Read more!

ఘటోత్కచుని మరణం వెనుక జరిగింది ఇదే!

 

ఘటోత్కచుని మరణం వెనుక జరిగింది ఇదే..
 


కురు పాండవ సేనలమధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతోంది. రాధేయుని ధాటికి పాండవయోధులు ఆగలేక, ప్రాణభీతితో పారిపోతున్నారు. కర్ణుడ్ని ఉపేక్షిస్తే పాండవ సైన్యం బతికి బయటపడటం జరగదని అర్జునుడు గ్రహించాడు.

రథాన్ని రాధేయుని దిక్కుగా నడపమని పార్థుడు తన సారధి అయిన కృష్ణుడ్ని కోరాడు. ఆ రోజు అటు కర్ణుడో, ఇటు అర్జునుడో ఎవరో ఒకరు మాత్రమే. బతికి వుండాలన్న పట్టుదలతో వున్నాడు అర్జునుడు.

'అర్జునా! ఈవేళ కర్ణుడు అమితపరాక్రమంతో చెలరేగుతున్నాడు. మన వీరులలో ఘటోత్కచుడు మినహా మరెవరూ కర్ణుడ్ని ఓడించలేరు. రాధేయుడి దగ్గర మహేంద్రుడు ప్రసాదించిన 'వైజయంతి' అనే మహాశక్తి వుంది. అది అతని దగ్గర ఉన్నంతవరకూ నువ్వు అతని ముందుకు పోవటం మంచిది కాదు' అని కృష్ణుడు చెప్పాడు.

వైజయంతి వజ్రాయుధం లాంటిది. దానిని ఎదుర్కోగల ఆయుధం మరొకటి లేదు. దానిని కర్ణుడు అర్జునుడిమీద ప్రయోగించాలని వేచి ఉన్నాడు. అది గ్రహించిన కృష్ణుడు అర్జునుడు ముందుకుపోకుండా అడ్డు తగిలాడు.

బలపరాక్రమాలలో పార్ధుడికి తీసిపోనివాడూ, మాయాయుద్ధంలో మొనగాడూ, భీముని పుత్రుడూ అయిన ఘటోత్కచుడ్ని యుద్ధంలోకి దింపాడు. అప్పుడు ఘటోత్కచునికీ, కర్ణునికీ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఘటోత్కచుని మాయాజాలం ముందు కౌరవసేనలు నిలబడలేకపోయాయి. అది చూసి దుర్యోధనుడు హడలిపోయాడు. వెంటనే జటాసురపుత్రుడూ, పాండవ విరోధీ, అన్నివిధాల ఘటోత్కచుడికి సముడూ అయిన అలంబసుణ్ణి ఘటోత్కచుడి మీదకు పంపాడు. ఆ రాక్షసవీరులిద్దరిమధ్యా తీవ్రపోరాటం జరిగింది. ఘటోత్కచుడు అలంబసుని శిరస్సు ఖండించి దానిని దుర్యోధనుడి మీదకు విసిరేశాడు. దుర్యోధనుడికి కన్నీళ్ళే తక్కువ. కర్ణుడి దగ్గరకు వెళ్ళి 'ఎంత కష్టమైనా సువ్వీరోజు ఘటోత్కచుడ్ని వధించి తీరాలి. లేకపోతే మనపక్షాన ఏ ఒక్కడూ మిగలడు. నీదే భారం' అని ప్రాధేయపడ్డాడు.

దుర్యోధనుడి దీనావస్థను చూసి తన ప్రభువును ఆపదలో ఆదుకోవటం, కౌరవులను రక్షించటం తన కర్తవ్యమని కర్ణుడు అనుకున్నాడు. అర్జునుడ్ని హతమార్చేందుకు అంతవరకూ దాచి వుంచుకున్న వైజయంతిని ఘటోత్కచుడిమీద ప్రయోగించాడు. ఆ మహాశక్తిని చూడగానే ఘటోత్కచుడు గజగజలాడిపోయాడు.

తన శరీరాన్ని పెద్ద పర్వతంమాదిరి పెంచుకున్నాడు. ప్రాణభీతితో పరుగెత్తాడు. పరుగెత్తుతున్న ఘటోత్కచుడ్ని వెంటాడి అతని గుండెల్ని చీల్చింది వైజయంతి.

భీకరంగా అరుస్తూ ఘటోత్కచుడు నేల కూలాడు. అది చూసి పాండవులందరూ పెద్దపెట్టున ఏడ్చారు. కృష్ణుడు మాత్రం సంతోష పడ్డాడు. పాండవులు దుఃఖపడుతుంటే కృష్ణుడు సంతోష పడటం అర్జునుడికి ఆశ్చర్యం కలిగించింది.

'మాధవా! నీ ఆనందానికి కారణం ఏమిటి?' అని అడిగాడు.

'అర్జునా! నిన్ను నేలకూల్చే మహాశక్తి నేటితో అంతరించిపోయింది. దానితోపాటు కర్ణుడి ఆయుర్దాయం కూడా తరిగిపోతోంది. 'కర్ణుడి కవచకుండలాలు తీసుకుని మహేంద్రుడు ఇంతకు మునుపే రాధేయుడ్ని సగం నిర్జీవుడ్ని చేశాడు. ఇప్పుడు కర్ణుడు తన అపూర్వ శక్తిమంతమైన ఆయుధం వైజయంతిని ఘటోత్కచుడిమీద ప్రయోగించటంవలన పూర్తిగా శక్తి హీనుడయ్యాడు. దానితో నీ మరణం తప్పిపోయింది. మీ జయం తథ్యమైంది. ఘటోత్కచుడు చనిపోయినందుకు నాకూ బాధగానే వుంది. కాని ఏం చెయ్యగలం? తప్పనిసరై పన్నిన వ్యూహమిది...." అన్నాడు కృష్ణుడు. ఇలా పాండవుల కోసం ఘటోత్కచుడు ప్రాణాలు కోల్పోయాడు.


                                       *నిశ్శబ్ద.