ఏర్పేడు ప్రమాదం వెనుక కుట్ర..

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన లారీ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి. ఆ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది ప్రమాదం కాదని, ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారని అన్నారు. దీని వెనుక ఇసుక మాఫియా హస్తముందన్నారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, చిత్తూరు జిల్లాలో 100 చోట్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ధనుంజయ నాయుడిపై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. నిజానిజాలు బయటకు రావాలంటే ఏర్పేడు ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేశారు.