English | Telugu
పోలీసు వారి హెచ్చరిక.. ఎవరికి? ఎందుకు?
Updated : Nov 17, 2023
బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్న 'పోలీస్ వారి హెచ్చరిక' చిత్రం సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది. రెగ్యులర్ గా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ముహూర్తాలు, సాంప్రదాయ పద్ధతులకు, అట్టహాసాలకు భిన్నంగా దసరా పండగ రోజున "సినీ కళామతల్లికి జై... వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ... వర్ధిల్లాలి భారతీయ సినీ పరిశ్రమ" అనే నినాదాల మధ్య ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
"దసరా రోజున ప్రారంభమైన ఈ చిత్రం తాలుకు షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాదు, ఘట్ కేసర్, షామీర్ పేట తదితర ప్రదేశాలలో జరుపుకుంటూ 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో సినిమాలోని కీలక ఘట్టాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్ లను చిత్రీకరించాం. డిసెంబర్ మొదటివారం నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. న పిల్లలకు, మన కుటుంబానికి పంచే ప్రేమలో కొంతయినా మన చుట్టూ వుండే అనాథ బాలలకు పంచకపోతే, ఆ అనాథలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్థులుగా మారే ప్రమాదం వుందనే సందేశం అంతర్లీనంగా సాగుతూ, పూర్తి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం." అని దర్శకుడు బాబ్జీ తెలిపారు.
"భారత సైన్యంలో దేశరక్షణ కోసం పని చేసిన నేను మొట్టమొదటి సారిగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాను. దర్శకులు బాబ్జీ చెప్పిన కథలో వున్న సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప సందేశం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. నటీనటులు, సాంకేతిక వర్గం మనస్ఫూర్తిగా అందిస్తున్న సహకారంతో ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తున్నాము. పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతున్న అజయ్ ఘోష్ గతంలో ఏ చిత్రంలోనూ చేయని గొప్ప పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారని, ఆ పాత్ర ఈ చిత్రానికే ఆయువు పట్టు లాంటి పాత్ర" అని నిర్మాత బెల్లి జనార్ధన్ పేర్కొన్నారు.
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గజ్వేల్ వేణు సంగీతం అందిస్తుండగా.. డీఓపీగా కొండపల్లి నళినీకాంత్, ఎడిటర్ గా శివ శార్వాణి వ్యవహరిస్తున్నారు.