోద్భవము పొంది  వేయి సంవత్సరాలు భూమండలం మీద  శైవ మతప్రచారము చేసి,  మరల ఇచ్చటనే లింగైక్యమందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం.. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి.  దేవాలయ ప్రాంగణాన్ని , ప్రాకార మండపాలనే మ్యూజియం గా ఏర్పాటుచేశారు పురావస్తు శాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 -  1126 మథ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని  చరిత్ర కారులు భావిస్తున్నారు.  

                
                        
             

శ్రీ రేవణ సిద్ధేశ్వరుడు

పూర్వచరిత్ర. : ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణ కాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట.  ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.            
     

 


ఆలయ ప్రవేశ ద్వారం            


                                   
ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం, లేక స్వయంభూలింగంగా చెపుతున్నారు. ఈ లింగం నాలుగు యుగాలనాడే వెలసింది. కృతయుగంలో స్వర్ణలింగం గాను, త్రేతాయుగంలో రజితలింగంగాను, ద్వాపరయుగంలో తామ్రలింగంగాను, పూజలందుకుని కలియుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు స్థలపురాణం.              
                    

 


ప్రవేశ ద్వారంఎదురుగా వినాయకుడు


      
 ఈ లింగమే రెండుగా  చీలి, దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించి,1000 సంవత్సరాలు భూమిపై వీరశైవ మతప్రచారం చేసి, మళ్ళీ తిరిగి ఇదే లింగంలో లీనమైనట్లు చెప్పబడుతోంది. ఈయనకే రేణుకుడు, రేవణ, నేవణ, నేవణ సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి.
                                  శ్రీమత్ రేవణ సిద్దస్య కుల్యపాక పురోత్తమే !
                                  సోమేశ లింగ జననం  నివాసే కదళీ పురీ !!

అని  రేణుకాచార్య  స్తుతి.
పంచపీఠాలు :        ఈ సోమేశ్వరలింగం పంచ పీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు.              
1. సోమేశ్వరస్వామి – కొలనుపాక

2. సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని
3.భీమనాథస్వామి - కేదారనాథ్

4. మల్లిఖార్జున స్వామి – శ్రీశైలమ్
5. విశ్వేశ్వరస్వామి – కాశి  
                                 

                        

 


మ్యూజియంలోని గజలక్ష్మి                      


                                             
                                                               
అతి పురాతనమైన  ఈ ఆలయప్రాగణం లోకి ప్రవేశించిన భక్తులకు అనిర్వచ నీయమైన భక్తితో పాటు ఏదో ఒక ఆవేశంవంటిది కలుగుతుంది. దీనినే వీరశైవం లో భక్త్యావేశం అని పిలిచేవారేమో అనిపిస్తుంది. అక్కడ కన్పించే భక్తులు కూడ ఎక్కువగా కర్నాటకనుండి వచ్చినవారే ఎక్కువగా కన్పిస్తారు. తలస్నానాలు చేసి, జుట్టు ఆరబోసుకొని, ముఖంమీద బండారు, కుంకుమ, విభూతులను దట్టంగా అలంకరించుకున్న ఆడవారిలో అక్కడ చండీమాతే  కన్పిస్తుంది.
                    


మ్యూజియం లోని ఒక శిథిల శిల్పం               


                                  
               
ఆలయప్రవేశం తోరణ ద్వారంతో  చాలాఎత్తుగా కన్పిస్తుంది.  తోరణ ద్వారానికి అటునిటు ద్వారపాలకులు,  ఎడమ వైపు నలుచదరపు కందకంలో నంది శివలింగాలు. ఆ పైన దూరంగా కొన్ని శాసనాలు   దర్శనమిస్తాయి. తోరణ ద్వారానికి కుడి వైపు కొంచెం దూరం లో నేల లోపలికి నలభై,ఏభై   మెట్ల తో మెలికలు తిరిగిన నేలమాళిగ ఉంటుంది. ఆ మార్గాన్ని   మూసివేయడం జరిగింది.

 

    
కోష్ట పంజరంలో శ్రీ పార్వతీ పరమేశ్వరులు


                                        
ప్రథాన ఆలయం. మ్యూజియాన్ని, వీరభద్ర మండపాన్ని దాటి వెళితే ప్రథాన ఆలయాన్ని చేరుకుంటాం. ఈ నడుమ ప్రమాణ మండపంలో నందీశ్వరుడు మనల్ని పల్కరిస్తున్నట్లుగా కనిపిస్తాడు. ప్రథానాలయం ప్రాకార మండపాల నుండి వేరుగా నిర్మించబడింది. ముఖమండపంలో పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు.
                       

                 
ఆయనంతరం గర్భాలయంలో స్వయంభువుడైన సోమేశ్వరుని లింగరూపం, ఆ వెనుక లింగోద్భవమూర్తిగా రేణుకాచార్య విగ్రహం దర్శన మిస్తాయి.
                                                        

 

          
స్వయంభువు డైన సోమేశ్వరుడు, వెనుక ఆదిజగద్గురు రేణుకాచార్య ఆవిర్భావ దృశ్యం                          చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు, అందువలన ఈ స్వామి సోమేశ్వరుడుగా పిలువబడబతున్నట్లు స్థలపురాణం.
  
చండీమాత : ఎడమవైపు ఉపాలయంలో మల్లిఖార్జునుడు ఆ ప్రక్కనే నాలుగుమెట్లు ఎక్కి కుడువైపుకు తిరిగితే ఉపాలయంలో చండీమాత కొలువు తీరి ఉంటుంది.

 

 

శ్రీ చండీమాత              


                                                           
ఆ ఆలయానికి ఎడమవైపు కుందమాంబ దివ్యమంగళవిగ్రహం కన్పిస్తుంది. చండీమాత భక్తులు ముడుపులు కట్టి, కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే చండీమాత ముఖమండపం పైకప్పంతా ఈ ముడుపుల మూటలతో నిండి   ఉండటాన్ని మనం గమనించవచ్చు.

 

  
చండీమాత ఆలయ ద్వారం దగ్గర ఉన్న వినాయకుడు విగ్రహం.

 


 


కోటిలింగేశ్వరాలయం: ఎడమవైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే నైరుతిలో కోటిలింగేశ్వరాలయం కన్పిస్తుంది . పంచకోసు నగరంగా పిలువబడే ఈక్షేత్రంలో  కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యిలింగాలు తక్కువ కావడంతో ఒకే రాయిపై వేయిలింగాలను చెక్కి ప్రథిష్టించారట. అదే ఈ కోటిలింగేశ్వరాలయంగా ప్రసిద్ధి  కెక్కింది.                   
                            

 



సూర్యగంగ :ప్రథానాలయ ముఖమండపము కుడివైపు ద్వారం నుండి బయటికి వస్తే కన్పించేది సూర్యగంగగా పిలువబడే అత్యంత లోతైన కోనేరు.
  

 

 

                 
ఏకాదశ రుద్రులు : అటునుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశరుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది. ప్రక్కనే కొంచెందూరంలో ఉత్తరాభిముఖుడై విఘ్నరాజు కొలువు తీరి ఉంటాడు.

 

           
ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే  కాకతీయ కళాసంప్రదాయంతో నిర్మితమైన మరో శిథిల శివాలయం మన కంటపడుతుంది. సోమేశ్వర ఆలయమంతా చాళుక్య, హోయసల  నిర్మాణ సంప్రదాయం  కన్పిస్తే,  ఈ ఆలయం  నిర్మాణం లో కాకతీయ  శైలి ప్రతిబింబిస్తోంది.  దీనలో శివలింగం, ముఖమండపం లో నంది మిగిలున్నాయి, ఆ ప్రక్కనే కేతేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణం  గా కన్పిస్తోంది.

 

                               
అలాగే కనుచూపుమేర వరకు శిథిలమైన ఒరిగిపోయిన  ఆలయ సముదాయాలే  ఇక్కడ  మనకు గోచరమౌతాయి. ఉపాలయాల్లో  కాలభైరవుడు, వీరభద్రుడు, కుమారస్వామి  రూపాలతో పాటు, ఒక మండపం లో ఆంజనేయుడు కూడ కొలువు తీరి ఉన్నాడు.
           

 


ఇక్కడే కాదు. ప్రథాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న నంది స్థంభం దగ్గర కూడ మనకు చాలా ఎత్తైన ఆంజనేయ విగ్రహం వినాయక ,కార్తికేయులతో కలసి కన్పిస్తుంది.
       

 


వీరశైవ క్షేత్రాల్లో ఆంజ నేయుడు కన్పడటం ఆంజనేయుడు శివాంశ సంభూతుడు గా పూజించ బడటమే కారణమై ఉండవచ్చు.   ఇంకా ఎక్కువ సమాచారం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి అక్కడ సరైన  గైడ్ కాని, ముద్రిత సమాచారం కాని  లేకపోవడం కొంచెం బాధ కల్గిస్తుంది.
                           

మ్యూజియం లోని అపురూపమైన కోదండరాముని విగ్రహం

 
               

సుదూర ప్రాంతాలనుంచి అంటే ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడ కొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. యాత్రికుల వసతి సముదాయం ఇటువంటి వారికోసం అందుబాటులో ఉంది.
కొలనుపాక హైదరాబాద్ వరంగల్లు మార్గంలో ఆలేరు నుండి బచ్చన్నపేటకు వెళ్లే దారిలో 8 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాదు నుండి సుమారు 80 కి.మీ  దూరంలో ఉంది. వరంగల్లు చేరుకొని అక్కడి నుండి ఆటోలలో వెళ్ళవచ్చు