మౌనమేలనోయి...ఈ మరపురాని రోజు

 

అటు కేంద్ర సహకారం లేక, ఇటు రాష్ట్రంలోనూ మోర పెట్టుకొనేందుకు నాధుడు లేక, తెరాస బాధితులయిన తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ మరోమారు సమావేశమయ్యి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకోవడానికి సిద్దం అవుతున్నారు.

 

ఇంతవరకు ఏ తెరేసాతో వారందరూ అంటకాగేరో ఇప్పుడు అదే తెరాస నాయకులు తమను చీము నెత్తురు, సిగ్గు శరంలేని నాయకులని తిడుతున్నా కూడా వారు తమ పదవులను వదులుకొంటామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇంతకీ వారు తమ పదవులకి ఎందుకు రాజీనామా చేలేకపోతున్నారు? వారిని తమ పదవులని, పార్టీని వదిలిపెట్టనీయకుండా ఏమి అడ్డుపడుతోంది? పైకి చెప్పుకోలేని కారణాలు వారికి చాలానే ఉన్నాయి. వాటి గురించి తెరాస నేతలకు స్పష్టంగా తెలిసినప్పటికీ, తెలియనట్లు నటిస్తూ వారిని పదవులు వదులుకోమని, వారికి తమ మద్దత్తు ఉంటుందని చెపుతున్నారు. అయితే ఇంతకీ ఆ బలమయిన కారణాలేమిటి?

 

తెరాస, జేయేసీ నేతల తిట్లకి ఉద్రేకపడి తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పదవులను వదులుకొంటే మొదట నష్టబోయేది తామేనని వారందరికీ బాగా తెలుసు. ఆపని చేసిననాడు తమపై ఆధారపడిన ప్రభుత్వం కూలిపోవడం తధ్యం. తద్వారా పార్టీ అధిష్టానానికి కోపం తెప్పించడం, అది కూడా ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మంచిదికాదని వారికి తెలుసు. తెలంగాణాలో తెరాసా తప్ప వేరే ప్రత్యమ్నాయ పార్టీ లేకపోవడం, తెదేప, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలలో జేరడానికి మనస్కరించకపోవడంవల్ల, మాట నిలకడలేని చంద్రశేకర్ రావును నమ్ముకోవడం కంటే, తమ పార్టీ అధిష్టానాన్ని నమ్ముకోవడమే మంచిదనే ఆలోచనతో వారు వెనకంజ వేస్తుండవచ్చును. ఒకవేళ దైర్యం చేసి పార్టీని వదిలిపెడితే, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి తప్ప వేరెవరికీ తలవంచనవసరం లేనంతగా స్వేచ్చ అనుభవించిన తాము, తెరాసాలో కేసీర్ కు, అతని కుటుంభానికి సలాములు చేస్తూ బ్రతకడం కష్టమని గ్రహింపుతోనే వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా అడుగువేయలేకపోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా తెలంగాణాలో తెరాస కాకుండా మరో బలమయిన పార్టీ ఏదయినా ఉండిఉంటే తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎప్పుడో రాజీనామాలు చేసేసి పార్టీ వదిలిపెట్టేవారు.

 

ఇక మరో బలమయిన కారణం ఏమిటంటే, ప్రస్తుతం పార్టీ అధిష్టానం తెలంగాణా సమస్యని పరిష్కరించేందుకు నిజాయితీగా ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ తరుణంలో, కేసీర్ వంటి వారి మాటలకులొంగి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం కంటే, మరి కొంత కాలం ఒపికపడితే, పార్టీ తెలంగాణాగానీ ప్రకటిస్తే, పరిస్థితులు అన్ని చక్కబడుతాయనే నమ్మకంవల్లనే వారు తమ పదవులను అంటిపెట్టుకొని ఉండేలా చేస్తుండవచ్చును.

 

పదవి లేన్నప్పుడు తమ స్వంత పార్టీ వారికే కాకుండా తెలంగాణా ఉద్యమనేతలకి కూడా అలుసుగానే కనిపిస్తారనేది మరో చేదు నిజం. ఒకవేళ పార్టీ అధిష్టానం తెలంగాణా ఇచ్చినట్లయితే, తమ పార్టీలోనే తెరాస విలీనమయితే, అప్పుడు పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకి పార్టీలోకి కొత్తగా వచ్చిన కేసీర్, కేటీర్,హరీష్ రావువంటి వారిపై తమదే పైచేయి అవుతుంది, వారికి తాము సలాములు చేస్తూ బ్రతుకవలసిన అగత్యం కూడా ఉండదనే ఆలోచన కూడా తెలంగాణా కాంగ్రెస్ నేతలను పార్టీకి, పదవులకి అంటిపెట్టుకు ఉండేలాచేస్తోందని భావించవచ్చును. కానీ, ఇటువంటి ఆలోచనలను పైకి చెప్పుకొనే అవకాశం వారికి లేదు గనుక మౌనంగా నిందలు భరిస్తున్నారు.