English | Telugu

రిషబ్‌శెట్టిని చూసి ఇండియన్‌ డైరెక్టర్స్‌ సిగ్గు తెచ్చుకోవాలి.. ఆర్జీవీ సంచలన ట్వీట్‌!

రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి ప్రీక్వెల్‌గా రూపొందించిన ‘కాంతార చాప్టర్‌1’ దసరా కానుకగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకులే కాదు, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని చూసి ప్రశంసిస్తున్నారు. రిషబ్‌శెట్టి ఒక కొత్త లోకాన్ని పరిచయం చేశాడంటున్నారు. డైరెక్టర్‌గా, నటుడిగా తన ప్రతిభను మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడని అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తన కామెంట్స్‌తో, ట్వీట్స్‌తో వివాదాలను కొని తెచ్చుకునే రామ్‌గోపాల్‌వర్మ.. మరోసారి తన ట్వీట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘కాంతార చాప్టర్‌1’పై తన ఒపీనియన్‌ చెబుతూ.. ‘రిషబ్‌శెట్టిని చూసి ఇండియన్‌ డైరెక్టర్లందరూ సిగ్గు పడాలి. ‘కాంతార’ ఒక అద్భుతమైన సినిమా. సినిమాటోగ్రఫీ, సౌండ్‌ డిజైన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, విఎఫ్‌ఎక్స్‌.. ఇలా ప్రతి విషయంలోనూ టీమ్‌ వర్క్‌ కనిపించింది. వారి కృషి ఫలితంగానే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయింది. ఈ విషయంలో టీమ్‌కి సహకరించిన హోంబలే ఫిలింస్‌ని అభినందించాలి. సినిమా చూసిన తర్వాత రిషబ్‌ యాక్టర్‌గా గొప్పవాడా? డైరెక్టర్‌గా గొప్పవాడా అనే విషయాన్ని నేను తేల్చుకోలేకపోతున్నాను’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు రామ్‌గోపాల్‌వర్మ.