పప్పులో కాలేసిన జగన్ భార్య... జగన్ అనుకొని..!
posted on Nov 20, 2017 10:42AM
పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని చూస్తే ఎవరిలా అనిపిస్తుంది... జాగ్రత్తగా చూడండి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫొటోలా అనిపించడం లేదు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది వైఎస్ జగన్ కాదు. పాపం జగన్ భార్య కూడా అలానే అనుకొని ఈ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరువాత పప్పులో కాలేసినట్టు తెలిసింది. ఆమె పొరపడిందో లేక... భారతి పేరుతో ట్విట్టర్ నిర్వహిస్తున్న వారి పొరపాటో, తెలియదు కానీ పాపం అడ్డంగా బుక్కయ్యారు. అసలు ఆ ఫొటో ఏంటీ...? ఆ స్టోరీ ఏంటీ...? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే.
YSBharathiReddy ఐడీతో ఓ ఫొటోని పోస్టే చేశారు. అందులో పచ్చని పొలాలలో జగన్ నీళ్లు తాగుతున్న ఫోటో పెట్టి This picture speaks more than anything..అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. తీరా చూస్తే అది జగన్ ఫొటో కాదని తేలిపోయింది. అది నంద్యాల సాక్షి టీవీ కంట్రిబ్యూటర్ ప్రదీప్ సాల్మన్రాజ్ ఫొటో అంట. అతన్ని జగన్ అనుకొని భ్రమపడి ఫొటోను పోస్ట్ చేశారట. ఇదిలా ఉంటే.. ఇక తన ఫొటో ను జగన్ ఫొటో అనుకొని పెట్టిన సాల్మన్ రాజ్ అయితే తన్ను అందరూ జగన్ అనుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అంటూ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఫొటో పెట్టి జగన్ ను ఏదో ఆకాశానికి ఎత్తేద్దామనుకున్న జగన్ అండ్ బ్యాచ్ కు గట్టి షాక్ తిగిలినంత పనైంది. అంతేకాదు కొంత మంది అయితే జోకులు కూడా పేల్చుకుంటున్నారు..? జగన్ పాదయాత్రకు సరైన స్పందన రావడంలేదని.. ఆ టెన్షన్ లోనే.. తన భర్తను కూడా పోల్చుకోలేని స్థితికి భారతి చేరిందని అంటున్నారు.
మరోవైపు.. ఓ రకంగా ఈ ఫొటో పెట్టి మంచి పని చేశారు అని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే.. ఫోటో చుట్టూ ఉన్న పచ్చని పంట పొలాలు, బోరు నుంచి ఉప్పొంగుతున్న నీరు.. కరువుసీమ రాయలసీమను రతనాల సీమగా మార్చిన టీడీపీ ప్రభుత్వ పాలనకు పచ్చని సంకేతంగా నిలుస్తోందని చెప్పుకుంటున్నారు. దీంతో జగన్ పాదయాత్ర చాలా నీరసంగా జరుగుతుంది... మళ్లీ ఈ ఫొటో పెట్టి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా మొత్తానికి జగన్ కు మాత్రం ప్రస్తుతం కాలం అస్సలు కలిసిరానట్టే ఉంది.