పరకాలలో గెలిచిన వాదం ఏది?
posted on Jun 18, 2012 10:48AM
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో సమైక్యతాపార్టీలే గెలుపొందాయి. దానికి తాజా ఉదాహరణ చావుతప్పి కన్నులొట్టబోయిన టి.ఆర్.ఎస్. మెజార్టీయే. అదీ వెయ్యి ఐదొందల చిల్లర ఓట్లు మాత్రమే. ఈ ఫలితాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించిన విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పై అనవసరంగా చేతకాని వెయ్యిగొంతులు ఎకబికిన విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ప్రణాలికే లేని తెలంగాణా పార్టీలకు, ఉద్యమ సారధులకు ఉన్నది మాట్లాడితే ఉలుకు అన్నట్లుంది ఎంపి పొన్నం ప్రభాకర్ వైఖరి. ఆయన తన సిగ్గులేనితనాన్ని లగడపాటిపై కారుకూతలతో కాటేసేందుకు ప్రదర్శించారు. లగడపాటి అన్నట్టు 65శాతం సమైక్యవాద పార్టీలకే పరకాలలో ఓట్లు లబించాయి. అక్కడ అసలు తెలంగాణా వాదమన్నదే గెలవలేదన్నది నగ్నసత్యం. మాజీమంత్రి జీవన్ రెడ్డి కూడా రెచ్చిపోయారు. పైగా ఆయన ఓ సలహా కూడా పడేశారు. ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే తెలంగాణా వచ్చేస్తుందని జీవన్ రెడ్డి గొప్పగా శెలవిచ్చారు. వెనుకటికి ఎవడో పిచ్చికుదిరింది తలకు రోకలిచుట్టమన్నట్లు ఈ రాజీనామాలు చేస్తే వచ్చేది ఎన్నికలే కానీ, తెలంగాణా రాష్ట్రం మాత్రం రాదని మేథావులు చెప్పినా పాపం జీవన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఇక టి.ఆర్.ఎస్.కి ఏమి మాట్లాడాలో తెలియని సారథి డైరెక్షన్ లో లగడపాటికి ఓ చిన్న హెచ్చరిక చేసి హమ్మయ్య ఆయన్ను బెదిరించేశాం. ఇక మనపని పూర్తయిందనుకుని చేతులు కడిగేసుకుంది.