Read more!

తెలంగాణా సంప్రదాయ పండుగ బోనాలు ...

 

 

తెలంగాణా సంప్రదాయ పండుగ బోనాలు ...

 

 

బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అను బంధాలను పెంపొందించే వారిధి బోనాలు. భాగ్య నగరవాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం. బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢమాసంలో ఈ పండుగ జరుపుకుంటారు.  నగరంలో ఆషాడమాసంలో జరిగే బోనాలు గ్రామాల్లో శ్రావణమాసంలో జరుగుతాయి. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

 

 

బోనం అంటే  నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవిగుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మొదలైన పేర్లు కల ఈ దేవిగుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. 

 

 

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బోనం మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము;

 

 

మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

పోతురాజు

 

 

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నాట్యం చేస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాళ్ళను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు

రంగం

 

 

రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కొపాన్ని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి, తల, మొండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నుల పండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టి వ్యాధినిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

ఘటం

 

 

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది.

హైద్రాబదులో బోనాలు.

 

 

కులీకుతుబ్‌ షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరం రాజదానిలో సుమారు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరుగుతుంది. గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల, సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండువందల ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే నిజాం నవాబుల ప్రార్ధనలతో ప్రాశస్త్యం పొందిన లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. హైద్రాబదులో బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

 

 

హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.అక్కన్న-మాదన్న మాతా మహంకాళి ఆలయంగా సుప్రసిద్ధమైన హరిబౌలి ఆలయంలో బోనాల రోజున రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతున్నది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

 

 

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న, మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలంమండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.