కరోనా లక్షణాలున్నా డ్యూటీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో ఉన్న ఉద్యోగులు, పోలీసులు కరోనా భారీన పడుతున్నారు. అయితే పోలీసులతో ఉన్నతాధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ లక్షణాలున్నా బలవంతం డ్యూటీలు చేయిస్తున్నారని చెబుతున్నారు. అనారోగ్యంతో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల పరిస్థితి తీవ్రంగా మారుతుందని తెలుస్తోంది. 

తాడిపత్రికి చెందిన ఓ కానిస్టేబుల్ సెల్పీ విడియో ఉన్నతాధికారుల వైఖరిని బట్టబయలు చేస్తోంది. ఓ కానిస్టేబుల్ కు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ నెల 20న కరోనా పరీక్షలు చేయించుకున్న కానిస్టేబుల్ గణేష్‌కు ఎస్ఐ ఖాజాహుస్సేన్ కోర్టు డ్యూటీ వేశారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. తాను కోవిడ్  బారిన పడినా ఎస్‌ఐ ఖాజా హుస్సేన్ ట్రాఫిక్ డ్యూటీ వేసి వేధించారంటూ గణేష్ అంబులెన్స్‌లో నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలను ఎస్ఐలు పట్టించుకోవడం లేదని, ఒకవేళ తాను చనిపోతే.. తన చావుకు ఎస్ఐ ఖాజా హుస్సేన్ కారణమంటూ కానిస్టేబుల్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

కానిస్టేబుల్ సెల్పీ వీడియో వైరల్ గా మారింది. వీడియోను చూసిన వాళ్లు కంట తడి పెడుతున్నారు. పోలీసుల జీవితాలతో ఉన్నతాధికారులు ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఇంత కర్కశంగా వ్యవహరించడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News