Read more!

శనివార మహిమ

 

శనివార మహిమ

 

 

శనివారం ఆంజనేయస్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి. అన్ని వారాల్లోను మంద వారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది. "సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః  –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః'' అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయినాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు. అభిషేకం చేస్తే అనుగ్రహప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రుజయం కల్గి మిత్రసమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.

 

 

మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్టమాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడుకాని శనివార వ్రతం చేయాలి. శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమకు అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యధావిథిగా జపించాలి. దీనివల్ల జన వశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

 

 

శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా వుంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు, హనుమను సమీపించి "మారుతీ! నేను శనిని, అందర్నీ పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు.’’ అన్నాడు. దానికి హనుమ "శనీశ్వరా! నన్ను పట్టుకొంటావా? లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా వుంది?’’అని ప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమ శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తుకొన్నాడు హనుమ. "కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకున్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేలమీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి "మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజగిజ లాడిపోతున్నావే?’’అని ప్రశ్నించాడు. "ప్రజలను బాధించటమే  నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను’’అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.

 

 

హనుమ "శనీ! నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించే వారిని, నాకు అభిషేకం చేసేవారిని  ఏకాలంలోనైనా ముట్టుకోకూడదు. నువ్వు బాధించరాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను''అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు. అందుకే శనివారం ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది. శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు.

"మంద వారేషు సం ప్రాప్తే   హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా''

శని వారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమపూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.