మరో పాదయాత్రకు ముద్రగడ రెడీ... పాదయాత్ర రూట్మ్యాప్ సీఎంకు పంపిస్తా...
posted on May 27, 2017 12:56PM
కాపునేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంతో కూడా వాదనకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన పాదయాత్ర చేయడానికి సిద్దపడినట్టు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన కారణంగా.. మరోదఫా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఛలో అమరావతిఃకి ఆయన పిలుపునిచ్చారు. జూలై 26న కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు తాను చేపట్టబోయే నిరవధిక పాదయాత్ర రూట్మ్యాప్ ముఖ్యమంత్రికే పంపిస్తామని అన్నారు. మరి గతంలో ఒకసారి ముద్రగడ ఇలానే పాదయాత్రను చేపట్టాలని చూశారు. కానీ అనుమతి రాకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. కోర్టు పాదయాత్ర చేయడానికి అనుమతినిచ్చి.. ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయితే ముద్రగడ పాదయాత్ర మాత్రం జరగలేదు. మరి ఈసారైనా పాదయాత్ర జరుగుతుందో..? లేదో చూద్దాం..?