ప్రభుత్వం కూలే వరకు చేరికలు కొనసాగుతాయి: బీజేపీ
posted on Jun 25, 2019 3:25PM
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ టీఎంసీ ఎమ్మెల్యే, దక్షిణ దినాజ్పూర్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ లిపికా రాయ్తో పాటు పలువురు జెడ్పీ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తొలిసారి బీజేపీ చేతికి ఓ జిల్లా పరిషత్ చిక్కినట్లైంది. దీనిపై బీజేపీ ముఖ్య నేత ముకుల్ రాయ్ స్పందిస్తూ.. ఇది ‘ట్రైలర్ మాత్రమే.. అసలు కథ ముందుంది’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలు కేవలం తొలి విడత మాత్రమేనని మున్ముందు మరింత మంది చేరతారన్నారు. మమత ప్రభుత్వం కూలే వరకు ఈ చేరికలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. అన్ని విడతల చేరికలు పూర్తయ్యే సరికి రాష్ట్రంలో టీఎంసీ మూలాలే ఉండవని వ్యాఖ్యానించారు.