ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. తూ.గో ఫస్ట్, నెల్లూరు లాస్ట్
posted on May 14, 2019 11:43AM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో.. కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 6,21,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 99.5 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 95.09 శాతం, బాలురు 94.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. 83.19 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి.