రణరంగం... పవన్ కళ్యాణ్ జపం!
on Aug 5, 2019
కాకినాడలో ఆదివారం సాయంత్రం శర్వానంద్ కథానాయకుడిగా నటించిన 'రణరంగం' ట్రైలర్ విడుదల చేశారు. అయితే... అక్కడ ట్రైలర్ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ డిస్కషన్ పాయింట్ అయ్యారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం! రెండు... పవన్ సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం!
రాజకీయ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి కాకినాడకు పవన్ కళ్యాణ్ విమానంలో వెళ్లారు. అదే విమానంలో రణరంగం ట్రైలర్ విడుదల కార్యక్రమానికి శర్వానంద్ వెళ్లారు. అప్పుడు ఇద్దరూ కలిశారు. పవన్ తో కలసి దిగిన ఫోటోను శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ట్రైలర్ విడుదల కార్యక్రమం కంటే ముందే పవన్-శర్వా ఫోటో ఇంటర్ నెట్ లో వైరల్ అయింది. దీనికి తోడు ట్రైలర్ విడుదల కార్యక్రమంలో శర్వానంద్ సినిమా గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. "ఉదయం కాకినాడకు వస్తుంటే ఎయిర్పోర్ట్లో పవన్ కల్యాణ్గారిని కలిశా. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన సినిమా షూటింగులకు వెళ్లాను. ఆయన ఎలా చేస్తారు? ఏం చేస్తారు? వంటివి తెలుసుకోవడం కోసం! మళ్లీ ఈ రోజు ఎయిర్పోర్ట్లో ఆయన్ను కలిశా. ‘శర్వా ఎలా ఉన్నావ్? నువ్వు బాగా చేస్తున్నావ్! ఆల్ ది బెస్ట్’ అన్నారు. నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు ఇది. పవన్ గారి సింప్లిసిటీకి హ్యాట్సాఫ్. ఉదయం వస్తుంటే 'పవన్ గారు మనతో ఎకానమీ క్లాస్లో ప్రయాణించడం ఏంటి? ఆయన పవర్స్టార్ కదా. ప్రయివేట్ జెట్లు ఉంటాయి కదా' అని కల్యాణీ ప్రియదర్శన్ అడిగింది. అవన్నీ వదులుకుని వచ్చారని చెప్పాను. ప్రజల కోసం వచ్చారు. ఆయన దగ్గర సింప్లిసిటీని మనమంతా నేర్చుకోవాలి" అని శర్వానంద్ అన్నాడు. దాంతో కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులంతా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ హంగామా చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడడానికి ముందు కార్యక్రమం జరిగిన ప్రాంగణమంతా పవర్ స్టార్ నామస్మరణతో మార్మోగింది. 'అన్నా... మా దేవుడితో మళ్ళీ ఒక్క సినిమా తీయ్' అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు త్రివిక్రమ్ కు విజ్ఞప్తి చేశారు. అదీ సంగతి!