Read more!

వినాయక పూజలో పత్రి ఎందుకు? (Vinayaka Pooja Benefits of Patri)

 

వినాయక పూజలో పత్రి ఎందుకు?

(Vinayaka Pooja Benefits of Patri)

తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరిగేందుకు తొలి పూజ చేసేది వినాయకుడికే. అలాగే దక్షిణాయనంలో మనం జరుపుకునే పండుగలలో మొదటిది వినాయక చవితి. ఇక ఆ తర్వాత ప్రతినెలలోనూ ఏదో ఒక పండుగ మనల్ని పలకరిస్తుంది, సంతోషాన్ని అందిస్తుంది.

దేవతలలో విఘ్నాధిపతి లంబోదరుడు. గణపతి సిద్ధి, బుద్ధి ప్రదాత. గణేషుని ఆకృతి ఆధ్యాత్మికంగా చూస్తే అనేక కొత్త అర్ధాలు చెబుతుంది. ఆ ఆకృతిలోని అంతరార్థము తెలుస్తుంది. గజాసుర సంహారం, వినాయకుని జన్మ వృత్తాంతం మనకు తెలుసు. మనకు తెలియనిదల్లా ఆయనకు చేసే పూజ గురించే. వినాయకుడు పత్రి ప్రియుడు. పత్రితో మనం చేసే పూజ ఆయన అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఏనుగు తినే ఆహారమే పత్రి అని, వినాయకునికి ఏనుగు తల ఉంది కాబట్టి ఆకులు, పూవులతో కూడిన పత్రిని నైవేద్యంగానో, పూజా ద్రవ్యంగానో సమర్పిస్తున్నామని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. మరి పత్రివల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

వినాయకుని పూజకు మనం వాడే పత్రిలో ఆకులు, కాయలు, పూలు, పండ్లు ఉన్నాయి. వీటిలో ఎనలేని ఔషధ గుణాలున్నాయి. కేవలం స్పర్శామాత్రంతో కొన్ని రకాల అతి సామాన్య వ్యాధులను నయం చేయగల శక్తి వీటికి ఉంది. కొన్ని రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్నిస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయి. మన పూర్వీకులకు వీటి గుణాలు తెలుసు. ఆ ఔషధాలన్నింటినీ నట్టింటికి రప్పించేందుకు చేసిన ప్రయత్నమే ఈ పూజ అని గుర్తించాలి. ఏదో సంవత్సరానికి ఓసారి ఇలా పూజ కోసం ఆ ఔషధ గుణాలున్న పత్రిని ఇంటికి తీసుకువస్తే సరిపోతుందా, ఆరోగ్యం చేకూరిపోతుందా- అనే సందేహం రావడం సహజం. నిజం చెప్పాలంటే ఒకసారి చేసినంతలో పెద్దగా ప్రయోజనం ఉండదు. కాకపొతే ప్రతిరోజూ ఇన్ని నియమాలతో పూజ చేయడం కష్టం కాబట్టి ఆ ఏర్పాటు చేశారు.

భాద్రపద మాసంలోనే పత్రితో పూజ ఎందుకు చేయాలి? ఎప్పుడో ఒక్కప్పుడు చేస్తే సరిపోతుందా? అని మరో ప్రశ్న కలగొచ్చు, దానికి సమాధానం ఏమిటంటే... ఇతర సందర్భాల సంగతి అలా ఉంచి భాద్రపద మాసంలో తప్పక చేయాలి. ఎందుకంటే.. భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది. గుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి, సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది.

గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోంది. కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే, పదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం.

తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు.

తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు! శాస్త్రీయంగా ఇది నిజమే. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది. వినాయకుని పూజించే పత్రిలో ప్రధానంగా ఉండాల్సినవి గరిక, తులసి, నేరేడు, మారేడు, మరువం, ఉమ్మెత్త, ఉత్తరేణి తదితర ఔషధ గుణాలున్న పత్రాలు. వీటివల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుందో తెలుసుకుందాం.

తులసి

తులసివల్ల జరిగే మేలు గురించి ఏకంగా ఒక పుస్తకమే రాయొచ్చు. కఫం మొదలైన అనేక రోగాలను తగ్గిస్తుంది.

జిల్లేడు

చర్మ వ్యాధులను, శ్వాసకోశ వ్యాధులను జిల్లేడు నశింపచేస్తుంది. నరాలకు సత్తువనిస్తుంది. జిల్లేడు ఆకులనుండి వచ్చే మొత్తం శరీరంలోని దోషాలను నివారిస్తుంది. శరీరానికి ఆరోగ్యం కలిగిస్తుంది.

రేగు

అతిసారం, రక్తదోషాలను మటుమాయం చేస్తుంది. కేశ వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. రేగు ఆకులనే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి.

మరువం

మరువపు పరిమితం వాతావరణాన్ని ఆహ్లాదంతో నింపుతుంది. శ్వాస, చెవి సమస్యలు తగ్గుతాయి.

రావి

రావి ఆకులు మానసును కేంద్రీకరించేందుకు తోడ్పడతాయి.

దానిమ్మ

దానిమ్మ పూలు, బెరడు, కాయలను ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. వర్షాకాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలవంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఉత్తరేణి

ఉత్తరేణి వేరును మొహం కడుక్కోవడానికి ఉపయోగిస్తుంటారు. ఉత్తరేణి అత్యుత్తమ ఔషధ గుణాలు కలిగి ఉందని నిర్ధారించారు.

బిల్వపత్రం

సూక్ష్మక్రిములను హరిస్తుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. గాలి చొరని గర్భగుడుల్లో బిల్వపత్రాలతో పూజించడంవల్ల స్వచ్చత చోటు చేసుకుంటుంది.

నేరేడు

నేరేడు కాయ అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది. నేరేడు ఆకుల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి మంచిది.

మారేడు

త్రిదోషాలను హరిస్తుంది. సకల దోషాలను హరిస్తుంది.

గరిక

ముక్కు సంబంధమైన అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

మాచీ పత్రి

వ్రణాలు, దద్దుర్లు, వాత రోగాలు, నులిపురుగులను తగ్గిస్తుంది. కొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదు. అతి దాహాన్ని హరిస్తుంది.

జమ్మి

ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది దసరా పండుగ. శమీ పూజ చేస్తాం కదా! కఫ, శ్వాస రోగాలను తగ్గించడంలో జమ్మి చెట్టు ఆకులు, బెరడు బాగా పనిచేస్తాయి.

మునగాకు

కఫాన్ని, వాతాన్ని హరించి శ్వాసను క్రమబద్ధం చేస్తుంది.

ఇలా చెప్పుకుంటూపొతే ఒక్కో మొక్కదీ ఒక్కో ప్రత్యేకత. వినాయకుని నిత్యం అర్చిస్తుంటే శుభాలు తప్పక కలుగుతాయి. నవరాత్రులలో చేసిన విధంగా కాకుండా ప్రతిరోజూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తే మంచి కలుగుతుంది. మనం కోరే ఫలితాన్ని బట్టి వినాయకుని ప్రతిమను ఏర్పరచుకోవాలని కూడా పెద్దలు చెప్పారు.

గణపతి బంగారు ప్రతిమను పూజిస్తే ఐశ్వర్యం, వెండి ప్రతిమను పూజిస్తే ఆయుష్షు, రాగి ప్రతిమను పూజిస్తే సంకల్ప సిద్ధి కలుగుతాయి. వినాయక వ్రతం ఎప్పుడు శుభకరమే. గణేశ చతుర్థి రోజు ఈ వ్రతం ఆచరిస్తే చదువులో వెనుకబాటు ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఆటంకాలూ ఉండవు. అందరూ కలిసి చేసుకునే పర్వదినాల్లో వినాయక చవితి ముఖ్యమైంది. ఇలాంటి పండుగలవల్ల వ్యక్తిగతంగా ప్రశాంతత చేకూరడమే కాకుండా ఐకమత్యం పెరిగి సమాజానికి మేలు జరుగుతుంది.