English | Telugu
ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే.. చప్పట్లు కొట్టాల్సిందే!
Updated : Oct 15, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, కొన్ని సన్నివేశాలు చూసి ఎవరైనా కంటతడి పెట్టాల్సిందేనని అన్నారు.
"దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలను ముందు నుంచి గమనిస్తున్నాను. అతను నా అభిమాని. మా అన్నయ్య గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ తో 'పటాస్' అనే తీశాడు. అందులో నా సాంగ్ రీమిక్స్ కూడా పెట్టాడు. ఆ తర్వాత 'రాజా ది గ్రేట్', 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు' ఇలా సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'భగవంత్ కేసరి' చిత్రం మరింత వైవిధ్యంగా ఉంటుంది. నాకు సరిపోయే కథను అనిల్ నా దగ్గరకు తీసుకొచ్చాడు. దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని, ఎంతో హోం వర్క్ చేసి ఈ సినిమా తీశాం. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ చిన్న విరామం తరవాత కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అద్భుతమైన పాత్ర పోషించారు. అలాగే శ్రీలీల పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. బోర్న్ ఆర్టిస్ట్. నాకు, శ్రీలీలకు మధ్య బరువైన సన్నివేశాలు ఉంటాయి. గ్లిజరిన్ వాడకుండా మేం ఆ సన్నివేశాల్లో నటించాం. ఇక థియేటర్లలో ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తారు. ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి కంటతడి పెట్టుకుంటూ బయటకు రావాల్సిందే. థియేటర్ లో ఒక్కో సన్నివేశానికి నిలబడి చప్పట్లు కొడతారు. నాకు, శ్రీలీల మధ్య సన్నివేశాలు అంత అద్భుతంగా ఉంటాయి. అర్జున్ రామ్ పాల్ పర్ఫామెన్స్ అదరగొట్టాడు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన ఆయన తెలుగులో మొదటిసారి నటించారు. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. సినిమా గురించి చాలా ఎక్సైట్ అవుతున్నాను. విడుదలయ్యాక మీకు అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. నా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. రెండో గెటప్ ఉంటుంది, అది సినిమాలో చూస్తారు." అని బాలకృష్ణ అన్నారు. బాలయ్య మాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.
