English | Telugu
'సింహాద్రి' హీరోయిన్ అంకిత ఇప్పుడేం చేస్తోంది?
Updated : Oct 25, 2020
1980లలో రస్నా డ్రింక్ యాడ్లలో "ఐ లవ్ యు రస్నా" అంటూ అలరించి రస్నా బేబీగా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించేసింది చిన్నారి అంకితా జవేరి. అదే అమ్మాయి ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో అంకిత అనే స్క్రీన్ నేమ్తో హీరోయిన్గా అడుగుపెట్టింది. వై.వి.ఎస్. చౌదరి డైరెక్ట్ చేసిన 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అంకిత. తన బబ్లీ లుక్స్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియెన్స్ను ఆకట్టుకున్న ఆమె తర్వాత కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'సింహాద్రి'లో భూమికతో పాటు మరో హీరోయిన్గా అలరించింది. అంతేకాదు, ఆ తర్వాత 'విజయేంద్రవర్మ'లో బాలకృష్ణ సరసనా ఆడి పాడింది.
2005లో 'మనసు మాట వినదు' సినిమా సెట్స్పై హీరో నవదీప్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది అంకిత. అది కాంట్రవర్సీ విషయంలో ఆమెకు సపోర్ట్గా ఆ సినిమా యూనిట్లో ఎవరూ ముందుకు రాలేదు. డైరెక్టర్ వి.ఎన్. ఆదిత్య సైతం నవదీప్కే మద్దతుగా నిలిచాడు. ఈ ఘటన తర్వాత ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి. 2009 తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.
చివరకు 2016లో ఆమె విశాల్ జగ్దీప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అతను అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జె.పి. మోర్గాన్ అండ్ చేజ్లో వైస్ ప్రెసిడెంట్. ముంబైలో 28 మార్చిన వారి వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె భర్తతో పాటు న్యూజెర్సీ వెళ్లిపోయినట్లు సమాచారం.