English | Telugu
Varanasi: శ్రీరాముడిగా మహేష్ బాబు.. ఆ 25 నిమిషాలు ఎప్పటికీ మర్చిపోలేరు!
Updated : Feb 4, 2026
వారణాసిపై రోజురోజుకి పెరిగిపోతున్న అంచనాలు
శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న మహేష్
ఆ 25 నిమిషాలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరన్న రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'వారణాసి'(Varanasi). కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్, 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వారణాసి'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మహేష్, రాజమౌళి ఈ చిత్ర వివరాలను పంచుకొని అంచనాలను మరింత పెంచేశారు.
'వారణాసి' మూవీ టీమ్ తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి మహేష్ మాట్లాడుతూ.. "15 ఏళ్ళ క్రితమే రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇంతకాలానికి కుదిరింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాది పాటు ఈ స్క్రిప్ట్ గురించి ఆలోచించారు. ఈ కథ విని నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటిదాకా రాజమౌళి చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైం ట్రావెల్ ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. మొదట ఇందులో హీరోగా చేయడానికి భయపడ్డాను. రాజమౌళి నా భయాన్ని పోగొట్టారు. ఈ సినిమాలో నేను రాముడిగా కనిపిస్తాను. రాముడి పాత్ర కావడంతో నిలబడే విధానం దగ్గర నుంచి నటించడం వరకు పర్ఫెక్ట్ గా ఉండటం కోసం ఎన్నో రిహార్సల్స్ చేశాం." అన్నారు.
ఇక రాజమౌళి మాట్లాడుతూ.. "నాకున్న వేరే కమిట్ మెంట్స్ కారణంగా మహేష్ తో సినిమా 15 ఏళ్ళు ఆలస్యమైనా.. ఇప్పుడు 'వారణాసి'ని భారీస్థాయిలో రూపొందిస్తున్నాం. ఈ మూవీ రన్ టైం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఇంత ఎక్కువ రన్ టైంలో మూడు నిమిషాలు ఆసక్తికరంగా లేకపోయినా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుకే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా.. ప్రతిక్షణం ఆసక్తికరంగా, కొత్త అనుభూతిని పంచేలా దీనిని రూపొందిస్తున్నాం. వారణాసిలో 25 నిమిషాలు పురాణాలపై చిత్రీకరించాం. ఆ సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు." అని చెప్పుకొచ్చారు.