English | Telugu

సూర్యకాంతంను ఈతరం ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి!

సూర్యకాంతంను ఈతరం ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి!

గయ్యాళి అత్తగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న దివంగత నటి సూర్యకాంతం శతజయంతిని పురస్కరించుకుని చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లో శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'తెలుగింటి అత్తగారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యకాంతంకు నివాళులర్పించిన ఆయన, చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభమూర్తిని అభినందించారు.

తెలుగు సినిమా ప్రపంచంలో ప్రత్యామ్నాయం లేని నటుల్లో సూర్యకాంతం మొదటి వరుసలో ఉంటారని, వారి ఆహార్యాన్ని, వాచకాన్ని అనుకరించటం కూడా కష్టమేనని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. గుండమ్మకథ లాంటి చిత్రానికి ఆమె పాత్ర పేరు పెట్టడమే వారికి సినీరంగం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేసిందని అన్నారు. సూర్యకాంతం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిందని తెలిసి, నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత తమ అధికారిక కార్యక్రమాన్ని కూడా అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్ళి, వారి పార్థివదేహాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉన్న సూర్యకాంతం గారి వ్యక్తిగత జీవితాన్ని ఈతరం ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆమె చేసిన గుప్తదానాలు, సొంత ఊరిని మరువకపోవటం, నలుగురి ఆకలి తీర్చటం వంటివి ఆదర్శనీయమైనవని వెంకయ్యనాయుడు తెలిపారు.

'గుండమ్మకథ'ను తర్వాత నందమూరి, అక్కినేని కుటుంబ సభ్యులు రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ, సూర్యకాంతంకు ప్రత్యామ్నాయ నటి దొరకక డ్రాప్ అయ్యారని ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గుర్తు చేశారు. ప్రపంచంలో సూర్యకాంతం అనే పేరు ఒక్కరికే ఉందని, అలాంటి నటి ఒక్కరే ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో విజయా ప్రొడక్షన్స్ నిర్వాహకులు కె.విశ్వనాథ రెడ్డి, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారెడ్డి, అలనాటి నటీమణులు రాజశ్రీ, జయచిత్ర, ఆర్కిటెక్స్ ఆదిశేషయ్య, సూర్యకాంతం శతజయంతి కమిటీ సభ్యులు, సూర్యకాంతం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సూర్యకాంతంను ఈతరం ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి!