అయేషా కేసు.. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది..
posted on May 2, 2017 10:55AM
.jpg)
ఆయేషా మీర హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే. ఇక ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన సత్యంబాబు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సత్యంబాబు మాట్లాడుతూ.. పోలీసులు అన్యాయంగా నన్ను కేసులో ఇరికించారని.. ‘మా అమ్మను, చెల్లిని చంపేస్తామని, ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే నేను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నాను’అని చెప్పాడు. తనను అరెస్టు చేసి, వారం రోజులు తీవ్రంగా కొట్టారని.. ఆ దెబ్బలకే తన కాళ్లు చచ్చుబడి పోయాయని, జైలులో ఉండి చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి బాగయ్యాయని తెలిపారు. కానీ ఈ కేసులో మొదటి నుండి అయేషా తల్లిదండ్రులు నేను నిర్ధోషిననే చెబుతున్నారు... వారే నాకు అండగా నిలిచారు.. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.
ఇక తన చదువు గురించి చెబుతూ.. జైల్లో ఉండే చదువుకొని డిగ్రీ పూర్తి చేశాను.. భవిష్యత్తులో ఎంఏ పూర్తి చేసి... ఆ తర్వాత ప్రస్తుత రాజకీయాలపై పీహెచ్డీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ వర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టా అందుకున్నారు.