జగన్ సాక్షికి చంద్రబాబునాయుడు సవాల్
posted on Jun 20, 2012 4:28PM
తమకు విదేశీ బ్యాంకులలో నల్లధనం ఉందన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికలో బుధవారం వచ్చిన కథనంపై స్పందించిన చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాపడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు సాక్షి దిన పత్రిక అవాస్తవ కథనాలు ప్రచురిస్తోందన్నారు. తనకు నల్లడబ్బు ఉందని, అకౌంట్లు ఉన్నాయని పేర్కొన్న పలు ఊర్లు, ఆ ఊర్లలో ఆయా వ్యక్తులు లేనే లేరన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోలా కృష్ణ మోహన్ కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కానీ తనకు వారు చెప్పినట్లుగా అకౌంట్లు ఉన్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు.
అవినీతి సొమ్ముతో పత్రికను పెట్టి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేరాల ఊబిలో చిక్కుకుపోయి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తమపై అనేకసార్లు విచారణ జరిపినా ఏమీ నిరూపించలేక పోయారని, వాస్తవాలు చెప్పే ధైర్యం లేక తనపై బురద జల్లుతున్నారని, సాక్షిలో పేర్కొన్న అకౌంట్లు తనవనే గట్టి విశ్వాసం ఉంటే వారు ఫిర్యాదు చేసుకోవచ్చునని చంద్రబాబు సూచించారు. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాకు నైతిక బలముందని, తామెక్కడా భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసేవారు సిగ్గుతో తలదించుకునే రోజు వస్తుందన్నారు.