కేంద్రమంత్రిపై అవినీతి ఆరోపణలు... చెప్పుతో కొడతారు..
posted on Dec 13, 2016 3:15PM

అరుణాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై అవినీతి ఆరోపణలు తలెత్తుతున్నాయి. స్థానిక చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఇటీవల ఓ రిపోర్ట్ ను విడుదల చేశారు. అందులో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్ రిజిజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రి కిరణ్ రిజిజు బంధువు, కాంట్రాక్టరైన గోబోయ్ రిజిజు, నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(ఎన్ఈఈపీజీఓ)కి చెందిన మరికొంత మంది అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రిజ్జూ నియోజకవర్గమైన వెస్ట్ కామింగ్లోనే 600 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ కాంట్రాక్ట్లో అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి రిజిజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై స్పందించిన కాంగ్రెస్ కేంద్ర మంత్రి వర్గం నుంచి రిజిజూను తొలిగించాలని డిమాండ్ చేసింది. రిజిజూ అవినీతికి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఆడియో టేపులు కూడా తమ దగ్గర ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆర్ఎస్ సూరెజ్వాలా తెలిపారు. పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 450 కోట్ల అవినీతి జరిగినట్లు సీవీసీ తన నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై స్పందించిన రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు అరుణాచల్ప్రదేశ్ వస్తే వారిని స్థానికులు చెప్పుతో కొడతారని మండిపడ్డారు. సొంత ప్రజలకు సాయం చేయడం అవినీతి అవుతుందా అని ఆయన ప్రశ్నించారు.