Read more!

గాయత్రి మంత్రం జపిస్తే జరిగే అద్భుతమిదే..

 

గాయత్రి మంత్రం జపిస్తే జరిగే అద్భుతమిదే..


సంధ్యావందనంలో ప్రధానంగా అర్హ్యప్రక్షేపణం, గాయత్రీజపం, ప్రాణాయామం ఉంటాయి. సంధ్యావందన ప్రక్రియకు ఆత్మలాంటిది గాయత్రీ మంత్రం.

"ఓం భూర్భువస్సువః 

తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి 

ధియో యోనః ప్రచోదయాత్”

అనే ఋగ్వేదంలోని ఈ మంత్రం అర్థం - "ప్రణవంగాను, భూః భువః సువః అనే వ్యాహృతులుగాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం”

గాయత్రీ మంత్రోచ్చారణ వల్ల వ్యక్తిలో నిగూఢ స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు చైతన్యమవుతాయి. 'గాయనాత్ ఇతి గాయత్రి' అని వ్యుత్పత్తి. అంటే దేనిని గానం చేయడం వల్ల రక్షణ కలుగుతుందో అదే గాయత్రి. ఈ మంత్రంలో మూడు భాగాలున్నాయి. మొదటిది ప్రణవ మంత్రమైన ఓం. ఇది అత్యంత శక్తిమంతమైంది. గుడిలో గంటను ఖణేల్ ఖణేల్మని మోగిస్తే ధ్వనికి కంటికి కనిపించని అనేక సూక్ష్మ జీవులు ఒక్కసారిగా నేలరాలతాయి. అకార ఉకార మకారాల కలయిక అయిన ఓంకార ప్రణవనాదంలో కూడా అంతశక్తి ఉంది.

మన మెదడులో ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అనే స్పందనలు ఉంటాయి. ఒక ప్రయోగంలో కొంతమంది చేత ఓంకారాన్ని ఉచ్చరింప చేసి వారి శరీర స్పందనల్ని నమోదు చేశారు. 'ఓ' కారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆల్ఫా (చాలా హాయి అయిన విశ్రాంతి స్థితి, "మ్" కారం ఉచ్చరిస్తున్నప్పుడు తీటా (నిశ్చల ధ్యాన స్థితిలో ఉండే సృజనాత్మక స్థితి) స్పందన నమోదయ్యాయి. మామూలు విశ్రాంతి స్థితి మత్తులాంటిది. అయితే, 'ఓ' కారోచ్చారణ ద్వారా వచ్చేది చైతన్యవంతమైన విశ్రాంతి అనీ, అనంతశక్తిని అందించేది 'మ్' కారోచ్చారణ అనీ పరిశోధనలలో తేలింది. ఆల్ఫా-తీటాల మధ్య ఉండే మనస్సు చైతన్యంతో స్పందిస్తూనే అలసిపోని ఆరోగ్యకరమైన విశ్రాంతితో ఉంటుందనీ, ఈ డైనమిక్ ట్రాంక్విలిటీ వల్ల మనిషి నిత్య చైతన్య శీలుడు కాగలడని అర్థం చేసుకోవచ్చు.

ఓం కారానంతరం ఉచ్చరించే “భూర్భువస్సువః” అనేది దివ్యశక్తిని కలిగించే పదబంధం. మనిషి చేతనావస్థలోని శరీరం, మనస్సు, ప్రాణం- అనే మూడింటినీ జాగృతం చేసే శక్తి అది. అంతర్ బుద్ధిని వికసింప చేసుకొనేందుకే గాయత్రీ మంత్రం. ఈ అంతర్బుద్ధినే శాస్త్రాలు 'బుద్ధి', 'ధీః' అని పేర్కొన్నాయి. గాయత్రీ జపంతో సాధకుడు తనను తాను జాగృతం చేసుకోవడం, తనపై తాను నియంత్రణ పొందడం, తన అంతరాంతరాల్లో దాగుని ఉన్న అనంత శక్తిని మేల్కొల్పడం జరుగుతుంది. అందుకే ఛాందోగ్యోపనిషత్లో తృతీయ ప్రపాఠకం ద్వాదశ ఖండంలో "సర్వమూ - గాయత్రియే. వాక్కుగాయత్రి. భయాల్ని పోగొట్టే గానం గాయత్రి. ఈ పృథివి గాయత్రి. సర్వజీవులూ గాయత్రి. నీ దేహం, హృదయం, ప్రాణం, ఇంద్రియాలు అన్నీ గాయత్రి" అని పేర్కొనబడింది.

                                           *నిశ్శబ్ద.