Read more!

ఏకలవ్యుడు (Ekalavya)

 

ఏకలవ్యుడు

(Ekalavya)

 

రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందినా పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. "అతను ఏకలవ్యుడంతటి దీక్ష కలవాడు" అని, "నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి" అని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా! అదేంటో తెలుసుకుందాం.

ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకలవారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంది. తాను నిషాద (ఎరుకల) కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు..

ఒకరోజు ఏకలవ్యుడు, అస్త్రవిద్యలో గురువర్యుడు అయిన దోణాచార్యుని వద్దకు వెళ్ళి, ''అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది" అని అడిగాడు. ద్రోణుడికి నిషాద బాలుడైన ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ, ఆ మాత బహిరంగంగా చెప్పకుండా "బాగా సాధన చేయి, అదే వస్తుంది" అన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి, వెనుదిరిగి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారుచేసుకుని, భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే, నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షటో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు.

ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే, కళ్ళతో చూడకుండా, కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ వేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మట్టుకు శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు.

ఏకలవ్యుడి సంగతి అలా ఉండగా...

దోణాచార్యుడు అస్త్ర విద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు దోణాచార్యుని అస్త్ర విద్యలు నేర్పేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే. కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ, అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహా ప్రేమ. తన అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు.

ఓ సందర్భంలో ద్రోణుడు, తన శిష్యునితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు, ఎవరు, ఏమిటి అని చూడకుండానే, శబ్దవేది విద్యలో ఘటికుడు కనుక కుక్క మొరిగిన దిశగా బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలింది. కుక్క మూలుగుతూ పడటంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు.

ఏకలవ్యుడి విలువిద్యా చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. ''తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారుచేస్తానని మాట ఇచ్చి తప్పారు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉంది. అంటే, తనను మాయచేసి, ఎరుకలవాన్ని మరింత ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు'' అనుకున్నాడు. దాంతో "గురువుగారూ, మీరు మాట తప్పారు.. మీకు నాకంటే నిషాదుడే ఎక్కువ కదూ!'' అనేశాడు.

ద్రోణుడు అర్జునుడు బాధపడటం సహించలేకపోయాడు. నిజంగానే తాను అర్జునిడికి ఇచ్చిన మాట నెరవేరలేదు. దాంతో ఏకలవ్యునివైపు తిరిగి, ''ఎకలవ్యా! విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు.. మరి, నా గురుదక్షిణ ఏది?" అన్నాడు.

ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ళతో కాళ్ళమీద పడిపోయి, "కోరుకోండి, అయ్యా.. నేను ఇవ్వగలిగింది ఎదైయినా ఇస్తాను'' అన్నాడు. ద్రోణుడు "నీ కుడిచేతి బొటనవేలు ఇస్తావా?" అన్నాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బొటనవేలు కోసిచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు.