సెప్టెంబర్ 5న డిఎస్సీ నోటిఫికేషన్

 

సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆరోజు గురుపూజోత్సవం కావడం విశేషం. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీలో ఖాళీగా వున్న 10,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

 

1. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు కార్పొరేట్ పాఠశాలలకు మించి వుండేలా చర్యలు.

 

2. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు, ఉపాధ్యాయుల హాజరును కచ్చితంగా పర్యవేక్షించడానికి బయో మెట్రిక్ విధానం అమలు. ఈ విధానం మొదటగా ప్రయోగాగత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు.

 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు.

 

4. రానున్న రోజుల్లో రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం విద్యకే కేటాయింపు.