శివరాత్రి జాగరణ, ఉపవాసం ఎంత మహిమాన్వితమైనవో తెలుసా..
శివరాత్రి జాగరణ, ఉపవాసం ఎంత మహిమాన్వితమైనవో తెలుసా..
శివరాత్రి భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన దినం. ఈరోజు ప్రతి శివాలయంలో శివోహం అనే మాటలతో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు జనులందరూ. ప్రతి చోటా శివాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, పురాణాల పారాయణ, పురాణ శ్రవణం.. మొదలైనవి అన్నీ చాలా వైభవంగా జరుగుతాయి. నిరాడంబరుడు అయిన శివుడు శివరాత్రి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు. ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణలు ఎంత శక్తివంతమైనవో తెలిపే ఒక పురాణ కథ ఉంది. దాని గురించి తెలుసుకుంటే..
గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఇతనికి ఏ ఆచారాలు పాటించక చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనికి లేని చెడ్డ అలవాటు అంటూ లేదు.. ఏ రకంగా చూసినా అతను బ్రాహ్మణ కులాన్ని బ్రష్టు పట్టించాడు అనే వారు. ఇంత చెడ్డ అలవాట్లు కలిగిన గుణనిధి ఒక శివరాత్రి రోజు తన ప్రమేయం లేకుండానే తనకు ఎక్కడా ఆహారం దొరకక ఆ రోజంతా ఏమీ తినకుండా ఉన్నాడు. అతను అలా తినకపోయేసరికి అదే శివరాత్రి ఉపవాసం అయ్యింది.
ఆహారం ఎక్కడా దొరకకపోవడంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు శివరాత్రి కదా.. కనీసం గుడిలో ప్రసాదం దొరుకుతుందేమో అని శివాలయానికి వెళతారు. చీకటిలో ఏదైనా తినడానికి వెతుకుదామని అతను దీపం వెలిగిస్తాడు. -అదే శివాలయంలో కొందరు భక్తులు జాగారం చేస్తుండటం అతను గమనించి భయపడతాడు. అక్కడే బిక్కుబిక్కుమని దాక్కుని నిద్రలేకుండా గడుపుతాడు. అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించి ఊహించని విధంగా ఆ శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని ప్రమేయం లేకుండానే ఉపవాసం, జాగరణ ఉండటమే కాకుండా.. శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని పాపాలన్నీ నశించి శివసాయుజ్యం పొందుతాడు. అంతేనా.. ఆ నాడు శివాలయంలో మరణించిన గుణనిధి మరుసటి జన్మలో నిధులకు అధిపతి అయిన కుబేరునిగా జన్మిస్తాడు. తెలియక శివరాత్రి జాగరణ, ఉపవాసం చేసినందుకే శివుడు ఇంత కరుణ చూపిస్తే.. భక్తి శ్రద్దలతో శివరాత్రి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడు ఇంకెంత కరుణ చూపిస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే శివరాత్రి ఉపవాసం, జాగరణ అనేవి జన్మ పాపాలను, చెడు కర్మల పాపాలను కరిగించేవి.. వాటిని అందరూ విదిగా పాటిస్తే ఎంతో మంచిది.
*రూపశ్రీ.