ఆపిల్ వాటర్ ఫ్రూఫ్ ఫోన్లు
Publish Date:Mar 6, 2015
అసూస్ నుండి రెండు కొత్త ప్రొడక్ట్స్
Publish Date:Mar 5, 2015
గెలాక్సీ 6 వచ్చేస్తోందోచ్
Publish Date:Mar 2, 2015
యాపిల్ నుంచి కారు రాబోతోంది...
Publish Date:Feb 17, 2015
ఫేస్బుక్ సిక్స్ ప్యాక్
Publish Date:Feb 12, 2015
రోబోలు స్టాఫ్గా జపాన్ హోటల్
Publish Date:Feb 9, 2015
పసి ప్రాణాన్ని కాపాడిన 3డి ప్రింటర్
Publish Date:Jan 31, 2015
హాలీవుడ్ కంటే యాప్స్ మార్కెట్టే ఎక్కువ...
Publish Date:Jan 27, 2015
కొంతకాలానికి ఇంటర్నెట్ మాయం
Publish Date:Jan 23, 2015
విండోస్ 10 విశేషాలు
Publish Date:Jan 22, 2015
ఇక కంప్యూటర్లలో వాట్స్యాప్
Publish Date:Jan 22, 2015
మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ వాచ్
Publish Date:Jan 21, 2015
అదిరిపోయే ఫోన్ వచ్చేస్తోంది
Publish Date:Jan 20, 2015
ఐదువేలకే అదిరిపోయే ట్యాబ్
Publish Date:Jan 15, 2015
మార్కెట్లోకి శామ్సంగ్ జడ్1 ఫోన్... విశేషాలు
Publish Date:Jan 14, 2015
అమ్మాయి కాదు.. రోబో...
Publish Date:Jan 9, 2015
వారెవ్వా ఏమి ట్యాబ్లెట్
Publish Date:Jan 7, 2015
SALE AND REVIEW OF XIOAMI- MI3
Publish Date:Aug 25, 2014
CELKON MILLINUM Q44
Publish Date:Aug 12, 2014
జగన్ కు జిగ్రీ దోస్త్ షాక్ ! విశాఖపై నిర్ణయం మారేనా?
మూడు నిర్ణయాలు.. ఆరు కొట్టివేతలు.. తొమ్మిది చివాట్లు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ 20 నెలల పాలనా తీరు. అనాలోచిత, అస్తవ్యస్థ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని కోర్టులు కొట్టివేయడం.. న్యాయమూర్తుల నుంచి అక్షింతలు తినడం జగన్ రెడ్డి సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. మూడు రాజధానులు.. ఇంగ్లీష్ మీడియం... వైసీపీ రంగులు.. ఇలా అన్ని అంశాల్లోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగిలాయి. జగన్ సర్కార్ తీసుకుంటున్న తికమక నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందనే ఆరోపణలు ఏపీ జనాల నుంచి వస్తున్నాయి. అయినా తన తీరు మార్చుకోకుండా ముందుకు పోతున్నారు జగన్ రెడ్డి. అయితే తాజాగా సీఎం జగన్ కు ఆయన జిగ్రీ దోస్త్ కూడా షాకిచ్చారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరికాదంటూ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోని విశాఖకు తరలించొద్దని తెలంగాణ తేల్చి చెప్పింది. బోర్డు హెడ్ ఆఫీసును వైజాగ్లో ఏర్పాటు చేయాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురేకు లేఖ రాశారు. 2018 జూన్లో బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఏపీ ప్రతిపాదన పంపిందని లెటర్లో పేర్కొన్నారు. 2019 అక్టోబరు 9న కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలోనూ హైదరాబాద్ నుంచి విజయవాడకు బోర్డు తరలింపు ప్రతిపాదనపై చర్చ జరిగిందన్నారు. గత ఏడాది జనవరి 20న నిర్వహించిన కృష్ణా బోర్డు 12వ మీటింగ్లోనూ విజయవాడకు తరలిస్తామనే ప్రతిపాదించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ వైజాగ్కు బోర్డు తరలిస్తామని ఏపీ చెప్పలేదని, పోయినేడాది అక్టోబరు 6న నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏపీకి బోర్డు తరలింపుపై మాత్రమే చర్చ జరిగింది తప్ప, వైజాగ్కు తరలించాలని కాదని తన లేఖలో తెలిపారు తెలంగాణ ఈఎన్సీ. బోర్డు తరలింపు విషయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్న విషయంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. కృష్ణా బేసిన్కు సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడమేంటనే విమర్శలు వచ్చాయి. తన నిర్ణయాలతో పాలనలో జగన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ ను మించిపోయారని కొందరు సెటైర్లు వేశారు. నదీ జలాల పంపకాల బోర్డు ఎక్కడైనా ఆ నది బేసిన్లో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా రివర్ బోర్డు ఆ బేసిన్ పరిధిలోనే ఉన్న హైదరాబాదులో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఈ బోర్డును ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో పెట్టారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాదులోనే కృష్ణానది నీటి యజమాన్య బోర్డును ఉంచడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నించింది. ఇందుకు అంగీకరించని కేంద్రం.. ఏపీలోనే బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కర్నూలులో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఇక్కడి అనుకూలతల గురించి నీటి పారుదల నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు పూర్తి వివరాలతో నివేదిక అందజేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు కర్నూలు అందుబాటులో ఉంటుంది. కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే నీటి వినియోగంలో, కేటాయింపుల్లో తరచూ వచ్చే వివాదాలను పరిష్కరించుకోడానికి అనుకూలంగా ఉంటుందని మూడు రాష్ట్రాల నీటి పారుదల శాఖ నిపుణుల అభిప్రాయం. కర్నూలు సరిహద్దుల్లోనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉండడం వల్ల త్వరలోనే తుంగభద్ర బోర్డును రద్దు చేసి కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డులో కలిపేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న వాదన కూడా ఉంది. అయితే ఇవేమి పట్టించుకోని జగన్ సర్కార్.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న తమ ప్రతిపాదనకు బలం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా విశాఖకు బోర్డును తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాయడంతో జగన్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. ముఖ్యంగా జగన్ కు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తూ.. అతన్ని తన మిత్రుడిగా బహిరంగంగానే ప్రకటించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారే వ్యతిరేకిస్తున్నందున కృష్ణా బోర్డు ఏర్పాటును జగన్ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులు క్లోజ్! జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
ఇన్ సైడర్ ట్రేడింగ్.. గత 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు పదేపదే చెబుతున్న మాట ఇది. టీడీపీపై ఆరోపణలు చేయడానికి వినిపించిన నినాదం ఇది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నేతలు బినామి పేర్లతో కారు చౌకగా వందల ఎకరాల భూములు ముందే కొనిపెట్టారని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తో పాటు వైసీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు అదే పనిగా ఆరోపిస్తున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ప్రొత్సహించిందని చెబుతూ వస్తున్నారు. వైసీపీ నేతల ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించారు టీడీపీ నేతలు. మాటలు కాదు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే నిరూపించాలని సవాల్ చేశారు. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు పుల్ స్టాప్ పడింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కిలారు రాజేష్తో పాటుగా మరికొందమందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. దీంతో వాటిని కొట్టివేయాలని కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసులు.. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ రాజేష్ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా నమోదు చేస్తారని? న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని పేర్కొంది. ఇన్సైడర్ ట్రేడింగ్కు ఐపీసీ సెక్షన్లు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కిలారు రాజేష్తో పాటు మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడి నుంచే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు 2019 డిసెంబర్ 28 న ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఏపీ సర్కార్ కొందరి పేర్లతో జాబితా విడుదల చేసింది. మొత్తం పదకొండు మంది పేర్లలో చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లతో పాటూ, యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన రావు పేర్లు తో పాటూ చాలా మంది పేర్లు ఉన్నాయి. వీరంతా నిబంధనలను తుంగలో తొక్కి వేలాది ఎకరాలు కారుచౌకగా కొన్నట్లు ఆరోపించింది. తెల్లరేషన్ కార్డు దారులకు కూడా అమరావతిలో వందలాది ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో ఉందని.. వారంతా టీడీపీ నేతల బినామీలేనని కారు డ్రైవర్లు, పనిమనుషుల పేర్లపై కూడా భూములున్నాయని జగన్ సర్కార్ ఆరోపించింది. ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ జనవరి 23, 2020న ఉత్తర్వులు ఇచ్చింది జగన్ రెడ్డి సర్కార్. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. మంగళగిరి, తుళ్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వారి వివరాలు సేకరించారు అధికారులు. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా తుళ్లూరులో 245 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించామన్న సీఐడీ అధికారులు.. తెల్ల రేషన్ కార్డుదారులపై చీటింగ్, బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 2020 ఫిబ్రవరి 29న టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ పాలనపై నియమించిన సిట్ కూడా అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హడావుడి చేసింది. విజయవాడలోని కొందరు నివాసాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. అయితే జగన్ ప్రభుత్వం విచారణల మీద విచారణలు జరిపిస్తున్నా టీడీపీ నేతలు మాత్రం జంకలేదు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అలాంటిది ఉంటే ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకునేదని టీడీపీ నేతలు చెప్పారు. ఇప్పుడు వాళ్లు చెప్పిందే నిజమైంది. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్ని ఉట్టివేనని తేలిపోయింది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడంతో వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. హైకోర్టు తీర్పుపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామరాజు కృష్ణం రాజు.. జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. సీఐడీ కేసులు పెట్టినప్పుడే అవి చెల్లవని తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఉండదని, అలాంటి వాటిపై కేసులు పెట్టడం కూడా కుదరదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉంటే.. గత 20 నెలలుగా ఎందుకు నిరూపించలేకపోయందని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రఘురామకృష్ణం రాజు.
ఫిబ్రవరిలో సీఎంగా కేటీఆర్! క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్
తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలను స్వీకరించబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మార్చి లోపే కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హింట్ కూడా ఇచ్చారు. తన కుమారుడికి పగ్గాలను అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగాన్ని సిద్దం చేశారని చెప్పారు. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టత ఇచ్చారు. ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రాజేందర్.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఈటెల.. ప్రభుత్వంలోని 99 శాతం పనులకు కేటీఆరే హాజరవుతున్నారని... పలు కార్యక్రమాలకు కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరవుతున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరయ్యారని... దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు బదులుగా .. మంత్రిగా తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈటెల రాజేందర్. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే ముందు కేసీఆర్ మరోసారి యాగం కూడా చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రతువు ముగిసిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కి సీఎంగా పట్టాభిషేకం చేసి, ఆ బాధ్యతల నుంచి కేసీఆర్ వైదొలగుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. యాదాద్రి అలయాన్ని ప్రారంభించడంతో పాటు యాగం చేసిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయడం మంచిదని భావించినట్టు చెబుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ లోనూ కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సీఎం అయితే... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు లేదా ఈటెల రాజేందర్ ను నియమించవచ్చని చెబుతున్నారు. ఇద్దరిని కూడా నియమించే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. గతంలో టీఆర్ఎల్పీ నేతగా పని చేశారు రాజేందర్.
ఆ బ్లాక్బస్టర్ సాంగ్ విడుదలైన 365 రోజులకు సినిమా విడుదల!
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్తో హీరోగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ దగ్గర 'ఆర్య 2', '1.. నేనొక్కడినే' చిత్రాలకు పనిచేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రదీప్ సరసన నాయికగా అమృతా అయ్యర్ నటించారు. కన్నడంలో పలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్.వి. ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. జీఏ2-యువి క్రియేషన్స్ ద్వారా జనవరి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం మీడియా ప్రతినిధులకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... 'నీలి నీలి ఆకాశం' పాట ఇంత బ్లాక్బస్టర్ హిట్టవుతుందని ఊహించారా? ఎలా ఫీలవుతున్నారు? రెండు రాష్ట్రాల ప్రజలు మా సాంగ్ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. నన్నే ఎంతోమంది అడిగారు.. "ఈ సాంగ్ విన్నారా? చాలా బాగుంటుంది.. ఈ సినిమాని కన్నడలో చేయొచ్చు కదా?" అని. నేను కన్నడలో రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటాను కాబట్టి నన్ను తెలిసినవాళ్లందరూ ఆ సాంగ్ గురించి నాకే చెప్పారు. అప్పుడు నేను మొబైల్లో పోస్టర్ చూపించి, అందులో నా పేరు చూపిస్తేనే కానీ అది నా సినిమా అనే విషయం వాళ్లకు తెలీదు. కర్ణాటకలో ఇప్పటి దాకా ఈ సినిమా గురించి మేం పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ సాంగ్ అంత పెద్ద హిట్టవుతుందని మేం ఊహించలేదు. రిలీజ్ చేసినప్పుడు 5 మిలియన్ వ్యూస్ వస్తే చాలనుకున్నాం. అది దాదాపు ఇప్పటికి 278 మిలియన్ వ్యూస్ దాకా వెళ్లింది. ఆ సాంగ్ విషయంలో మా టీమంతా చాలా సంతోషంగా ఉంది. అలాగే మరో పాట కూడా 20 మిలియన్ వ్యూస్ సాధించింది. స్నేహం మీద చేసిన సాంగ్కు సుమారు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నేను కన్నడంలో నిర్మించిన సినిమాల్లోని పాటలెన్నో చాలా పెద్ద హిట్టయ్యాయి. వాటన్నింటినీ మించి ఇంకో మెట్టు పైకి వెళ్లింది ఆ సాంగ్. ఆ సాంగే సినిమా చూడ్డానికి ప్రజల్ని తీసుకొస్తుందనే నమ్మకం మాకుంది. ఆ సాంగ్ మాత్రమే కాదు.. సినిమా మొత్తం చాలా బాగుంటుంది. నిర్మాతగా ఇది నాకు 18వ సినిమా. మిగతా అన్ని సినిమాలకంటే ఈ సినిమా చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను. డైరెక్టర్ కొత్తవాడైనప్పటికీ సినిమా చూస్తే, ఓ కొత్త డైరెక్టర్ ఈ సినిమా చేశాడనిపించదు. ఒక బేబీ లాగా ఈ సినిమాని చూసుకున్నాడు. ఈ సినిమా కోసం పడిన కష్టమంతా దాన్ని చూశాక మర్చిపోయాను. రియల్లీ డైరెక్టర్ మున్నాకు హ్యాట్సాఫ్. ప్రదీప్ గురించి ఏం చెబుతారు? హీరో ప్రదీప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ ఇష్టపడే విధంగా ప్రతి ఫ్రేమ్లో ఆయన నటించారు. ఆయన నటన మా మూవీకి చాలా ప్లస్. ఈ సినిమాకి ప్రధాన బలం కథ. మంచి సెంటిమెంట్, కామెడీ ఉన్నాయి. సినిమా రెండు షేడ్స్లో ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు తమదిగా చేసుకుంటారనే ప్రగాఢ నమ్మకం నాకుంది. ఓటీటీకి ఈ సినిమాని ఎందుకు ఇవ్వలేదు? డిస్కషన్స్ జరిగాయి. కానీ మా సినిమా మీద మాకు చాలా నమ్మకం ఉంది. ప్రదీప్ గారికి ఇది ఫస్ట్ ఫిల్మ్. థియేటర్లలో విడుదల చెయ్యాలనే ఉద్దేశంతోటే నేను ఓటీటీ గురించి ఆలోచించలేదు. హీరో కానీ, డైరెక్టర్ కానీ మీ డబ్బులు మీకు రావాలండీ అన్నారు కానీ, నా ప్రొడక్ట్ మీద నాకున్న నమ్మకం వల్ల ఓటీటీలో నేరుగా రిలీజ్ చెయ్యకుండా థియేటర్లలోనే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. టైటిల్కు, పాటలకు వచ్చిన రెస్పాన్స్ కానీ చూశాక, అంచనాలకు న్యాయం చేసే రీతిలో సినిమా ఉంటుందా? సినిమా విడుదలకు ముందు సాంగ్స్ సూపర్ డూపర్ హిట్టయి, తీరా రిలీజయ్యాక ఫెయిలైన సినిమాలు చాలానే ఉన్నాయి. మేం అనేక విధాలుగా ఆలోచించి, కొన్ని కరెక్షన్స్ కూడా చేశాం. ఈ సినిమాని అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు చూశారు. వాళ్లు ఇష్టపడి వాళ్ల బ్యానర్ మీద ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నేను వెరీ హ్యాపీ. బిజినెస్ విషయంలో ఇది నాకు చాలా హెల్ప్ అయ్యింది. సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయదు. సినిమా చూసిన ప్రేక్షకుడు హాయిగా థియేటర్ నుంచి బయటకు వస్తాడు. అందుకే పాటంత బాగా సినిమా ఉంటుందనే క్యాప్షన్ కూడా వేశాం. టైటిల్ సినిమాకి ప్లస్ అవుతుందా? ఇప్పుడు పదహారు రోజుల్లోనే ప్రేమించేస్తున్నారు. పదిహేడో రోజు విడిపోతున్నారు. ఏ కథైనా ప్రేమ మీదే మొదలవుతుంది. ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ వాళ్లను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఈ సినిమా. అందరూ కూడా వాళ్ల ప్రేమను ఇష్టపడతారు. సినిమా చూసినవాళ్లెవరూ మమ్మల్ని తిట్టుకోరు. ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. సినిమా చూసే ముందు నేను కూడా ఇంత నమ్మకం పెట్టుకోలేదు. డైరెక్టర్ ఏది అడిగితే అది సమకూర్చాం. ఆన్ స్క్రీన్ క్వాలిటీ కావాలనే ఉద్దేశంతో ఏ విషయంలోనూ మేం కాంప్రమైజ్ కాలేదు. ఇండస్ట్రీకి చెందిన పెద్దపెద్దవాళ్లు ఈ సినిమా చూశారు. అందరూ ప్రశంసించారు. మరి ప్రేక్షకులు ఏం చెబుతారో ఈ నెల 29 మార్నింగ్ తెలిసిపోతుంది. సినిమాల్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు? నేను ప్యాషన్తో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను హైస్కూల్లో చదివేటప్పుడు అర్జున్ సర్జా వాళ్ల నాన్నగారు మాకు డ్రిల్ మాస్టారు. అప్పట్లో ఆయన సినిమాల్లో విలన్గా నటించేవారు. ఆయన స్కూలుకు నెలకు పదిహేను రోజులే వచ్చేవారు. నేను అటూ ఇటూ చక్కర్లు కొట్టి ఆయన క్యాబిన్లో ఉండేవాడ్ని. అదొక పిచ్చి నాకు. నేను చిన్నవాడినైనా ఎందుకో తెలీదు, తన కష్టాలను నాతో షేర్ చేసుకొనేవారు. మీరు బాధపడకండి, నేను సినిమా చేస్తాను.. అనేవాడ్ని. అది నా మనసులో ఫీడ్ అయిపోయింది. పెద్దయ్యాక నేను వైజాగ్లో ట్రావెల్ ఏజెన్సీలు నడిపాను. సత్యనారాయణగారికి మా కార్లు కూడా తీసుకెళ్లారు. ఓసారి ఎలా ఉంటుందో చూడాలని నాగార్జున గారికి డ్రైవర్గా కూడా వెళ్లిన సందర్భాలున్నాయి. అప్పట్లో వైజాగ్లో ఉండేవాడ్ని కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి బాగా స్టడీ చేశాను. అయితే ఫస్ట్ సినిమా కన్నడంలో చెయ్యాలనే ఉద్దేశంతో కన్నడంలోనే చేశాను. వేరే బిజినెస్లు ఉన్నప్పటికీ 15 సంవత్సరాల నుంచీ ప్యాషన్తోనే సినిమాలు చేస్తున్నాను. డబ్బు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తున్నాను. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో నాలుగైదు సినిమాలు బ్రేకీవెన్ తెచ్చాయి. మిగతా సినిమాలు రికవబుల్ అయ్యి ప్రాఫిట్స్ తెచ్చాయి. కన్నడంలో చేసిన 'జోష్' అనే సినిమాకు ఓ వంద అవార్డులు దాకా వచ్చాయి. ఆ సినిమాని తెలుగులో 'కెరటం' అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశాం. అది రకుల్ప్రీత్ సింగ్ ఫస్ట్ ఫిల్మ్. నాగార్జునకు డ్రైవర్గా వెళ్లారన్నారు కదా.. ఏం తెలుసుకున్నారు? అది 'కెప్టెన్ నాగార్జున' సినిమా టైమ్లో. ఆ సినిమా షూటింగ్ అరకులో జరిగేటప్పుడు మా కార్లు తీసుకున్నారు. నాగార్జున గారికి ఓ స్పెషల్ కారు కావాలని వెతుకుతున్నారు. అప్పటికే నేను ఓ అంబాసిడర్ కారును ఏసీ చేసి, నాకోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ కారు గురించి తెలుసుకొని అడిగారు. దాన్ని ఏ డ్రైవర్ చేతుల్లో పెట్టననీ, దాన్ని నా సొంతానికి మాత్రమే ఉపయోగిస్తుంటాననీ చెప్పాను. నాగార్జున గారి కోసం అడుగుతున్నామని వాళ్లు చెప్పడంతో, నేనే నడుపుతానని చెప్పి వెళ్లాను. అలా ఏడెనిమిది రోజులు అరకులో ఉన్నాను. ఇన్ని సినిమాలు చేశాక నిర్మాతగా ఏమనిపిస్తోంది? ఎలా మంచి సినిమాలు తీసి, ప్రేక్షకుల్ని మెప్పించాలని ఆలోచిస్తుంటాను. తీసిన సినిమాని ఏ విధంగా రిలీజ్ చెయ్యాలని అని ఆలోచిస్తున్నాను. సినిమా తియ్యడంలో కష్టం 25 శాతమైతే, దాన్ని రిలీజ్ చెయ్యడంలో కష్టం 75 శాతం. మున్నా డైరెక్షన్లో సినిమా తియ్యాలని ఎందుకనిపించింది? భద్రం గారి ద్వారా మున్నా పరిచయమయ్యారు. భద్రం మా ఫ్యామిలీ లాంటివారు. వాళ్ల మామయ్య, నేను బ్రదర్స్ లాగా ఉంటాం. కొత్తవాళ్లతో సినిమా చెయ్యాలని ఉందని భద్రం గారితో అన్నాను. ఆయన మున్నాగారి గురించి చెప్పారు. అదివరకు చాలా మందితో నేను డిస్కషన్లు జరిపాను. మున్నాగారు వచ్చి మా అబ్బాయికి కథ చెప్పారు. తనకు బాగా నచ్చింది. నాలుగు రోజుల తర్వాత నేను విన్నాను. బాగా నచ్చేసింది. హీరో హీరోయిన్లను డైరెక్టరే ఎంపిక చేశారా? అలా ఏమీ కాదు. టీమ్ అంతా చర్చించుకొని హీరో హీరోయిన్లను ఎంపిక చేశాం. హీరోయిన్ కోసం చాలా వెతికాం. అమృతా అయ్యర్ మా ఆఫీస్కు తన ఫొటోలను పంపి ఉంది. ఆ ఫొటోలు నాకు నచ్చి, డైరెక్టర్కు పంపితే, ఆయనకూ హీరోయిన్ క్యారెక్టర్కు ఆమె సరిగ్గా సరిపోతుందనిపించింది. ఆమెది స్వతహాగా బెంగళూరే అయినా తమిళ సినిమాలు చేస్తూ ఉంది. ఈ నెల 22 మీ బర్త్డే కదా? అవునండీ.. కానీ నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం నాకిష్టం ఉండదు. నలభై ఐదేళ్లుగా ఆ రోజు నేను తిరుపతిలో కొండమీదే ఉంటూ వస్తున్నా. భగవంతుడు కూడా అలా చేసేలా నాకు అవకాశం కల్పిస్తున్నాడు. ఆ రోజు ఎంత రష్ ఉన్నా ఏదో ఓ రకంగా తన దర్శనాన్ని ఆరోజు నాకు కల్పిస్తున్నాడు. వేంకటేశ్వరస్వామికి నేను పరమభక్తుడ్ని. నాకున్నదంతా ఆయనదేనని ఫీలవుతుంటా. ఈ బర్త్డేకి మీరు తీసుకోబోతున్న నిర్ణయమేంటి? మళ్లీ తెలుగులోనే సినిమా తియ్యాలనుకుంటున్నాను. లాక్డౌన్ పీరియడ్లో సినిమా గురించి ఏమైనా వర్రీ అయ్యారా? లేదండీ. మా సాంగ్ ఎంతోమందిని ఎంటర్టైన్ చేసిందని హ్యాపీ ఫీలయ్యాను. ఆ టైమ్లోనే మా 'నీలి నీలి ఆకాశం' పాటను 25 కోట్ల మంది ఎంజాయ్ చేశారు. భాషతో నిమిత్తం లేకుండా ఆ పాటను విన్నారు. లాక్డౌన్ టైమ్లో బెంగళూరులో పోలీసులు చాలా కష్టపడ్డారు. వాళ్ల కోసం ఓ వీడియో సాంగ్ చేయించాను. దాంతో పాటు వాళ్లు 'నీలి నీలి ఆకాశం' సాంగ్ను వింటూ రావడం నేను చూశాను. ఆ పాటను వాళ్లు ఆస్వాదించారనే హ్యాపీనెస్ నాలో ఉంది. ఇలాంటి పాటలను ఇచ్చిన అనూప్ రూబెన్స్ గురించి ఏం చెబుతారు? ఆయనకు హ్యాట్సాఫ్. ఓ కన్నడ సినిమాను ఇస్తానని ఆయనకు ప్రామిస్ చేశాను. మా డైరెక్టర్, ఆయనా ఆలుమగల్లాగా అయిపోయారు. వాళ్లు కలిసి ట్రావెల్ చేస్తారనుకుంటున్నా. 50 శాతం ఆక్యుపెన్సీలో ఎన్ని థియేటర్లు వస్తాయనుకుంటున్నారు? మాగ్జిమమ్ థియేటర్స్ వస్తాయని ఆశిస్తున్నాం. మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్ని థియేటర్స్ అనేది క్లారిటీ వస్తుంది. వీలైనన్ని థియేటర్లలో రిలీజ్ చెయ్యాలని మేం ప్లాన్ చేస్తున్నాం. మీ దృష్టిలో సినిమాలోని హైలైట్స్ ఏమిటి? నాకైతే కథ విన్నప్పటి కంటే సినిమా చూశాక మంచి ఫీల్ కలిగింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెంటిమెంట్ ఆడియెన్స్ మనసుల్ని కదిలిస్తుంది. యాక్టర్ల పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. ఇక సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా! తెలుగు, కన్నడ ప్రేక్షకుల మధ్య మీరు గమనించిన తేడా? తెలుగు, తమిళ ప్రేక్షకులు సినిమాని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. కన్నడంలో అలా కాదు. ప్రస్తుతం ఏ కన్నడ ప్రొడ్యూసర్ కూడా ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చెయ్యట్లేదు. 'కేజీఎఫ్'తో కన్నడ సినిమా కూడా ప్యాన్ ఇమేజ్ తెచ్చుకోవడం ఎలా అనిపిస్తోంది? మా హీరోలు కూడా ఎక్కడికో వెళ్లిపోతున్నారంటే హ్యాపీయే కదా. యశ్ నాకు బాగా తెలుసు. వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆయన మిసెస్ రాధికా పండిట్తో నేను పెద్ద సినిమాలు చేశాను. ఆయన చాలా కష్టపడి పైకొచ్చాడు. ఆయన ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవడం గర్వంగా ఫీలవుతున్నాం. ఇప్పటివరకూ కన్నడ మార్కెట్ హయ్యెస్ట్ రూ. 60 కోట్లు. రిలీజ్కు జనవరి 29 డేట్ ఎందుకు ఎంచుకున్నారు? 'నీలి నీలి ఆకాశం' పాటను మేం 2020 జనవరి 30న రిలీజ్ చేశాం. అంటే జనవరి 29కి ఆ పాట విడుదలై 365 రోజులన్న మాట. అలా విడుదల తేదీ కుదిరింది. కావాలని ఆ రోజును ఎంచుకోలేదు. కాకతాళీయంగా ఆ రోజును ఎంచుకున్నాం. మా ప్రదీప్ గారే ఆరోజుకు పాట విడుదలై 365 రోజులవుతుందని గుర్తు చేశారు. మా ప్లాన్కు తగ్గట్లు ఏదీ జరగలేదు. తనకేం కావాలో సినిమాయే ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. నిజానికి ఫిబ్రవరి 5న రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల జనవరి 29కి వచ్చింది.
ఈ సమ్మర్ దగ్గుబాటి స్టార్స్ తోనే..
కథానాయికగా ప్రియమణిది 18 ఏళ్ళ ప్రాయం. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిగా సత్తా చాటింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. పెళ్ళయ్యాక కూడా సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రియమణి.. ఈ వేసవిలో తెలుగునాట రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో సందడి చేయనుంది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ దగ్గుబాటి స్టార్సే హీరోలు. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ అసురన్ ఆధారంగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్పలో ప్రియమణి నాయికగా నటిస్తోంది. ఇక దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న పిరియడ్ డ్రామా విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో దర్శనమివ్వనుంది ప్రియమణి. ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం వేసవిలోనే సందడి చేయనున్నాయి. మరి.. దగ్గుబాటి వారి బాబాయ్ - అబ్బాయ్ చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే నటిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ కి ఆయా చిత్రాలు ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి. నారప్పకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా.. విరాటపర్వంని వేణు ఊడుగుల రూపొందిస్తున్నాడు.
రవితేజ బర్త్ డేకి ఖిలాడి ట్రీట్ అదే!
రాజా ది గ్రేట్ తరువాత ట్రాక్ తప్పిన మాస్ మహారాజా రవితేజ కెరీర్.. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ క్రాక్ తో మళ్ళీ సక్సెస్ రూట్ లోకి వచ్చేసింది. ఒకవైపు ఈ ఘనవిజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఖిలాడి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు రవితేజ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 26 రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఖిలాడి టీజర్ రాబోతుందంటూ ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే, ఆ రోజు టీజర్ కాకుండా గ్లిమ్స్ ఆఫ్ ఖిలాడి పేరిట ఓ వీడియో రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రమేష్ వర్మ తాజాగా తన ట్విట్టర్ లో ప్రకటించాడు. మాస్ మహారాజా రవితేజ బర్త్ డే స్పెషల్ గా గ్లిమ్స్ ఆఫ్ ఖిలాడి రాబోతుందంటూ అప్ డేట్ ఇచ్చేశాడు. మరి.. ఈ గ్లిమ్స్ లో ఏముంటుందో తెలియాలంటే జనవరి 26 వరకు వేచిచూడాల్సిందే. ఖిలాడిలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
బోల్డ్ రోల్లో హద్దు దాటిన అనుపమ
ఇన్నాళ్ళు పద్ధతిగా ఉండే పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. తొలిసారి కాస్త హద్దు దాటి బోల్డ్ రోల్ లో దర్శనమిచ్చింది. అయితే అదేదో సినిమా కోసమో, వెబ్ సిరీస్ కోసమో కాదు. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం. 29 నిమిషాల నిడివి ఉన్న ఆ లఘు చిత్రం పేరు.. ఫ్రీడమ్ @ మిడ్ నైట్. రెండే రెండు పాత్రలతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ.. ఆరేళ్ళ పాపకు తల్లిగా గృహిణి పాత్రలో కనిపించింది. ఛాట్ విండోస్, వర్చువల్ హ్యాపీ నెస్, సెక్స్ విత్ స్ట్రేంజర్.. ఇలాంటి వాటికి అలవాటు పడ్డ భర్తని ప్రశ్నిస్తూ.. తనకూ అలాంటి వాటిని కోరుకునే ఫ్రీడమ్ కావాలంటూ అడిగే చంద్ర పాత్రలో నటించింది అనుపమ. షార్ట్ ఫిల్మ్ మొత్తం చీరకట్టులోనే కనిపించినా.. అక్కడక్కడ 'F*' పదాలతో షాక్ ఇచ్చింది. ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనూ అస్సలు తగ్గలేదు. భర్తలకు కనువిప్పు కలిగించేలా తెరకెక్కిన ఈ లఘుచిత్రాన్ని తన అభినయంతో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. నటిగా అదరగొట్టిందనే మార్కులు దక్కించుకుంది. తెలుగు, మలయాళ భాషల్లో యూట్యూబ్ ముంగిట అందుబాటులో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ తో.. అనుపమ దశ, దిశ మారిపోతాయేమో చూడాలి. ప్రస్తుతం అనుపమ.. నిఖిల్ హీరోగా నటిస్తున్న 18 పేజెస్ లో నటిస్తోంది. కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఫైనల్గా పవన్తో చిందులేయనున్న రంగమ్మత్త?
2018 నాటి బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ జాతకమే మారిపోయింది. ఆ పిరియడ్ డ్రామాలో తను పోషించిన రంగమ్మత్త పాత్రతో.. నటిగా తన ప్రతిభ ఏంటో చెప్పకనే చెప్పింది. కట్ చేస్తే.. ఆ సినిమా తరువాత పలు ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది అనసూయ. రంగస్థలం తరువాత ఎఫ్ 2 వంటి మల్టిస్టారర్ మూవీలో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ఖిలాడితో పాటు రంగమార్తండ, వేదాంతం రాఘవయ్య సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితోనూ ఓ తమిళ చిత్రం చేయబోతోంది. ఇదిలా ఉంటే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశం అనసూయకు దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న పిరియడ్ డ్రామాలో ఒకట్రెండు సన్నివేశాలతో కూడిన ఓ ప్రత్యేక గీతంలో అనసూయ దర్శనమివ్వనుందట. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ పాట.. సదరు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే పవన్ - క్రిష్ కాంబో మూవీలో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్ ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోనే అనసూయ ఇట్స్ టైమ్ టు ద పార్టీ సాంగ్ చేయాల్సింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేసే అవకాశం వదులుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత పవన్ తో నర్తించే అవకాశం దక్కడం వార్తల్లో నిలిచే అంశమే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...
* దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో.... * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా.... * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు.. * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం .... జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు. రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి , ఇలా మాయమైపోయే జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్ ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు. ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు బీ జె పి, జన సేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి. ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం. ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.
కవిత, షర్మిలా రాజ్యసభకు వెళ్తారా?
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచనే ఎలా వుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? కవితా రాజ్యసభకు వెళ్తారా? అయితే హరిష్రావు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు. రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, మాజీీ స్పీకర్ కె.ఆర్.సురే్షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్సఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం. కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది. షర్మిల ఆపద సమయంలో జగన్కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట. కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి. అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది. ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది. ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు. మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు. ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!! తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి. ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
జంతువులూ మనిషి సాయాన్ని కోరతాయి
మనిషికి ప్రకృతి మీద చాలా ఆధిపత్యమే ఉండి ఉండవచ్చు. కానీ తన మనుగడ కోసం అతను ఇతర జంతువులు మీద ఆధరపడక తప్పలేదు. ఇప్పుడంటే అన్ని రకాల పనులకీ, అన్ని రకాల యంత్రాలు వచ్చేశాయి. కానీ ఒకప్పుడు కుక్కలు, గుర్రాలు, ఆవు లాంటి జీవుల సాయం లేకుండా మనిషి జీవితం గడిచేది కాదు. మనిషి ఎలాగైతే ఇతర జీవుల మీద ఆధారపడ్డాడో, మనిషి మచ్చికకు అలవాటు పడిన జీవులు కూడా అతని మీద ఆధారపడ్డాయని శాస్త్రవేత్తల వాదన. పైగా అతని చర్యలని అర్థం చేసుకోవడాన్ని అవి అలవాటు చేసుకున్నాయనీ వారి నమ్మకం. అందుకు అనుగుణంగానే కుక్కల మీద చేసిన కొన్ని పరిశోధనలలో, అవి తమ యజమానుల హావభావలను అద్భుతంగా అర్థం చేసుకోగలవని తెలిసింది. అలా తమ యజమాని మనసు ఎరిగి మసులుకోవడం వల్లే కుక్కలు మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువుగా నిలిచిపోయాయట. కుక్కల సంగతి సరే! మరి జంతువుల మాటేంటి! అన్న అనుమానం వచ్చింది జపానుకి చెందిన కొందరు పరిశోధకులకి. ఎందుకంటే దాదాపు ఆరువేల సంవత్సరాలుగా మనిషి గుర్రాలను మచ్చిక చేసుకుంటూనే ఉన్నాడు. ఇన్నేళ్లలో వారిమధ్య ఏదో ఒక బంధం ఏర్పడకపోదు కదా! అందుకనేనేమో గుర్రపు స్వారీ చేస్తూ ఉండటం వల్ల మనిషి మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంగా ఉంటాడని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మరి గుర్రాలు మనిషిని ఏమేరకు అర్థం చేసుకోగలుగుతున్నాయి! అన్న ఆలోచనతో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. పరిశోధకులు ఒక గుర్రపుశాలలోని ఓ బకెట్లో కొంత ఆహారాన్ని ఉంచారు. ఆహారం ఎక్కడ ఉంది అన్న విషయం గుర్రానికి తప్ప దాని సంరక్షకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఎప్పుడైతే సంరక్షకుడు ఆ గుర్రాన్ని చేరుకున్నాడో, గుర్రం అతడిని ఫలానా చోట ఆహారం ఉంది... అది నాకు అందించు అన్నట్లుగా అతడిని ఆహారం దిశగా తోస్తూ అనేక హావభావాలను ప్రదర్శించింది. ఆ తరువాత ఇదే ప్రయోగాన్ని మరోవిధంగా చేశారు. ఈసారి ఆహారం ఎక్కడ ఉందో సంరక్షకుడికి కూడా తెలిసేలా జాగ్రత్తపడ్డారు. అప్పుడు కూడా గుర్రం తనకి ఆహారం అందించమంటూ సంజ్ఞలు చేసింది కానీ... ఆ సంజ్ఞలలో మునుపటి తీవ్రత లేదు. అంటే తన సంరక్షకుడిని నిశితంగా గమనించడం ద్వారా అతనికి ఆహారం గురించి తెలుసో లేదో అన్న విషయాన్ని కూడా గుర్రాలు గ్రహించగలుగుతున్నాయన్నమాట. జీవి మనుగడ సాగించేందుకు ఈ నేర్పు చాలా అవసరం అంటున్నారు పరిశోధకులు. చింపాంజీల వంటి ఉన్నతశ్రేణి జీవులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తన ఎదురుగా ఉన్న జీవి హావభావాలను బట్టి, అతను చూసే చూపుని బట్టి... అతనికి ఒక విషయం తెలుసా లేదా! అతను ఏదన్నా ప్రమాదాన్ని పసిగడుతున్నాడా అన్న విషయాన్ని అవి గ్రహించగలుగుతాయి. ఇంతకీ పోయిపోయి గుర్రాల మీద ఈస్థాయి పరిశోధనలు చేయడం వల్ల ఉపయోగం ఉందా అంటే లేకం అంటున్నారు పరిశోధకులు! మనిషికి దగ్గరగా ఉండటం వల్ల పెంపుడు జంతువుల గ్రహణశక్తిలోనూ, ప్రవర్తనలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో గ్రహించడం వల్ల మనిషికీ, అతను మచ్చిక చేసుకున్న జంతువులకి మధ్య సంబంధాన్ని గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చునని అంటున్నారు. - నిర్జర.
మొబైల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏముంది! ఒక దశాబ్ద కాలంలోనే మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగంగా మారిపోయింది. అన్నింటికీ మొబైల్ ఫోన్లనే వాడుకోమంటూ ఏకంగా నగదుని కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఒక సమాచార సాధనం మాత్రమే కాదు.. ఏ పనిలో అయినా తోడుగా ఉండే ఓ నేస్తం. మన హోదాకి సైతం ఓ సంకేతం! అందుకనే కొత్త మొబైల్ను ఎన్నుకొనేటప్పుడు ఆచితూచి ఎన్నుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఎంపికలో మన మనస్తత్వం కూడా బయటపడుతుందా! అంటే అవుననే జవాబు వస్తోంది. ఇంగ్లండులోని లాంకెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లని వాడేవారి మనస్తత్వాల మధ్య తేడాలు ఏమన్నా ఉన్నాయేమోనని పరశీలించారు. అందులో... ఆండ్రాయిడ్ ఫోనుని ఇష్టపడేవారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి- - మగవారు ఎక్కుగా ఈ ఫోనుని ఇష్టపడుతున్నారు. - అందులోనూ పెద్దలు ఆండ్రాయిడ్ ఫోన్లంటే ఆసక్తి చూపుతున్నారు. - ఆండ్రాయిడ్ వాడకందారులు సమాజానికి అనుగుణంగా నడుచుకునే మనస్తత్వం కలిగి ఉంటారట. - వ్యక్తిగత లబ్ది కోసం ఇతరులను ఇబ్బంది పెట్టనివారై ఉంటారు. - సంపద, హోదా వంటి తాపత్రయాల జోలికి పోరు. - నిజాయితీగా ఉండేందుకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ఐఫోను వాడకందారులలో ఈ స్వభవాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి- - యువకులు ఎక్కువగా ఫోనుని ఇష్టపడుతున్నట్లు తేలింది. - యాండ్రాయిడ్తో పోల్చుకుంటే ఆడవారి మనసు ఐఫోను మీదే లగ్నమవుతుందట. - ఒక వస్తువుని ఎంచుకునే విషయంలో వీరు ఇతరులతో రాజీపడరు. - వీరు ఫోనుని ఒక సాధనంగానే కాకుండా, తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. - బహిర్ముఖ మనస్తత్వంతో (extrovert) అందరితో కలివిడిగా కలిసిపోయేలా ప్రవర్తిస్తుంటారు. ఈ వివరాలన్నింటి ఆధారంగా పరిశోధకులు ఒక ప్రోగ్రాంను కూడా రూపొందించేశారట. దానికి మన మనస్తత్వానికి సంబంధించిన కొన్ని వివరాలను అందిస్తే, మనం ఏ ఫోనుని వాడుతున్నామో చెప్పేస్తుంది. మనం వాడుతున్న ఫోను మన జీవితంలో విడదీయరాని భాగం అయిపోయింది కాబట్టి... దానిని మన మనస్తత్వానికి ఒక డిజిటల్ రూపంగా భావించడంలో తప్పులేదంటున్నారు. అందుకనే మున్ముందు జనం డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్లని బట్టి కూడా వారి మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రయత్నం చేయవచ్చునని అంటున్నారు. - Nirjara
16 నెలలు చిప్ప కూడు తిన్నా బుద్ది మారలేదు.. విజయసాయిరెడ్డికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "16 నెలలు చిప్పకూడు తిన్నా జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి బుద్ధి మారలేదు. అదే దొంగ బతుకు ఇంకెన్నాళ్లు? ఇంకెంత కాలం మీ ఫేక్ ప్రచారం? అందుకే మిమ్మల్ని ఫేక్ గాళ్ళు అనేది'' అంటూ అయ్యన్న మండిపడ్డారు. ''శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పట్టణంలో పాలేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న 3 రోడ్ల జంక్షన్ వెడల్పు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి దిమ్మ కూడా అప్పుడే ఏర్పాటు చేసారు. పాలేశ్వరస్వామి దేవాలయం ధర్మకర్తలు చెట్టు దగ్గర ఉన్న పాత నంది విగ్రహాన్ని ఆ దిమ్మపై ప్రతిష్టించారు'' అని అయ్యన్న వివరించారు. అయితే ''నంది విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టడానికి వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మొదలుపెట్టారు. గ్రామస్తుల సమక్షంలో అందరూ చూస్తుండగానే విగ్రహ ప్రతిష్ఠ జరిగితే సిసి టివి ఫుటేజ్ అంటూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?'' అని అయన ఈ సందర్భంగా ఎంపీని నిలదీశారు. అసలు ''జరిగింది విగ్రహ ప్రతిష్ఠ అయితే టిడిపి నేతలు విగ్రహం ధ్వంసం చేసారంటూ ఫేక్ ప్రచారం ఏంటి సాయిరెడ్డి? హిందూ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసానంటూ ప్రకటించిన వాడిని, వాడి వెనుక ఉన్న మత మార్పిడి మాఫియా పెద్దలను తప్పించడానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ధర్మమే గెలుస్తుంది. తప్పు చేసిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అన్న విషయం జగన్ రెడ్డి కి బాగా తెలుసు కదా'' అని అయ్యన్న పేర్కొన్నారు. అయితే అంతకుముందు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లో ''మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయ ఉనికి కోసం నీచానికి తెగబడుతోంది పచ్చపార్టీ. టెక్కలిలో శివాలయంలో ఉన్న నంది విగ్రహం తొలగింపే దీనికి ఉదారహరణ. ఇది చాలు రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుకున్నవారెవరో చెప్పడానికి? సీసీ కెమెరా దృశ్యాలపై చంద్రన్న, అచ్చన్నా ఏమంటారు?'' అంటూ ఒక వీడియోను జత చేశారు.
అనంతలో ఆగని వైపీపీ నేతల అరాచకాలు! కంకర క్రషర్పై ఎమ్మెల్యే తనయుడి దాడి!
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రజా ప్రతినిధులే స్వయంగా దాడులకు పాల్పడుతుండటంతో ఇతర నేతలు, కార్యకర్తలు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల వరుసగా జరిగిన దాడి ఘటనలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపగా.. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలోని ఓ కంకర క్రషర్పై దాడి చేశారు. 20 ద్విచక్ర వాహనాల్లో వచ్చిన దాదాపు 30 మంది దుండగులు బీభత్సం సృష్టించారు. కంప్యూటర్ గది, జేసీబీలను ధ్వంసం చేశారు. క్రషర్లో పనిచేస్తున్న కార్మికులపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కాగా కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కార్మికులు ఫిరోజ్, సద్దాం, ఇజ్రాయెల్, తిమ్మేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాయదుర్గం అర్బన్ సీఐ వీరన్న ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు అనుచరులతో కలిసి దాడికి పాల్పడినట్లు క్రషర్ యజమాని లక్ష్మీదేవి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
నాకో న్యాయం.. నా బావమరిదికో న్యాయమా.. జేసీ ప్రభాకర రెడ్డి సూటి ప్రశ్న
ఏపీలోని పోలీసు అధికారుల సంఘం, వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండి పడ్డారు. నా భార్య సోదరుడు అయిన ప్రసన్నకుమార్రెడ్డి.. 3 సార్లు ఎస్పీని దూషిస్తే ఇప్పటివరకు కేసుల్లేవు. కానీ నేను ఏమీ మాట్లాడకపోయినా కడప జైలు నుంచి వస్తుంటే, నేను ఏదో అన్నానని పోలీసు అధికారుల అసోసియేషన్ అంటోంది. కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. "నాకో న్యాయం?… నా బావమరిదికో న్యాయమా? జెండా ఒక్కటే డిఫరెన్స్. నాది పచ్చది.. వాళ్ళది బ్లూ కలర్" అని వ్యాఖ్యానించారు. "పోలీస్ అసోసియేషన్ ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని రోజులు సజ్జల చేతుల్లో ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ఐఏఎస్ ఆఫీసరా? సాక్షి పేపర్లో అయన కథలు రాసుకునే వాడు. కథలు రాసేవాడు పోలీసులను ఆదేశిస్తే.. మీరెందుకు ఐఏఎస్, ఐపీఎస్ అవసరమా? ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారు. మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇకనైనా మారండి. అసలు మీరెవ్వరు మా ఇంట్లోకి రావడానికి.. మా ఇంట్లోకి వచ్చి మరీ మాపై కేసులు పెడతారా? పోలీసు అసోసియేషన్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో రూలా?" అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి పోలీస్ వ్యవస్థను నిలదీశారు.
టైప్ 2 డయాబెటిస్ రోగులు రోసి గ్లిటజోన్ వాడటం ప్రమాదకరం
టైప్ 2 డయాబెటిస్ రోగులు తీసుకునే రోసి గ్లిటజోన్ వాడకం వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు వస్తాయి. రోసి గ్లిటజోన్ మందు టైపు 2 డయాబెటిస్ కోసం తయారు చేసిన మందుగా వైద్యులు పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం 1999 లో అనుమతించింది. యూరప్ ఈ మందును సస్పెండ్ చేసింది. ఈ మందు వాడకం వల్ల గుండెపై ప్రభావం పడుతుందన్న కారణం చేత వాడకాన్ని తగ్గించింది. ఈ మందు వాడకంపై ఇప్పటికే బిఎంజే పరిశోధనలు ప్రారంభించింది. ఈ మందు అత్యంత ప్రమాదకరమని 43 % హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తీస్తుందని 2007 లో వెలువరించింది. 2010 లో యూరప్ నిషేదించింది. మనం వాడే మందులు సరైనవో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.. లేదంటే ముప్పేనని అంటున్నారు వైద్యులు.
నిద్రలేమి సమస్య గుండె జబ్బుకి దారితీస్తుంది
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? సమస్య తీవ్రమైతే మీ గుండెకి ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి నిద్ర పోవడం కొందరికి సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి కొందరు పుస్తకాలను, మరికొంతమంది కంప్యూటర్ ను, కొంతమంది సెల్ ఫోన్లలను ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరు అనారోగ్యంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అలా నిద్రలేని రాత్రులు గడిపేవాళ్లకు గుండె జబ్బు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి- గుండెజబ్బు వంటి అంశాలపైన పరిశోధనలు జరిపిన వైద్యులు ఒక రిపోర్టును అందించారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారని అన్నారు. 50% గుండె సమస్యలకు, గుండె నొప్పికి నిద్రలేమి సమస్యలే కారణమని వెల్లడించారు. అమెరికన్ హార్ట్ జనరల్ ప్రచురించిన జర్నల్లో గుండె నెప్పి తర్వాత నిద్రలేమి వల్ల వచ్చేసమస్యలు అత్యధికమని పేర్కొన్నారు. నిద్రలేమి సమస్య వల్ల ఊపిరి ఆగిపోవడం దీనినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. నాలుక లేదా గొంతు వద్ద శ్వాస నాలం పూడుకు పోతుందని వివరించారు. దీనివల్ల శ్వాస ప్రసరణలో మార్పులు వస్తాయని, కొందరు వ్యక్తులకు గురక వస్తుందని ఇది నిద్రలేమికి కారణంగా పరిశోధనలో తేలిందని వివరించారు. కొన్ని సెకండ్లలో 70% మందికి గుండె నొప్పికి కారణంగా తేల్చారు. గురక, లేదా శ్వాస ఆగిపోవడం కొన్నిసెకండ్ల పాటు ఉంటుందని పేర్కొన్నారు. శ్వాస ఆడక నిద్రలేమి సమస్యకు కారణంగా చెప్పవచ్చు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా తో తీవ్రంగా బాధ పడుతున్న వారు గంటకు 30 కంటే ఎక్కువ సార్లు నిద్రాభంగం కలిగినప్పుడు దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని డాక్టర్ సందీప్ కోట్ విశ్లేషించారు. సరైన నిద్రతో మరల శక్తిమంతులుగా మారవచ్చని, శ్వాసలో పెనుమార్పులు రావడం వల్ల శరీర ఆకృతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా రక్త ప్రసారంలో ఒత్తిడి పెరగడం గమనించవచ్చని డాక్టర్ సందీప్ కోట్ తెలిపారు. దీనివల్ల హై బీపీ, పెరుగుతుందని దీనివల్లే నిద్రలేమి గుండె సమస్యలు విషయం కొందరు గుర్తించరని, బీపీ వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయం గ్రహించాలన్నారు. స్థూల కాయం నిద్రలేమి ఒకదానికొకటి ముడిపడి ఉందని ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో గుండె సమస్య తప్పకుండా ఉంటుందని విశ్లేషించారు.
Influence Of Daily Life Habits