ఆంధ్రావారిపై తమిళుల ప్రశంసలు.. మొనగాళ్లంటే మీరే..
posted on Jan 21, 2017 9:36AM

తమిళనాడులో జల్లికట్టుపై పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళ తంబీలు మన తెలుగువారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి కారణం కోడి పందాలు నిర్వహించడమే. సుప్రీంకోర్టు జల్లికట్టుపై ఎలాగ నిషేదం విధించిందో.. కోడి పందాలపై కూడా అలాగే నిషేదం విధించింది. అయితే ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. కొన్ని చోట్ల కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి, మరికొన్ని చోట్ల కట్టకుండా మొత్తానికి పందేలైతే జోరుగా నిర్వహించారు. దీనికి గాను తమిళ యువత ''కోర్టు ఆదేశాలున్నా గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహించిన ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. అనుకున్నట్టే కోడి పందేలు పూర్తి చేశారు.. మేం మాత్రం ఇంకా జల్లికట్టు జరుపుకోలేకపోతున్నాం'' అంటూ నినాదాలు చేశారు. మగాళ్లంటే వాళ్లే అంటూ ముక్త కంఠంతో కొనియాడారు.
కాగా సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేదం విధించిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు మెరీనా బీచ్ దగ్గర ఆందోళన చేపట్టారు. దీనికి గాను కేంద్రం దిగొచ్చి జల్లికట్టు ఆడుకోవడానికి అనుమతినిస్తూ.. ఆర్డినెన్స్ పాస్ చేసింది. అయితే రాత పూర్వకంగా ఇస్తేనే కానీ.. ఆందోళన విరమించేది లేదని డీఎంకే పార్టీ నేతలు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.