English | Telugu
'కళ్యాణ వైభోగం' కహానీ: దివ్య మరణం తథ్యమా?
Updated : Jul 14, 2021
దివ్య మరణం తథ్యమా? శాపం ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుందా? చెల్లి ప్రాణం కాపాడటం కోసం అభి ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు? 'కళ్యాణ వైభోగం' సీరియల్ లో మంగళవారంనాటి ఎపిసోడ్ ముగింపు ప్రేక్షకులను మునివేళ్లపై ఉంచిందని చెప్పాలి. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియళ్లలో జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే 'కళ్యాణ వైభోగం' ఒకటి.
అన్నాచెలెళ్లు అభి, దివ్య సహా వాళ్ళ కుటుంబ పతనమే పరమావధిగా, తన ప్రాణరక్షణే ధ్యేయంగా నిత్యా శ్రీనివాస్ వేసిన పథకం ఫలించింది. దివ్య కుటుంబానికి ఉన్న శాపం ప్రకారం... ఆ ఇంటికి వచ్చే కోడలు మరణిస్తుంది. కానీ, ఈసారి శాపం దివ్యకు కూడా ఉందని పురోహితులు చెబుతారు. అది తెలిసిన చారి పక్షవాతం బారినపడి మంచానికి పరిమితం అవుతాడు. మరోవైపు శాపం గురించి నిత్యా శ్రీనివాస్ చెవిన పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే... దివ్య ప్రాణాలతో ఉండాలంటే ఆమెకు పెళ్లి కాకూడదు. పెళ్ళైతే మరణిస్తుంది. ఒకవేళ దివ్యకు పెళ్లి కాకపోతే నిత్యా శ్రీనివాస్ మరణిస్తుంది. ఇది తెలుసుకున్న నిత్యా, అక్క కూతురు మెడలో మూడు ముడులు పడేలా పావులు కదుపుతుంది. చాణక్యకు కోపం వచ్చేలా చేసి, అతడిని దివ్య ఇంటికి పంపిస్తుంది.
ఆవేశంతో దివ్య, అభిల ఇంటికి వెళ్లిన చాణక్య... దివ్య మెడలో తాళి కడతాడు. శాపం గురించి దివ్య, ఇతర కుటుంబ సభ్యులకు తెలియనప్పటికీ... అభికి తెలుసు. తన ముందే చెల్లెలు మెడలో మూడు ముడులు పడటంతో షాక్ తింటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మరి, తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. సీరియల్ లో మేజర్ ట్విస్ట్ ఇది. ఇప్పుడు దివ్య మరణం తథ్యమా? చెల్లి ప్రాణాలు అభి కాపాడలేడా? అని అందరూ చర్చల్లోకి దిగారు. రాబోయే రోజుల్లో సీరియల్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.